టీడీపీ– బీజేపీకి ఉన్న అనుబంధం ఏంటి?

 
– పోలవరం నాణ్యతలో లోపాలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి
– నాణ్యతను గాలికొదిలేసి ప్రచార ఆర్భాటానికి వాడుకుంటున్నారు
– కేంద్ర బృందం పోలవరం లోటుపాట్లను ఎత్తి చూపింది
– లోపాయికారీ ఒప్పందాలు ఉన్నందుకే బీజేపీ కళ్లు మూసుకుంది
– కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పోలవరం అవకతవకలపై విచారణ చేపట్టాలి
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకుందని, బీజేపీ– టీడీపీ మధ్య ఉన్న అనుబంధం ఏంటో చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి పేర్కొన్నారు. పోలవరం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని కేంద్ర బృందం లోపాలను ఎత్తి చూపిందన్నారు. చంద్రబాబు ముడుపుల కోసం పోలవరం ప్రాజెక్టును వాడుకుంటున్నారని విమర్శించారు. శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి సంబంధించి అత్యంత విలువైన ప్రాజెక్టు అన్నారు. అలాంటి ప్రాజెక్టు నిర్మాణంలో, నాణ్యతలో ప్రభుత్వం కఠినంగా ఉండాల్సి ఉండగా, ఈ ప్రాజెక్టు వారి కోరికలు తీర్చే కల్ప వృక్షంగా మార్చారని విమర్శించారు. ఈ రోజు కేంద్రం నుంచి వచ్చిన కమిటీ చాలా స్పష్టంగా పోలవరంలోని లోటుపాట్లను ఎత్తి చూపితే, దాన్ని కూడా తనకు అనుకూలమైన పత్రికల్లో బేష్‌గా ఉందని రాయించుకున్నారని మండిపడ్డారు. రోజుకు దాదాపు రూ.10 కోట్ల పనులు జరుగుతుంటే, నాణ్యతను పర్యవేక్షించే ఒక ఏజెన్సీని అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. మూడు నెలలకు ఒకసారి మొక్కబడిగా నాణ్యత పరీక్షలు చేయించే ఏజెన్సీని పంపుతున్నారని పేర్కొన్నారు. ఏ ప్రాజెక్టు అయినా సరే కాంక్రీట్‌ పనులు చేపట్టే సమయంలో తప్పనిసరిగా క్వాలీటి ఇంజనీర్లను పని వద్ద ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆ ప్రాజెక్టు పనుల్లో వాడే ఇసుక, సిమెంట్, ఇనుమును పర్యవేక్షించాల్సిన క్వాలిటీ డిపార్టుమెంట్‌ మూడు నెలలకు ఒకసారి వెళ్తే ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. 54 క్యూబిక్‌ మీటర్ల కాంక్రిట్‌ వేసిన తరువాత వీరు వెళ్లి ఏం పర్యవేక్షిస్తారని నిలదీశారు. ఈ తప్పు చేయడానికి కూడా స్వార్థం కారణమని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పారని, స్పీల్‌ వే షెట్టర్ల మధ్య గ్యాప్‌ ఉందని, ఇది లాంగ్‌ టర్మ్‌లో మంచిది కాదని చెప్పారన్నారు. ఈ ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించిందా అని ప్రశ్నించారు. మన ఇంటికి వేసే కాంక్రీట్‌లో కంకర పనిపిస్తే కాంట్రాక్టర్‌ను మందలిస్తామన్నారు. అలాంటిది ఇంత ప్రాముఖ్యమున్న ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. స్టీల్‌ రాడ్లు కూడా కాంక్రీట్‌ వేసిన తరువాత బయట కనిపిస్తున్నాయని తెలిపారు. ఇంతపెద్ద తప్పు పెట్టుకొని అంతా భేష్‌గా ఉందని స్టేట్‌మెంట్లు ఇవ్వడం దారుణమన్నారు. ముడుపుల కోసం, స్వార్థంతో నాసిరకమైన స్టీల్, సిమెంట్‌ వాడుతున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయన్నారు. వెంటనే పర్మినెంట్‌ క్వాలిటీ కంట్రోల్‌ డిపార్టుమెంట్‌ ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లను మార్చి కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రివర్గంలోని సహచరుల బంధువులకు సబ్‌ కాంట్రాక్ట్‌లు కట్టబెడుతున్నారని గుర్తు చేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌ అనే కాంట్రాక్టర్‌ తన ఎంపీకి చెందిన కాబట్టే రూ.112.47 కోట్లు ఎటువంటి ఎం బుక్‌ లేకుండా దొంగ లెక్కలు రాసి అప్పజెప్పారన్నారు. తప్పు జరగడమే కాకుండా , దాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు దగ్గరుండి అధికారులకు సూచనలు ఇస్తున్నారని విమర్శించారు. అవినీతిని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, 10 శాతం నుంచి రికవరీ చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు కనుసన్నల్లో సోమవారం పోలవరంలో భాగంగా అవినీతి జరుగుతుందన్నారు. 

– కేంద్ర ప్రభుత్వానికి కళ్లు మూసుకుపోయిందా అని ప్రశ్నించారు. నాణ్యతలో  ఇంత లోపాలు ఎత్తి చూపుతున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని పార్థసారధి నిలదీశారు. బీజేపీ, టీడీపీకి ఉన్న అవగాహన ఏంటి, వారి మధ్య ఉన్న వాటాలు ఏంటో సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తిపు పొందిన పోలవరం విషయంలో కేంద్రం ఎందుకు కళ్లు మూసుకుందని ధ్వజమెత్తారు. లోపాయికారి ఒప్పందం ఉండబట్టే  ఇంత అవినీతి జరుగుతుందని విమర్శించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పోలవరం విషయంలో విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. రూ.104 కోట్లు ఎటువంటి పనులు జరుగకుండానే అందజేశారని విమర్శించారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. అక్కడ నాసిరకం పనులు చేపట్టింది ఎవరని, పనులు చేపట్టకుండానే నిధులు ఇచ్చింది వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డినా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం మాట్లాడుతున్న విషయాల్లో వాస్తవాలు తెలుసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నం చేయాలని సూచించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌  ఇద్దరూ పోలవరం పనుల్లో అవినీతికి పాల్పడ్డారు కాబట్టి నోరు తెరిస్తే చాలు ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు మేలు చేసే రూ.20 కోట్ల ఇరిగేషన్‌ నిధులను తన విలాసాల కోసం, అందమైన భవంతుల కోసం డైవర్ట్‌ చేశారని దుయ్యబట్టారు. క్రీడలకు సంబంధించిన పనులకు నిధుల లేమితో బాధపడుతుంటే ఇరిగేషన్‌ నిధులు రూ.7 కోట్లతో ఇరిగేషన్‌ మంత్రి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం 2019లోగా పూర్తి  చేస్తామని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారని, ఇలాగే ఎంతకాలం మభ్యపెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు తన అవినీతి కార్యకలాపాలతో పోలవరం ప్రాజెక్టును నీరుగార్చుతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని, విచారణ చేయించాలని పార్థసారధి డిమాండు చేశారు.
 
Back to Top