తాగడానికి నీళ్లు లేకున్నా విచ్చలవిడిగా మద్యం

పేదలను మద్యానికి బానిసలు చేస్తున్న చంద్రబాబు
కల్తీ మద్యం మరణాలు.. సర్కారీ హత్యలే
ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు
మద్యపానం నిషేధించాలని వైఎస్సార్సీపీ ఆందోళన
దోషులను కఠినంగా శిక్షించాలని నిరసన
బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్


గుంటూరుః  రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. విజయవాడలో కల్తీ మద్యం మరణాలు సర్కారీ హత్యలేనని నేతలు అన్నారు. ప్రజల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వం వారిని మద్యానికి బానిసలు చేస్తూ ప్రాణాలు తీస్తోందని మండిపడ్డారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో దౌర్భాగ్యపాలన సాగుతుందని తూర్పారబట్టారు. గ్రామాల్లో తాగడానికి మంచినీళ్లు లేకున్నా...మద్యాన్ని ఏరులై పారిస్తూ చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, ఇతర నాయకులు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఆదాయం వనగూరే అవకాశాలున్న చోటల్లా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తెలుగుదేశం నేతలు టార్గెట్ లు పెట్టి ప్రజలను తాగుబోతులుగా తయారు చేస్తున్నారని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు సంపూర్ణ మద్యపాన నిషేధానికి ముందుకు వస్తుంటే...చంద్రబాబు ఎక్సైజ్ శాఖను గుప్పిట్లో పెట్టుకొని విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా వాటాలు పుచ్చుకుంటూ కల్తీమద్యానికి తలుపులు బార్లా తెరుస్తున్నారని విరుచుకుపడ్డారు. సొసైటీలో ప్రతి చోట మద్యం విక్రయిస్తున్నారని...మహిళలు బయట తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 

గుంటూరులో అధికారికంగా 325 షాపులుంటే ...అనధికారికంగా 3500 షాపులు నడుపుతూ తెలుగుదేశం నాయకులు మద్యం వ్యాపారాలు చేస్తున్నారన్నారని నేతలు దుయ్యబట్టారు. పుష్కరాల్లో 30 మందికి పైగా మరణిస్తే బాధ్యులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. విజయవాడలో కల్తీ మద్యానికి ఐదుగురు మరణించినా కూడా  ప్రభుత్వం తూతూమంత్రంగా దర్యాప్తు కొనసాగించడంపై  వైఎస్సార్సీపీ నేతలు కోపోద్రిక్తులయ్యారు. సొంత ఆదాయం కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందని తిరుగుబాటు చేయడం ఖాయమన్నారు.

తాజా వీడియోలు

Back to Top