బిల్లు ఓటింగ్‌పై స్పష్టత, హామీ కావాలి

హైదరాబాద్:

'ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు -2013'పై అంశాలవారీగా ఓటింగ్‌ జరుగుతుందో లేదో అనే అనుమానాన్నివైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తం చేసింది. అసెంబ్లీలో జరుగుతున్న గందరగోళాన్ని చూస్తే ఓటింగ్‌పై స్పష్టతగాని, హామీ గాని వచ్చే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ముసాయిదా బిల్లుకు సవరణలు ఎందుకు ఇవ్వలేదో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు మాట్లాడారు.

సమైక్యాంధ్ర విషయంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చాలా స్పష్టంగా కట్టుబడి ఉందని జూపూడి తెలిపారు. ముసాయిదా బిల్లుపై ఓటింగ్‌ జరిగితే పాల్గొంటామని అన్నారు. అయితే, శాసనసభా వ్యవహారాలపై ఏ ఒక్కరూ స్పష్టంగా చెప్పే పరిస్థితి కనిపించడంలేదన్నారు. సమైక్యాంధ్రకు చాంపియన్‌ తానే అని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గాని, బొత్స సత్యనారాయణ గాని, చంద్రబాబు నాయుడు గాని లేదా వారిలో ఏ ఒక్కరు గానీ ముసాయిదా బిల్లుకు ఎలాంటి సవరణలూ చేయడంలేదేమని జూపూడి ప్రశ్నించారు. ముసాయిదా బిల్లుపై తమ విధాన్ని స్పష్టంగా చెప్పడానికి బదులు వారంతా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా ఆరోపఫలు చేయడమేమిటని జూపూడి నిలదీశారు. బిల్లులోని అన్ని క్లాజులకూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సవరణలు ప్రతిపాదించిందన్నారు.

పైగా పండగపూట కూడా చంద్రబాబునాయుడు దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డిని, వై‌యస్ఆర్‌సీపీని ఆడిపోసుకోవడం ఏమిటని ప్రభాకరరావు నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరు చూస్తుంటే మతిభ్రమించినట్టుందని ఆయన ధ్వజమెత్తారు. సంక్రాంతి రోజున తన స్వగ్రామం నారావారిపల్లె వెళ్లిన చంద్రబాబు పండగ చేసుకోకుండా రాజకీయాలు మాట్లాడుతూ బురదజల్లే కార్యక్రమం పెట్టుకోవడమేమిటని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు సీఎంగా, మరో తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు తన విధానాలేమిటో, రాష్ట్ర విభజనపై తన వైఖరేంటో వెల్లడించకుండా ప్రజలను నిండా ముంచుతున్నారని దుయ్యబట్టారు.

తన పాత గురువుల (ఉపాధ్యాయుల)ను చంద్రబాబు కలుసుకుని ‘మీరు ఆ రోజు బెత్తంతో దండించబట్టే ఈనాడు ఇలా ఉన్నాను’ అని గొప్పగా చెప్పుకొచ్చారని, ఇంతకూ చంద్రబాబు ఎలా ఉన్నానని చెప్పారో వెల్లడించాలని జూపూడి వ్యంగ్యంగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజన  వ్యవహారంలో తానెలా వ్యవహరించాలో చంద్రబాబు తన గురువులను ఎందుకు అడగలేదన్నారు. గతంలో ఇలాగే చంద్రబాబు సొంత గ్రామానికెళ్లి పినతండ్రిని కలుసుకున్నపుడు ఆయన ‘వైయస్‌లాగా పరిపాలించు.. ఆయన మాదిరిగానే రైతులకు మేలు చేయి..’ అని హితబోధ చేయడంతో ముఖం మాడ్చుకుని వెనుదిరిగిన విషయాన్ని మరిచారా? అని జూపూడి గుర్తుచేశారు. శాసనసభ, మండలికి విభజన బిల్లు వచ్చిన నేపథ్యంలోనూ సభలో ప్రధాన ప్రతిపక్షపార్టీ నేతగా చంద్రబాబు తన వైఖరేమిటో ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుపై చర్చించడానికి వీల్లేదని తమ పార్టీ తుదివరకు పోరాడిందని, కాంగ్రెస్, టీడీపీలు రెండూ వింతనాటకమాడి చర్చను కొనసాగిస్తున్నాయని జూపూడి దుయ్యబట్టారు. కిరణ్, చంద్రబాబు ఇద్దరూ అసెంబ్లీకి వచ్చి కూడా బీఏసీ (సభా వ్యవహారాల సలహామండలి) సమావేశాలకు ఎందుకు రాలేదని నిలదీశారు. బిల్లుపై రాష్ట్రపతి అభిప్రాయాలు మాత్రమే కోరారని చెబుతూ సమైక్య తీర్మానం ఊసే ఎత్తడం లేదని ఆయన విమర్శించారు. ఉభయ సభల్లో బిల్లుపై చర్చ జరిగి ఓటింగ్‌కు వచ్చినపుడు తమ పార్టీ సభ్యులు పాల్గొని వ్యతిరేకంగా ఓటు వేస్తారని జూపూడి స్పష్టంచేశారు.

Back to Top