బంద్‌ను విఫలం చేయాలని చూశారు: వాసిరెడ్డి పద్మ

విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించలేని రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతపై తమ పార్టీ చేపట్టిన బంద్‌ను నిర్వీర్యం చేయటానికి అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా ప్రయత్నాలు చేశాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. విద్యుత్‌ సరఫరా లేక చీకటి బాధలు అనుభవిస్తున్న ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరిస్తుంటే పోలీసులు రంగంలోకి దిగి బలవంతంగా వాణిజ్య సంస్థలు, షాపులను తెరిపించారని ఆరోపించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బంద్‌కు సహకరించరాదని తమ కార్యకర్తలకు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునివ్వడాన్ని పద్మ తప్పుపట్టారు. దీన్నిబట్టి ఆ పార్టీ ప్రభుత్వానికి ఎంత మద్దతునిస్తోందో సుస్పష్టం అవుతోందని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బంద్‌కు సహకరించవద్దని ఎర్రబెల్లి చెప్పటమంటే.. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించటంలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీ సమర్ధించినట్లే కదా అని నిలదీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పోలీసులను భారీగా మోహరించి తమ పార్టీ శ్రేణులపై అణచివేతకు దిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌టీసీ బస్సులను ఖాళీగా అయినా సరే తిప్పా‌లని ప్రభుత్వమే ఆదేశాలిచ్చిందని, పోలీసులు కూడా అతిగా జోక్యం చేసుకున్నారని ధ్వజమెత్తారు. సాధారణంగా అయితే బలవంతంగా షాపులు మూయించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి కానీ.. దుకాణదారులు స్వచ్ఛందంగా తమ సంస్థలను మూసుకుంటుంటే పోలీసులు బలవంతంగా తెరిపించారని పేర్కొన్నారు.

తమ పార్టీ నాయకులను ఇష్టమొచ్చినట్లు అరెస్టు చేశారని వాసిరెడ్డి పద్మ ఖండించారు. బంద్ ప్రారంభమయ్యీ కాక ముందే.. బం‌ద్‌ ప్రభావం ఏమీ లేదంటూ ఓ వర్గం మీడియా అదే పనిగా ప్రసారాలు చేసిందని తప్పుపట్టారు. ‘ఉదయం ఎనిమిది గంటలకే ప్రభుత్వ కార్యాలయాలను చూపించి ఇంకా మూయలేదని అంటున్నారు.. వాస్తవానికి అవి పనిచేసేది పది గంటలకు కదా!’ అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించిన ప్రజలందరికీ కతజ్ఞతలు తెలిపారు. ఇది బలవంతపు బంద్ కాదని ప్రభుత్వ వైఫల్యంపై ఆగ్రహంతో ప్రజలందరూ మౌనంగా తమ సంఘీభావాన్ని తెలిపారని ‌పద్మ అభివర్ణించారు.

తాజా వీడియోలు

Back to Top