కమీషన్‌ల కోసమే ఎయిర్‌పోర్టు టెండర్‌ రద్దు

టీడీపీ కోసం పనిచేస్తున్న కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు
ప్రభుత్వ సంస్థకు ఇస్తే కమీషన్లు రావనే కుట్ర
ఇద్దరూ చేతులు కలిసి టెండర్‌ రద్దు చేసిన వైనం
ఎయిర్‌పోర్టు టెండర్‌ రద్దు కుట్రపై ప్రధానికి లేఖ 
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజులు వారి స్వప్రయోజనాల కోసం భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ను రద్దు చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ రద్దు వెనుక ఉన్న కుట్రలు, కుతంత్రాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాస్తున్నట్లు ఆయన చెప్పారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో విజయనగరం జిల్లా భోగాపురంలో రాష్ట్రానికి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు కేబినెట్‌ సమావేశం పెట్టి భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ను రద్దు చేశారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రద్దుకు ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌పోర్టు అని, భూసేకరణ జరగలేదని చంద్రబాబు కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు.
 
రాజకీయాల్లో ఉన్న వ్యక్తి నా ప్రాంతానికి, నా రాష్ట్రానికి మేలు చేయాలని, నా హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు చెప్పుకోవాలనే తత్వంతో ఉంటారన్నారు. కానీ చంద్రబాబులాంటి దుర్భుద్ధి కలిగిన వ్యక్తిని ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా చూడలేదని బొత్స విమర్శించారు. స్థానిక ఎంపీగా ఉన్న అశోక్‌గజపతిరాజు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా.. టీడీపీ తరుపున పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి హయాంలో ఎంత దోపిడీ జరుగుతుందో భోగాపురం ఎయిర్‌పోర్టు ఒక ఉదాహరణ అని బొత్స చెప్పారు. 2013 సంవత్సరంలో భోగాపురంను గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుగా చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. 2015లో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు భోగాపురంకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఎయిర్‌పోర్టు అథారిటీ  ఆఫ్‌ ఇండియా అన్ని అనుమతులు మంజూరు చేసిందన్నారు. 

ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జరిగిన టెండర్‌లో అశోక్‌గజపతిరాజు శాఖకు సంబంధించిన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ, ఒక ప్రైవేట్‌ సంస్థ పాల్గొన్నాయని బొత్స గుర్తు చేశారు. కాగా టెండర్‌లో ప్రభుత్వరంగ సంస్థ 30.2 శాతం ప్రభుత్వానికి ఆదాయం ఇస్తామని కోడ్‌ చేసిందని, మరో ప్రైవేట్‌ సంస్థ 21.6 శాతానికి కోడ్‌ చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ప్రభుత్వ సంస్థ ఎయిర్‌పోర్టు నిర్మిస్తుందని సంతోషపడ్డారని, ప్రజల సంతోషంపై చంద్రబాబు నీరుచల్లారని మండిపడ్డారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు టెండర్‌ ఇస్తే ఈ నాయకుల దోపిడీకి అవకాశం ఉండదు కాబట్టే టెండర్‌ను రద్దు చేశారన్నారు. దీనికి ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌పోర్టు, భూసేకరణ జరగలేదని కుంటిసాకులు చెబుతున్నారన్నారు. 

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 10 వేల ఎకరాలు సేకరిస్తామని ప్ర భుత్వం ప్రకటించడంతో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధర్నా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే దిగొచ్చిందన్నారు. 10 వేల ఎకరాలను 5300 ఎకరాలకు తీసుకొచ్చి దాన్ని మళ్లీ 2560 ఎకరాలకు ఫైనల్‌ చేసిందన్నారు. దాంట్లో 2500ల ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మళ్లీ భూసేకరణ జరగలేదని చెప్పడంలో ఆంతర్యం దోపిడీ అని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను నీ శాఖకు సంబంధించిన సంస్థకు కేటాయించకుండా ఎందుకు క్యాన్సల్‌ చేశారు అశోక్‌గజపతిరాజు అని బొత్స ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి మామూళ్లకు లాలూచీ పడ్డారని అర్థం అవుతుందన్నారు. మీ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పణంగా పెడతారా అని నిలదీశారు. ఇదేనా మీ నీతి, నిజాయితీ అని ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుపై జరిగిన కుట్రను ప్రధానికి లేఖ ద్వారా వివరిస్తామన్నారు. కేంద్ర కేబినెట్‌లో ఉన్న మంత్రి అశోక్‌గజపతిరాజు స్వప్రయోజనాల కోసం పాటుపడడం సమంజసమేనా..? ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువచ్చారా..? మీ కేబినెట్‌లో ఇలాంటి వ్యక్తులు కొనసాగడం సబబేనా..? వంటి అంశాలను, సంబంధిత మంత్రిపై చర్యలు తీసుకోని, టెండర్‌ను ప్రభుత్వ సంస్థకు కేటాయించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలని లేఖ రాసినట్లు బొత్స చెప్పారు. 
 
Back to Top