12న వైయస్ఆర్‌సీపీ రహదారుల దిగ్బంధం

హైదరాబాద్ :

శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న ఈ నెల 12న రహదారుల దిగ్బంధం, రోడ్లపైనే వంటా వార్పు కార్యక్రమం చేపడుతున్నట్టు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెస్, టీడీపీలు, కేంద్ర ప్రభుత్వం తమ వైఖరులను మార్చుకోనందుకు నిరసనగా పార్టీ ఈ కార్యాచరణను నిర్ణయించింది. ఓట్లు, సీట్ల కోసం చేస్తున్న రాజకీయానికి, విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా మొదటి నుంచీ ఉద్యమిస్తున్న పార్టీగా వరుసగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చినట్టు ఆ ప్రకటనలో తెలిపింది.

నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 10న విద్యార్థులు, యువకులు ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహిస్తారు. 11న రైతులు ట్రాక్టర్లతో ర్యాలీలు ‌తీస్తారు. 12న రాష్ట్ర రహదారులతో పాటు జాతీయ రహదారులన్నింటినీ దిగ్బంధిస్తారు. రోడ్లపైనే వంటా వార్పూ కొనసాగిస్తారు. 14వ తేదీ నుంచి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా ఒక్కోరోజు ఒక్కో నియోజకవర్గం చొప్పున భారీ ఎత్తున ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు.

ఈ ఉద్యమాల్లో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, అన్ని వృత్తి వర్గాల వారు, సమాజంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజలంతా సహృదయంతో సహకరించాలని ప్రకటనలో కోరింది.

11న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ :
ఈ నెల 12న రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా అంతకు ముందు రోజు 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఉభయ సభల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ ఎజెండా, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Back to Top