గడపగడపలో ఆవేదన

వించిపేట: మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మమ్మల్ని దగా చేశారని పలువురు వృద్ధులు, వికలాంగులు, మహిళలు వైయస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్‌ షేక్‌ బీజాన్‌బి, పార్టీ మైనార్టీసెల్‌ నగర అధ్యక్షుడు షేక్‌ గౌస్‌మొహిద్దీన్‌ ఆధ్వర్యంలో సోమవారం గడప గడపకు వైయస్సార్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన 36వ డివిజన్‌లో పర్యటించారు. ఈ ప్రాంతాలోని నైజాంగేటుసెంటర్, అబ్దుల్‌ రెహమాన్‌వీధి, పెద సత్తార్‌వీధి, నూకలవారివీధి, ఇస్మాయిల్‌వీధి, మధిరవారివీధి, ఏనుగులవారివీధి, ఆబోతులవారివీధుల్లో పర్యటించారు. స్ధానికుల ఇబ్బందులను తెలుసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రతి నెలా వికలాంగ పెన్షన్లు క్రమం తప్పకుండా తీసుకునేదాన్ని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదు రెట్లు పెంచామని గొప్పలతో నా పెన్షన్‌ తొలగించారని రెహమాన్‌వీధి నివాసి పెరిక సంధ్య అనే వికలాంగురాలు వెలంపల్లి ఎదుట బోరున విలపించింది. పిల్లలతో పూట గడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయింది. పురోహితులు, ఇమామ్‌లకు ఏ విధంగా నెలసరి వేతనం ఇస్తున్నారో అలాగే ఫాదర్స్‌కు కూడ వేతనాలు ఇవ్వాల్సిందిగా పలువురు ఫాదర్లు ఆయనకు విన్నవించారు. డివిజన్‌లోని సైడు డ్రెయిన్లు, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, మురుగునీరు ఇళ్ల ముందుకు వస్తోందని పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.... ప్రభుత్వం మాటలతో కాలక్షేపం చేస్తోందని చేతలు లేవని విమర్శించారు. సామాజిక పెన్షన్‌లను ఐదు రెట్లు పెంచామని చెబుతున్న ప్రభుత్వం పెంచిన పెన్షన్‌ లోటును భర్తీ చేసేందుకు అర్హుల పెన్షన్‌లను తొలగించడంతోపాటు కొత్తవి ఇవ్వడం లేదని ఆరోపించారు. అదేమని గట్టిగా అడిగితే పెన్షన్‌ పొదుతున్నవారిలో ఎవరైనా చనిపోతే వారి స్థానంలో ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలపై ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పైలా సోమినాయుడు, షేక్‌ ఆసిఫ్, కార్పొరేటర్లు జమ్మలపూర్ణామ్మ, బట్టిపాటి సంధ్యారాణి, నాయకులు వాహబ్, మనోజ్‌ కోఠారి, కంపా గంగాధర్‌రెడ్డి, పొలిమెట్ల శరత్‌బాబు, పైడిపాటి మురళి, ఎద్దు సురేష్, బెవర ఉమామహేశ్వరరావు, జంగం కోటేశ్వరరావు, బత్తుల పాండు, గొలగాని శ్రీను, ప్రభాకర్, లీలాకుమార్, కాలేషా, క్షత్రియ సంఘ అధ్యక్షుడు రమేష్‌రాజు పాల్గొన్నారు.

Back to Top