మెట్రో పేరు కోసం చంద్రబాబు పాట్లు

ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ల నాలికకు నరం లేదు అంటారు. మరి నోట్లో నరాలు తెగేన్ని అబద్ధాలు ఆడేవాళ్లని చంద్రబాబు అనాలేమో…! మెట్రో రైలు హైదరాబాద్ కు రావడానికి కారణం నేనే అంటూ చంద్రబాబు చెబుతుంటే విన్న విలేఖరులు కూడా విస్తుబోయారు. నాటి కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును బెంగుళూరు, అహ్మదాబాదులకు మాత్రమే సాంక్షన్ చేస్తే అందులో హైదరాబాద్ పేరును కూడా చేర్చడానికి తానెంతో పోరాడానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. 
అసలు నిజం ఏమిటంటే హైదరాబాద్ మెట్రో గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. ఊరుకుంటే గోల్కొండ కోటను, చౌమహల్లా పాలెస్ నూ నేనే కట్టించానని చెప్పుకోగలడు చంద్రబాబు అంటున్నారు కొందరు సొంత పార్టీ నేతలు. 

నిజానికి హైదరాబాద్ లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి బీజం పడింది వైయస్సార్ హయాంలోనే. అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్రాఫిక్ పై దృష్టిసారించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. 2005, 2006లో ఫ్లైఓవర్లు నిర్మించారు. పంజాగుట్ట, నల్గొండ క్రాస్ రోడ్స్, మెహిదీపట్నం ఫ్లై ఓవర్లను త్వరితంగా పూర్తి చేసి ప్రజలకందించారు. దాని తర్వాత అధికారులతో చర్చించి మెట్రో రైలు ప్రతిపాదన చేసారు. అప్పటి కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి మాంటెక్ సింగ్ అహ్లువాలియా, సీనియర్ ఐఎఎస్ అధికారి గజేంద్ర హల్దియా, పురపాలక శాఖ కార్యదర్శి ఎస్పీసింగ్ తో వరుస సమావేశాలు జరిపారు. హైదరాబాద్ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని సమర్థవంతంగా నిర్వహించిన GHMC అడిషనల్ కమీషనర్ ఎన్వీఎస్ రెడ్డిని మెట్రో ప్రాజెక్టుకు ఎంపిక చేసారు.

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారులతో చర్చించి నిర్మాణ వ్యయం, అనుమతులు, భూ సమీకరణ వంటి విషయాలపై స్పష్టత తీసుకున్నారు వైయస్సార్. 2008లో పిపిపి పద్ధతిలో బిడ్లు పిలిచింది నాటి వైయస్సార్ గవర్నమెంట్. 72కి.మీల మేర మూడు రూట్లలో నిర్మాణం, అంచనా వ్యయం 12132 కోట్ల రూపాయిలుగా ప్రకటించారు. రిలయిన్స్ తో సహా దేశవ్యాప్తంగా ఉన్న బడా కంపెనీలెన్నో బిడ్లు దాక్షలు చేసాయి. 

సత్యం అనుబంధ సంస్థ అయిన మేటాస్ సర్కారు మెట్రో ఖర్చే ఏదీ భరించాల్సిన అవసరం లేదంటూ బిడ్ ఇచ్చింది. 2008 సెప్టెంబర్ 19న మేటాస్ తో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఒప్పందం కూడా జరిగింది. కానీ మాతృ సంస్థ సత్యం అనూహ్యంగా దెబ్బతినడంతో మేటాస్ వెనక్కి తగ్గింది. దాంతో 2009లో ప్రభుత్వం మేటాస్ తో ఒప్పందం రద్దు చేసుకుని, 2010లో అంచనా వ్యయాన్ని 14,132 కోట్లకు పెంచి రెండోసారి టెండర్లు పిలిచింది. అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2010 సెప్టెంబర్ లో మెట్రో రైలు నిర్మాణ ఒప్పందం ఎల్ అండ్ టి తో జరిగింది. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఎవరికి చెప్పి, హైదరాబాద్ కు  మెట్రో ప్రాజెక్టును సాంక్షన్ చేయించారా అని జనాలు జుట్టు పీక్కుంటున్నారు. 

Back to Top