బలవంతంగా ఎంపీల ఆసుపత్రికి తరలింపు


ఢిల్లీ: ఆరు రోజులుగా ఆమరణనిరాహార దీక్ష చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు వైయస్‌ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఎంపీల ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సూచనల మేరకు ఢిల్లీ పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో  పోలీసులకు వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులకు మధ్య ఏపీ భవన్‌ వద్ద తోపులాట జరిగింది. అంబులెన్స్‌లను వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులను బలవంతంగా పక్కను నెట్టి ఎంపీలను ఆసుపత్రికి తరలించారు. దీంతో దీక్షాస్థలి వద్ద ఉధృక్తత నెలకొంది. నేతలు ప్రతిఘటిస్తున్నా.. దీక్షలోని ఎంపీలను బలవంతంగా ర్యాపిడ్‌ యాక‌్షన్‌ ఫోర్స్‌ బలవంతంగా అక్కడి నుంచి రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, జై జగన్‌ నినాదాలు మిన్నంటాయి. బలగాలను అడ్డుకోవడానికి పార్టీ శ్రేణులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రికత్త నెలకొంది.

వైద్యుల పరీక్షలు..!
గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న ఈ ఇద్దరు యువ ఎంపీలు మిథున్‌, అవినాష్‌ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్న నేపథ్యంలో రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు బుధవారం ఉదయం వారికి పరీక్షలు జరిపారు. వీరిద్దరి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని, రక్తంలో చక్కెరస్థాయి క్రమంగా ప్రమాదస్థాయికి పడిపోతోందని వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్‌రెడ్డి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ 73కు పడిపోగా, మరో ఎంపీ మిథున్‌రెడ్డి బ్లడ్‌షుగర్‌ లెవల్స్‌ 71కి పడిపోయింది. అవినాష్‌రెడ్డి బీపీ లెవల్స్‌ 80/60 మధ్య ఉండగా.. మిథున్‌రెడ్డి బీపీ లెవల్స్‌ 110/70గా ఉన్నాయి. ఎంపీల శరీరంలోని కీటోన్స్‌ సంఖ్య కూడా ప్రమాదకరంగా ఉంది. షుగర్‌ లెవల్స్‌ తగ్గిపోయిన నేపథ్యంలో ఇద్దరు యువ ఎంపీలు దీక్ష కొనసాగిస్తే ప్రమాదకరమని, శరీరంలోని ఇతర అవయవాలు, మెదడుపై ప్రభావం చూసే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీక్ష విరమించాలని ఎంపీలను కోరినట్టు వారు తెలిపారు. ఇద్దరు ఎంపీలు డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నారని, తక్షణం ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్‌ ఎక్కించాల్సిన అవసరముందని ఆర్‌ఎంఎల్‌ వైద్యులు సూచించారు. కానీ, ఎంపీలు చెక్కుచెదరని సంకల్పంతో తమ దీక్ష విరమించేది లేదంటూ వైద్యుల సూచనను తిరస్కరించారు. దీంతో వైద్యులు ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చారు.


 
Back to Top