కుక్కల నాగేశ్వరరావు మృతికి జగన్‌ సంతాపం

హైదరాబాద్, 21 నవంబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యుడు కుక్కల నాగేశ్వరరావు గుండెపోటుతో హఠాత్తుగా మరణించడంపై పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. నాగేశ్వరరావు మరణించడంతో తాను అత్యంత ఆప్తుడిని కోల్పోయాయని శ్రీ జగన్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. నలుగురికీ మేలు చేసే నాయకుడిగా కృష్ణా జిల్లాలో కుక్కల నాగేశ్వరరావుకు మంచి పేరు ఉందని అన్నారు. నాగేశ్వరరావు మంచి బీసీ నాయకుడని పేర్కొన్నారు. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు శ్రీ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పారిశ్రామికవేత్తగా, కృష్ణాజిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌గా కుక్కల నాగేశ్వరరావు ప్రసిద్ధి పొందారని శ్రీ జగన్‌ కొనియాడారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి అని శ్రీ జగన్‌ గుర్తుచేసుకున్నారు. నాగేశ్వరరావు పార్ధివదేహాన్ని సందర్శించేందుకు శుక్రవారం వెళుతున్నట్లు ఆయన తెలిపారు.

Back to Top