ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ దారుణం



ఎఫ్‌ఆర్‌డీఐ చట్టంతో డిపాజిటర్లకు తీవ్ర నష్టం
అన్ని పార్టీల మద్దతుతో బిల్లు వీగిపోయేలా చేస్తాం
ఫిరాయింపుల విషయంలో వెంకయ్యను స్పీకర్లు ఆదర్శంగా తీసుకోవాలి
ఢిల్లీ: లాభాలు అర్జించే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఏపీలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను ప్రైవేటీకరణ చేయడం విడ్డూరం అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌లో 1580 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, లాభాల్లో నడుస్తున్న సంస్థను ప్రైవేటీకరణ చేయడం వల్ల వారంతా రోడ్డున పడతారన్నారు. గతంలో రాజ్యసభలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌పై చర్చిస్తే అటువంటి అంశం లేదని చెప్పిన మంత్రి ఇప్పుడు వెనకడుగు వేసి ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. మరోసారి రాజ్యసభలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు. అదే విధంగా రాజ్యసభలో ఇంకో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ఫైనాన్సియల్‌ రెజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్‌ 2017ను ప్రవేశపెడతామన్నారు. గతంలో ఏదైనా ప్రభుత్వరంగ బ్యాంక్‌ నష్టాల్లో కూరుకుపోయి ఉంటే ప్రభుత్వ పెద్దల సిఫారస్సుల ప్రకారం మరో ప్రభుత్వం, ప్రైవేట్‌ బ్యాంక్‌లలో అనుసంధానం చేసేవారని గుర్తు చేశారు. కానీ కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుతో డిపాజిటర్లు నష్టపోతారన్నారు. బ్యాంక్‌ నష్టపోతే డిపాజిటర్లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదనే బిల్లును ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. కొత్త బిల్లు పెట్టడం ద్వారా ప్రభుత్వ అసమర్ధతతకు అద్దం పడుతుందన్నారు. ఇది పూర్తిగా ప్రజావ్యతిరేక చర్య. దానికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తాం. మిగిలిన పార్టీలను కలుపుకొని బిల్లు వీగిపోయేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

ఫిరాయింపులపై రాజ్యసభ చైర్మన్‌ తీసుకున్న నిర్ణయాన్ని చట్టసభల స్పీకర్లు ఆదర్శంగా తీసుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎంపీ, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని కోరారు. 
Back to Top