గొంతు చించుకుంటున్న బాబు

మెత్తగున్నోళ్లను చూస్తే మొత్తబుద్ధైందన్నట్టు.... బీజేపీ మీద
నోరు పారేసుకుంటున్నాడు బాబు. గతంలో కంటే మరింత బలంగా విమర్శలు చేస్తున్నాడు. ఎన్నికలు
దగ్గరపడుతున్న వేళ రాష్ట్రవిభజన హామీలు నెరవేరకపోవడానికి కేంద్రం తప్ప మరెవ్వరూ కారణం
కాదని ఎలాగైనా ఒప్పించాలనుకుంటున్నాడు. పదే పదే బీజేపీని
తిడుతూ ఆ విషయాన్ని బలవంతంగా ప్రజల మెదళ్లలోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నాడు. గడిచిన నాలుగేళ్లలో
భాజాపా చేసింది మొత్తం శూన్యం అని విరుచుకుపడుతున్నాడు. స్వచ్ఛ భారత్
అద్భుతమైన కార్యక్రమం అని పొగిడిన సంగతి మరిచిపోయాడు. మోదీ పిలుపు
అందుకుని ఎపిలో స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సంగతినీ గాలికొదిలేశారు. నోట్లరద్దు
అయిన వెంటనే తానే పెద్ద నోట్లు రద్దు చేయమని సలహా ఇచ్చాను అని చెప్పిన సంగతి కూడా బాబుకు
ఇప్పుడు గుర్తుకు రావడం లేదు. కేవలం తన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి కేంద్రంపైకి నెపం నెడుతున్న
చంద్రబాబు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. నిజంగా కేద్రమే రాష్ట్రన్ని
మోసం చేసింది నిజమైతే నాలుగేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకంటే ఎపికే ఎక్కువ
ఇచ్చిందని చంద్రబాబు ఎందుకన్నట్టు? కేంద్రంలో ఉన్నది టిడిపికి మిత్రపక్షం. మిత్రపక్షం
కేంద్రంలో ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోలేని చంద్రబాబుది చేతకానితనం కాదా? పైగా ఎపికి
హక్కుగా సంక్రమించాల్సినవి, పునర్విభజన చట్టంలో ఉన్నహామీలనే బాబు తన మిత్రపక్షం నుండి సాధించలేకపోయాడు. ఇక ఆ పార్టీనుంచి
బైటికొచ్చి మాత్రం సాధిస్తాడని నమ్మకమేంటి?

బీజేపీ అసహాయత

బాబు పదేపదే బీజేపీ మీద విమర్శలు చేస్తున్నా గతంలోలా ఆ పార్టీనేతలు
చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వలేని పరిస్థితిలో పడ్డారు. అందుకు కారణం
నేటి బీజేపీ రాజకీయ పరిస్థితులే. గుజరాత్ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం కనిపించింది. కర్ణాటకలో
రాంగ్ స్టేటజీతో బీజేపీ మట్టికరిచింది. బాబుకు ఇది కలిసి
వచ్చిన అంశం అయ్యింది. టిడిపి అధినేతతో పాటు ఆ పార్టీ నేతలు ఇప్పుడు బీజేపిని వీరలెవల్లో
తిడుతున్నారు. ఎపిలో బిజెపి నేతలు రోడ్డు మీద తిరగలేరంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ
ఒకరు హెచ్చరికలు కూడా జారీ చేసారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తిరుపతి వచ్చిన అమిత్ షాపై టిడిపి కార్యకర్తలు
దాడి చేసారు.

బాబు కుప్పిగంతులు

సోము వీర్రాజు పురంధరేశ్వరి ఇద్దరూ ఈమధ్య తారాస్థాయిలో చంద్రబాబు
మీద విరుచుకుపడ్డారు. బీజేపీ మోసం చేసిందని బాబు విమర్శించిన వెంటనే వీరు ప్రతివిమర్శలకు
దిగారు. బాబు చెప్పిన వాటిలో నిజం లేదని, కేంద్రం
ఇచ్చిన నిధులకు బాబు లెక్కలు ఇవ్వలేదని, బాబు అవినీతి విశ్వరూపం
మాకు తెలుసని కుండ బద్దలు కొట్టారు. కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావులు
కూడా టిడిపి అధినేతపై అడపాదడపా విమర్శలు చేస్తూనే ఉన్నారు. విష్ణుకుమార్
రాజ్ చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న గవర్నరై వైఖరిని కూడా తప్పు పడుతూ వచ్చారు. గవర్నర్
తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని కూడా అన్నారు. ఒకానొక టైమ్
లో బాబు చంద్రబాబు మీద సిబిఐ ఎంక్వైరీ ఉంటుందని కూడా ప్రచారం సాగింది. పోలవరం, పట్టిసీమ
అవినీతి గురించి బీజేపీ తవ్వి తీయనుందని, బాబు కేసులు తిరగదోడే
పనిలో ఉందని కూడా బీజేపీ నేతలు అల్టిమేట్టాలు ఇచ్చారు. బెంబేలు
పడిపోయిన బాబు అప్పుడు బీజేపితో కాళ్లబేరం మాటలు మాట్లాడాడు. అమిత్ షా
లేఖపై కూడా తన అవినీతి కంటే వారి అవినీతి ఎక్కువ అన్న చందంగా సన్నాయి నొక్కులు నొక్కాడు. నన్ను మీరే
కాపాడుకోవాలి అంటూ ప్రజల మీదకే తన రక్షణ బాధ్యతను నెట్టే ప్రయత్నం చేసాడు. తన అవినీతి
భాగోతాలపై బీజేపీ దర్యాప్తుకు ఆదేశిస్తే దాన్ని తెలుగు జాతిపై దాడిగా చిత్రీకరించేందుకు
చాలా రంగం సిద్ధం చేసుకున్నాడు కూడా. కానీ కర్ణాటక ఎన్నికల ప్రభావం బీజేపీ నేతల దూకుడుకు కాస్త కళ్లెం
వేసినట్టైంది. ఇదే అదునుగా బాబు నోరు పెరిగిపోయింది. అవకాశం ఉన్నప్పుడే
పాచిక పారేలా చేయాలనుకున్నబాబు, కేంద్రం నోరెత్తలేని సమయం చూసి నోరుపారేసుకుంటున్నాడు. ఇదంతా చూస్తే
కుంటి సింహం ముందు చిట్టెలుక చిందులేసినట్టుంది అని సణుక్కుంటున్నారట బీజేపీ నాయకులు. 

తాజా వీడియోలు

Back to Top