విభజన లేఖ వెనక్కి తీసుకో బాబూ

హైదరాబాద్, 26 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజన కోసం‌ చంద్రబాబు నాయుడు బ్లాంక్‌ చెక్‌లా కేంద్రానికి ఇచ్చిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తే కోట్లాది మంది తెలుగువారికి అన్యాయం జరగకుండా నిరోధించవచ్చని పేర్కొంది. నిజాయితీ లేకపోతే ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించింది. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆదివారంనాడు చంద్రబాబు నాయుడికి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు.

బహిరంగ లేఖ పూర్తిపాఠం:
చంద్రబాబు నాయుడు గారూ... గత 26 రోజులుగా సీమాంధ్ర అంతా విభజన అంశంపై అతలాకుతలం అవుతున్నా ఇప్పటికీ మీ వైఖరిలో మార్పు రాలేదు. కోట్ల సంఖ్యలో ఉన్న ప్రజల గురించి మీరు ఆలోచన చేయటం లేదు. ఇప్పుడు కూడా ప్రజల్ని మోసం చేసే ఆలోచనతోనే ఉన్నారు. రాష్ట్ర విభజనకు బ్లాంక్‌ చెక్‌లా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఉత్తరాన్ని వెనక్కి తీసుకోవడమో, మీకు మీరుగా మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమో, మీ పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపిల చేత రాజీనామాలు చేయించడమో వంటి ఆలోచనలు చేయకుండా సమస్యను తప్పుదారి పట్టించడానికి జగన్‌గారి ఫోన్, జగన్‌ గారి జైలు, సిబిఐ కేసులు.. అంటూ రోజూ ప్రెస్‌ మీట్లు పెట్టి మీ పార్టీ తరఫున మాట్లాడుతున్న మాటల్ని, మీరు చేస్తున్న మోసపూరితమైన చేష్టల్ని చూస్తున్న ఎవరికైనా మీ లాంటి చిత్తశుద్ధి లేని నాయకులు ఉండబట్టే మన రాష్ట్రానికి ఈ గతి పట్టిందనిపిస్తుంది.

ప్రజల సమస్యలు కనిపించడంలేదా? :
చంద్రబాబు గారూ! మీ కళ్ళ ఎదుటే, రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడే.. కృష్ణా నీరు మహారాష్ట్ర అవసరాలు తీరిన తరువాత గానీ, కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లు నిండితే తప్ప కిందికి వదలని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి వాతావరణంలో, మధ్యలో ఇంకొక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్ళు ఎలా వస్తాయి? ఆ తర్వాత నాగార్జున సాగర్‌కు నీళ్ళు ఎలా వస్తాయి? దిగువ రాష్ట్రం కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రం నీళ్ళు తప్ప మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయి? కృష్ణా ఆయకట్టులో రోజూ కొట్టుకునే పరిస్థితి కాదా? పోలవరానికి జాతీయ హోదా అంటున్నారు... కానీ రాష్ట్రాన్ని విడగొడితే పోలవరానికి నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? 60 ఏళ్ళుగా కలిసి కట్టుకున్న హైదరాబాద్‌ను వదిలి వేరే రాజధాని నిర్మించుకుని వెళ్ళిపొమ్మంటున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 50 శాతం నిధులు ఒక్క హైదరాబాద్‌ నుంచే వస్తున్న పరిస్థితులలో ఈ నిధులే రాకపోతే ఉద్యోగులకు జీతాలు ఎల ఇవ్వగలరు? వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు.. అనేక ఇతర సామాజిక వర్గాలకు సంక్షేమ పింఛన్లు ఎలా ఇవ్వగలరు? ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ హైదరాబాద్‌ అందరి రాజధాని కాకపోతే చదువుకున్న ప్రతి పిల్లవాడు ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలి? హైదరాబాద్‌లోని సీమాంధ్రులు, ఇప్పటికే ఇక్కడ స్థిరపడిన ప్రజల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ మీకు అన్యాయంగా కనిపించడం లేదా? అన్యాయంగా కనిపిస్తూ ఉన్నా ఓట్లు, సీట్లు, క్రెడిట్‌ దక్కవేమో అని ఆరాటపడుతున్న మిమ్మల్ని చూసి ఏమనుకోవాలి?

కుమ్మక్కైంది మీరా.. మేమా?

మీరు మా పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఎవరితోనో కుమ్మక్కు అయ్యాం.. అంటున్నారు. చంద్రబాబు గారూ.. గత నాలుగేళ్ళలో మీరు - కాంగ్రెస్‌ పాలు- నీళ్ళలా ఎలా కలిసిపోయారో అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఓట్ల కోసం, సీట్ల కోసం.. మీకు వస్తుందని మీరు అనుకుంటున్న క్రెడిట్‌ కోసం కోట్ల మందికి అన్యాయం జరుగుతున్నా ఇప్పటికీ స్పందించని మీ వైఖరే మీరు కాంగ్రెస్‌తో ఎంతగా కుమ్మక్కు అయ్యారనేదానికి మరో నిదర్శనం.

