హోదా పై నారా నాటకం


మంత్రగాడు, మాయగాడు, గారడీ వాడిలా ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు. ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ ఈ రెండు మాటలను కలగాపులగంగా వాడేస్తున్నారు. హోదా కావాలని ఒకసారి, అక్కర్లేదని మరోసారి అంటారు. అంతలోనే హోదా సంజీవనా, అంతకంటే మించి ప్యాకేజీ ఉందంటారు. అదీ అయ్యాక హోదా ప్యాకేజీ సమానం అంటారు. ఆ తర్వాత రెండూ సమానమే అనుకున్నాను అంటారు. కొన్ని రాష్ట్రాలకు హోదా పొడిగిస్తుంటే మనకెందుకు ఇవ్వరు అని అమాయకంగా ముఖం పెట్టి ప్రశ్నిస్తారు. తాజాగా హోదా ఏమొస్తాయి? అని మరో ప్రశ్న లేవనెత్తారు. హోదా అంటే పోలవరానికి డబ్బులు రావు, లోటు బడ్జట్ నిధులు రావు అన్నాడు. అంతలోనే హోదాను ఓ హక్కుగా మాత్రమే కోరుతున్నా అన్నాడు. గుంటూరు సభలో ఆఖరి బడ్జెట్ కూడా అయిపోయింది. కేంద్రం హ్యాండ్ ఇచ్చింది అన్నాడు. మళ్లీ అదే ప్రసంగంలో అవసరమైతే ఎన్ని త్యాగాలకయినా సిద్ధం అన్నాడు. 
మీకేమైనా అర్థం అయ్యిందా. లేదు కదూ. బాబు ఏ స్టాండ్ తీసుకున్నాడో ఓ క్లారిటీ లేదు కదా. ఎస్ మనకు ఆ క్లారిటీ లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యం. అందుకే అటు అంటాడు, ఇటూ అంటాడు. ఏమిటంటే అటూ ఇటూ ఎటో అని తప్పించుకుపోతాడు. ఏ సమయానికి ఏది అనుకూలమో దాన్ని అనుసరిస్తాడు. తర్వాత అది బెడిసి కొడితే దాని ఊసెత్తడం మానేస్తాడు. హోదా విషయంలో చంద్రబాబు నాలిక ఎన్ని మెలికలు తిరుగుతోందో లెక్కేలేదు. 

ఒక్క హోదా విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా బాబు ఇలాగే తింగిరి నంగిరిగా మాట్లాడతాడు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులకు లెక్కలు చూపించమని అడిగితే, క్లిష్ట సమయంలో లెక్కలు అడుగుతున్నారు అన్నాడు. ప్రభుత్వం అసెంబ్లీకో, పార్లెమెంటుకో చెబుతుంది గానీ ఎవరు పడితే వాళ్లకు చెప్పదన్నాడు. కానీ సాయంత్రానికల్లా 118 పేజీల లెక్కల చిట్టాని పవన్ పెట్టిన నిజనిర్థారణ కమిటీకి పంపాడు. బాబు నోట్లో పలికేదొకటి, అమలులో జరిగేదొకటి. బాబు చెప్పింది ఎప్పుడూ చేయడు, చేసేది ఎప్పుడూ చెప్పడు. అంతా మతలబుల వ్యవహారం. హోదా కోసం ప్రతిపక్ష నేత ఉద్యమిస్తున్నారు. రాష్ట్రాన్ని ఏకం చేస్తున్నారు. కేంద్రాన్ని నిలదీస్తున్నారు. దాంతో దిక్కులేక హోదా ప్యాకేజీ ఒకటే అనుకున్నాం అని, మళ్లీ హోదాతో ఏమొస్తుందీ, ప్యాకేజే బావుంటుంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ప్రత్యేక హోదాపై పోరాడుతన్నట్టు చెబుతూనే, హోదా ఉపయోగం లేనట్టు మాట్లాడుతున్నాడు. ఇదీ బాబు ఊసరవెల్లి వాటం. 

హోదా గురించి కొన్ని నిజాలు 

జిఎస్టీకి హోదాకి సంబంధం లేదు
హోదా కోసం చట్ట సవరణ అవసరం లేదు
హోదాకి కావాల్సిన అన్ని అర్హతలూ ఆంధ్రప్రదేశ్ కి ఉన్నాయి.
ప్యాకేజీకి హోదాకీ సంబంధం లేదు  హోదా ప్యాకేజీ సమానం కాదు
హోదా వస్తే సామాన్యుడికి ఉపయోగం  ప్యాకేజీ వల్ల బాగు బాగుపడతాడు

హోదా  మరిన్ని ఉపయోగాలు

పారిశ్రామిక, సేవా రంగాల్లో సబ్సిడీలు వస్తాయి. పెట్టుబడి రాయితీలు, వడ్డీపై రాయితీ, బీమా ప్రీమియం చెల్లింపుల్లో రాయితీ, ఆదాయపన్ను మినహాయింపు, ఎక్సైజ్ సుంకం చెల్లించక్కర్లేదు. వ్యవసాయ రంగంలో కొన్ని ఎరువులపై సబ్సిడీ, నీటిలో కలిపి పిచికారీ చేసే ఎరువులకు సబ్సిడీ దొరుకుతుంది. పంట బీమాలో 50శాతం కేంద్రం అందిస్తుంది. పాడిపరిశ్రమలో ప్రతి రైతుకు 2 గొర్రెలు ఉచితంగా ఇస్తుంది. ఇవి కాక కేంద్రం ప్రవేశపెట్టిన 17 రకాల స్కీంల లాభాలు లభిస్తాయి. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు వంటివి ఎస్.సి, ఎస్.టి వర్గాల రైతులకు 50% సబ్సిడీకి అందిస్తుంది. మిగిలిన రైతులకు 90%లో వడ్డీ మినహాయింపు, ఇంకా 10%గ్రాంటు ఇస్తుంది. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. వ్యవసాయాధారిత పరిశ్రమలు పెరుగుతాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ప్రత్యేక హోదా వల్లే లభిస్తాయి. ఇదే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గత నాలుగేళ్లుగా చెబుతున్నది. వాస్తవాలు ఇలా ఉంటే హోదా ఎందుకు, హోదాతో ఏమొస్తుంది అంటూ బాబు, టిడిపి నాయకులు వితండ వాదాలు చేస్తున్నారు. ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూస్తున్నారు. 
నిజానికి ప్రత్యేక హోదాకేవీ ప్రత్యామ్నాయం కాదు. అన్ని వేల కోట్లు తెచ్చాం, ఇన్నివేల కోట్లు ఇచ్చారు అని, అంచనాలు పెరిగిన ప్రాజెక్టులకు ఖర్చులయ్యాయని తికమక పెట్టేసి, హోదా కంటే ప్యాకేజే మేలని అనిపించేయాలని చంద్రబాబు తెగ తాపత్రయ పడుతున్నారు. కామధేనువు లాంటి హోదాను కాదని, ఎందుకూ కొరగాని ప్యాకేజీకి కక్కుర్తి పడుతున్నారు. 





 
Back to Top