జనం చెవిలో... అమరావతి పువ్వు

– గ్రాఫిక్స్‌లోనే రాజధాని నిర్మాణం
– బాబు కాలక్షేపంతో కాంట్రాక్టర్‌కు కాసుల పంట
– సినిమా డైరెక్టర్లను పిలిపించి కార్యక్రమాల రూపకల్పన
– మూడేళ్లలో ఒక్క శాశ్వత నిర్మాణమూ లేదు 

సింగపూర్‌ తరహాలో అమరావతి.., ఇస్తాంబుల్‌ తరహాలో అమరావతి.., టోక్యో తరహాలో అమరావతి.., కౌలాలంపూర్‌ తరహాలో అమరావతి.., ఆఖరికి కొలంబో తరహాలో అమరావతి.. మూడేళ్లుగా ఇదే గోల. మూడేళ్లలో దాదాపు 16 విదేశీ పర్యటనలు చేసొచ్చాడు. జనం సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో విహరించాడు. కొన్నిసార్లయితే ఎక్కడికి వెళ్లే సంగతి కూడా జనానికి తెలియకుండా కుటుంబంతో సహా అత్యంత రహస్యంగా వెళ్లివచ్చాడు. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత సంబరంగా ఉంటదో.. చంద్రబాబు చేతిలో జనం అమరావతిని పెట్టారు. ఏం చేయాలో క్లారిటీ ఆయనకు లేదు.. అసలు చేస్తాడనే నమ్మకం జనం కోల్పోయారు. 

నాన్చీ.. నాన్చీ.. మురుగున పడేస్తాడు..
ఏ విషయాన్నయినా అంత తేలికగా తేల్చడం చంద్రబాబుకు సుతారమూ ఇష్టముండదు. మీటింగుల మీద మీటింగులు పెట్టేసి.. సాకులు చూపించేసి.., కాంట్రాక్టు కంపెనీలను నానా హింసలకు గురిచేసి చివరికి ఎన్నికలు రాబోతుండగా ఒకే ఒక భవనానికి శంకుస్థాపన చేసేసి.., కట్టే ముందొకసారి.., కట్టిన తర్వాత.. పండగలొచ్చినప్పుడు సందర్భం ఉన్న ప్రతిసారీ పేపర్ల నిండా పెయిడ్‌ వార్తలు రాయించుకుని అద్భుతం చేస్తున్నామని జనాన్ని ఊహాలోకంలో తేలుస్తాడు. చివరికి తాత్కాలిక అసెంబ్లీ తరహాలో ఉసూరుమనిపిస్తాడు. అద్భుతం.. అద్భుతం అని 900 కోట్లు ఖర్చు చేసి సెంటీమీటర్‌ వర్షానికి కూడా నిలబడలేని ఒక చిల్లుల భవనాన్ని కట్టి జనం చేత ఛీ కొట్టించుకున్నాడు. 

గ్రాఫిక్స్‌ మీదే శ్రద్ధ.. నాణ్యత, వేగం మీద లేదు
కంప్యూటర్ల ముందు కూర్చుని, ప్రపంచంలోని ఎక్కడెక్కడి భవనాలో పరిశీలిస్తూ కాపీ చేసుకుని, కాస్త గ్రాఫిక్స్‌ కలిపేసుకుని, కొత్త రంగులు వేసి ఓ కొత్త డిజైన్‌ అని తీసుకుపోవడం అబ్బే, ఎలివేషన్‌ బాగాలేదోయ్‌ నార్మన్‌ ఫోస్టరూ, ఇంకాస్త కష్టపడు అని చంద్రబాబు పెదవి విరిచేసి మంత్రి నారాయణ వైపు తిరిగి, చిరాగ్గా మొహం పెట్టడంం మళ్లీ కొత్త భవనాల డిజైన్లు వెతుక్కోవడం, మళ్లీ గ్రాఫిక్‌ వర్కు ఇదే పరిపాటి అయిపోయింది ఈమధ్య.  డిజైన్ల పేరిట కాలయాపనో, ‘కాల’క్షేపమో చేయాలని, ఉద్దేశపూర్వక ఆలస్యంతోనే శంకుస్థాపనలు చేసేసి, ఇక ఈ ప్రపంచ ఫేమస్‌ రాజధాని సాకారం కావాలంటే, మళ్లీ నన్నే ఎన్నుకొండి అని జనంలోకి వెళ్లాలనేది చంద్రబాబు ప్లాన్‌.  ఆ నార్మన్‌ ఫోస్టర్‌కేమో ఇది చెప్పరు, చెప్పలేరు.  నాదేం పోయింది..? నా కోట్లు నాకొస్తున్నాయి కదా అనుకుని వాడూ ఎడాపెడా గ్రాఫిక్‌ వర్క్‌ చేసేస్తూనే ఉన్నాడు. 

యాక్టింగ్‌ నేర్చుకోవడానికే డైరెక్టర్లా..!
చంద్రబాబు అమరావతికి శంకుస్థాపన చేసిన తరువాత మూడో దసరా రాబోతుంది. ఇప్పటికి ఆయన కట్టింది మాత్రం ఒకే ఒక్క బిల్డింగ్‌. అదీ నీరుగారిపోయింది. అద్భుతాల పేరుతో ఎంతమంది డిజైనర్లను మార్చాడో.. ఎన్నిసార్లు సిట్టింగులు వేశాడో కానీ అతీగతీ లేదు. బాహుబలి సినిమా హిట్టయిందని రాజమౌలిని.. గౌతమి పుత్ర శాతకర్ణిలో గ్రాఫిక్స్‌ చూసి క్రిష్‌ని.., వారిద్దరూ వెనక్కి తగ్గడంతో పుష్కరయోధుడు బోయపాటి శీను.. సినిమా వాళ్లను పిలిపించుకుని మాట్లాడటం సెట్టింగులు వేయించుకోవడం మామూలైంది. ఇక్కడే విమర్శకులు చంద్రబాబును ఆడేసుకుంటున్నారు. సినిమా డైరెక్టర్లతో చంద్రబాబు మీటింగుల వెనుక కారణం యాక్టింగ్‌ మీద ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడని సోషల్‌ మీడియాలో సెటైర్లు వేసుకుంటున్నారు. 

పండగొస్తే శంకుస్థాపన..
కనీసం పది పదిహాను సిట్టింగులు వేసేసి.. అదీ ఇదీ మార్చేయమని చెప్పిసి చివరికి ఏదో ఒక పండగ వస్తుంటే హడావుడిగా ఓకే చెప్పేసి, కాస్త ఫ్రంట్‌ ఎలివేషన్‌ మార్చవోయ్‌ అనేసి, దసరాకు శంకుస్థాపన చేసేద్దాం...కొబ్బరికాయలకు ఆర్డరివ్వు అని ఆర్డరేయడం మామూలే. ఇక భజన పత్రికలు ఎలాగూ ఉన్నాయి. స్ఫటికాకారం, వజ్రాకారం, రత్నాకారం, పిరమిడాకారం, థర్మల్‌ ప్లాంటాకారం, ఆయిల్‌ రిఫైనరీ ఆకారం, స్థూపాకారం, స్తంభాకారం, జంట టవర్లాకారంం. ఇలా రోజుకో రకం డిజైన్లతో జనానికి పిచ్చెకించే స్తాడు. ఈ ఆకృతులు గీసేవాళ్లే రాష్ట్ర విభజన తరువాత బాగా బాగుపడిపోయారు తప్ప జనానికి ఒరిగిందేమీ లేదు. 


Back to Top