చంద్రబాబు నాయుడు గారూ.. మీరు ఇప్పటికైనా రాజీనామా చేయండి. ఇప్పటికైనా మీ ఎమ్మెల్యేలతో, మీ ఎం.పి.లతో రాజీనామాలు చేయించండి. ఇప్పటికైనా మీరు బ్లాంక్‌ చెక్‌లా ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చిన లెటర్‌ను వెనక్కి తీసుకోండి. మొన్న మేం ప్రధాన మంత్రికి రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాం. కేంద్ర ప్రభుత్వం అందరికీ న్యాయం చేయలేకపోతే.. విభజించే అధికారాన్ని తన చేతిలోకి తీసుకోవటం తప్పు అని తెలియజేశాం. చంద్రబాబు గారూ.. మీరు అలాంటి ఉత్తరం ప్రధానికి ఎందుకు రాయటం లేదు? అడ్డగోలు విభజనతో వచ్చే సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళాలని మీరెందుకు భావించటం లేదు?

ప్రధానికి మీరూ లేఖ రాయండి :
'రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు - వైయస్ఆర్‌ కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐ (ఎం) ఒకే మాట చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ఈ రాష్ట్రాన్ని విభజించటాన్ని వ్యతిరేకిస్తున్నాయి. యథావిధిగా కలిపే ఉంచండి అంటున్నాయి. నిజానికి ఈ రాష్ట్రంలో ఐదు పార్టీలు - కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎస్, బిజెపి, సిపిఐలు రాష్ట్రాన్ని విభజించటానికి ఒప్పుకున్నాయి. ఓట్ల కోసం, సీట్ల కోసం అధికార పార్టీ అన్యాయం చేస్తుంటే.. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, తనకు రావాల్సిన క్రెడిట్‌ రాకుండా పోతుందని ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పార్టీలు విభజన ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని గురించి స్పందించకుండా ఉంటే.. ఇక ఈ రాష్ట్రంలో కోట్ల ప్రజల గోడు ఎవరికి చెప్పుకోవాలి' అంటూ ఆగస్టు 14న మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ప్రధాన మంత్రికి ఒక లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు గారూ.. మీకు సీమాంధ్రలోని కోట్ల ప్రజానీకం మీద ఏ కొంచెం ప్రేమ ఉన్నా, మీరు కూడా ప్రధానికి మా తరహాలో లేఖ రాయండి. సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేలా ఉత్తరం అయినా ఇవ్వండి. లేదా విభజనకు బ్లాంక్‌ చెక్‌గా మీరు ఇచ్చిన ఉత్తరాన్ని అయినా వెనక్కి తీసుకోండి. ఇప్పటికైనా మీరు మీ లేఖను వెనక్కి తీసుకుని మీ ఎమ్మెల్యేలందరి చేత, ఎంపిలందరి చేత రాజీనామా చేయించి మీరూ రాజీనామా చేస్తే.. విభజన ఆగుతుంది.

జగన్‌ను చూసి గర్విస్తున్నాం :
చంద్రబాబు గారూ.. మా నాయకుడు జగన్మోహన్‌రెడ్డిని చూసి మేం గర్వపడుతున్నాం. కష్టాలలో ఉన్నా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తూ తొణకకుండా, బెణకకుండా, బెదరకుండా.. తాను అక్రమ కేసులను ఎదుర్కొంటూ 15 నెలలుగా జైలులో ఉన్నా, అనుక్షణం స్ఫూర్తిని ఇస్తూ ప్రజల కోసమే ఆలోచిస్తూ ఇప్పుడు జైలులోనే నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. అందుకు జగన్మోహన్‌రెడ్డి మా నాయకుడు అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం.
ఇప్పటికైనా మీరు నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తే కోట్ల మంది తెలుగువారికి అన్యాయం జరగకుండా ఆపగలం. మీకు అలాంటి రాజకీయాలు చేయటం మీద నమ్మకం లేకపోతే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. భావి తరాలు మిమ్మల్ని క్షమించవు. విభజన చేసే వరకూ చోద్యం చూసి, కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాల ద్వారా రాజీనామా చేయకుండా ఊరుకుని, ఆ తరువాత మీరు ప్రజల్లోకి వస్తే ప్రజలు మిమ్మల్ని వెంటాడి బుద్ధి చెప్పటం ఖాయం- అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు.

Back to Top