న‌వ‌ర‌త్నాలు`.. అభివృద్ధికి బాట‌లు

మండపేట(రాజ‌మండ్రి):  

బాబు  దోపిడి పాలన మెడలు వంచి పేదల కష్టాలు తీర్చేందుకు `అన్న వస్తున్నాడు`.. న‌వ‌ర‌త్నాలు తెస్తున్నాడు అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి అన్నారు. స్థానిక బైపాస్‌ రోడ్డులోని అరవింద రైస్‌మిల్లు ఆవరణలో నిర్వహించిన నవరత్నాల సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన జనసంద్రంతో బైపాస్‌ పొడవునా కోలాహలం కనిపించింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ నాయకులు మదునూరి ప్రసాదరాజు, రాజోలు కోఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పెంకే వెంకట్రావు, సత్తి వెంకటరెడ్డి, పార్టీ నేత ఆర్‌వీవీ సత్యనారాయణ చౌదరి తదితరులు హాజరయ్యారు. మూడేళ్లలో చంద్రబాబు సర్కారు సాగిస్తున్న దోపిడి పాలనను, అధికారపార్టీ నేతలు సాగిస్తున్న అక్రమాలను ఈ సందర్భంగా పార్టీ నేతలు ఏకరవు పెట్టారు. పట్టాభిరామయ్య చౌదరి మాట్లాడుతూ టీడీపీ హయాంలో నియోజకవర్గం, మున్సిపాలిటీలో అవినీతి పెచ్చుమీరింద‌న్నారు. పనుల్లో అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి 20–30 శాతం వరకు పర్సంటేజీల రూపంలో దిగమింగుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఇసుక నుంచి తైలాన్ని పిండుకుంటున్నారని విమర్శించారు. ప్రతీ బూత్‌ కమిటి సభ్యుడు ఇంటింటికి వెళ్లి అధికారపార్టీ నేతల అక్రమాలు వివరించడంతో పాటు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల పథకాలు గూర్చి ప్రజలకు వివరించాలని పట్టాభిరామయ్య చౌదరి కోరారు.

Back to Top