త్వరలో మరో విద్యుత్తు ఉద్యమం: వైవీ సుబ్బారెడ్డి

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్ పెంపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక పాలనకు నిదర్శనమని ఒంగోలు వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తుంటే ఇక్కడ ధరలు పెంచడం సిగ్గుచేటు అన్నారు. మరోసారి విద్యుత్తు ఛార్జీలు పెంచుతున్న బాబు తన గత పాలనను గుర్తుచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలపై భారం మోపే పలు నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. త్వరలోనే విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మరో ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు.  కేంద్రంలో మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబురాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ తేలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం స్వల్ప మొత్తం ప్రకటించినా సీఎం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని మండిపడ్డారు. దీనిపై పార్లమెంటులో పోరాడుతామని స్పష్టంచేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తక్షణమే సాగర్ జలలాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Back to Top