అనంత 'సహకారం'లో పార్టీ విజయకేతనం

అనంతపురం:

అనంతపురం జిల్లా సహకార ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు ఘన విజయాలు సాధించారు. కాంగ్రెస్, టీడీపీల ఎత్తులను చిత్తు చేస్తూ రైతులు తీర్పును వెల్లడించారు. ఏడాది క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సహకార ఎన్నికలు జరిగాయి. అనంతపురం జిల్లాలో 116 ప్రాథమిక సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)కు గానూ 109 సొసైటీలకు మాత్రమే అప్పుడు ఎన్నికలు జరిగాయి. శాంతిభద్రతల సాకు చూపించి తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు, వేములపాడు, శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు, రాప్తాడు నియోజకవర్గంలోని పి.యాలేరు, రామగిరి, కదిరి నియోజకవర్గంలోని తలుపుల, పెనుకొండ నియోజకవర్గంలోని బూదిలి పీఏసీఎస్‌ ఎన్నికలను వాయిదా వేశారు. వాటికి శుక్రవారం ఎన్నికలు జరిగాయి. మొత్తం ఏడింటికి ఆరు పీఏసీఎస్‌లను వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులు భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు.

జేసీ బ్రదర్సు తమ నియోజకవర్గంలోని వేములపాడు, పెద్దవడుగూరు పీఏసీఎస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు సొసైటీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకునే బాధ్యతను జేసీ ప్రభాకర్‌రెడ్డికి మంత్రి శైలజానాథ్ అప్పగించారు. ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్-టీడీపీలు సంయుక్తంగా మద్దతుదారులను బరిలోకి దించాయి. జేసీ బ్రదర్సు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు గ్రామాల్లో భయోత్పాతాన్ని సృష్టించారు.

అయినప్పటికీ పుట్లూరు, పెద్దవడుగూరు సొసైటీలను వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులు భారీ మెజారిటీతో గెలుచుకున్నారు. పెద్దవడుగూరులో 13 డెరైక్టర్ల స్థానాలకు గాను ఒక అభ్యర్థి మరణించడంతో ఆ స్థానానికి ఎన్నికలు జరగలేదు. వేములపాడు సొసైటీని సీపీఐ మద్దతుతో వైయస్ఆర్‌సీపీ చేజిక్కించుకుంది. జేసీ సోదరుల కోటలో ఈ గెలుపు అనంతరం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కార్యకర్తలు సమన్వయకర్త వి.ఆర్.రామిరెడ్డిని అభినందిస్తూ భారీ ఎత్తున ఊరేగింపు ‌నిర్వహించారు.

Back to Top