వైయస్‌ జగన్‌ సింహం..సింగిల్‌గా వస్తారు


– అక్రమంగా దోచుకున్న డబ్బును చూసుకొని బాబు ఎన్నికలకు సిద్ధమంటున్నారు
–నంద్యాల తరహాలోనే డబ్బు ఖర్చు చేసి గెలుస్తామన్న ధీమా బాబుది
– చంద్రబాబు సత్తా ఉన్న ముఖ్యమంత్రి కాదు
– ఒంటరిగా పోటీకి వెళ్లేందుకు బాబు భయపడుతున్నారు
– దొడ్డిదారిలో సీఎం అయిన వ్యక్తి చంద్రబాబు
– నాయీ బ్రాహ్మణులపై కళ్లు ఎ్రరజేసీ వారిపై చిందులేస్తారా?
– ప్రజాస్వామ్యం, ఓటు, దళితుల విలువ వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది
 
హైదరాబాద్‌: చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలపై ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు వరప్రసాద్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు దొడ్డిదారిలో సీఎం అయ్యారని, వైయస్‌ జగన్‌ సింహం లాంటి వ్యక్తి అని..సింగిల్‌గా వస్తారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎన్నికల్లో గెలవాలన్న అహంకారం కనిపిస్తుందని ఆయన మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  నాలుగేళ్లుగా చంద్రబాబు.. ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప రాజధానిలో ఒక్క శాశ్వత భవన నిర్మాణం లేదని, పోలవరంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైయస్‌ జగన్‌ నేతృత్వంలో పోరాటం చేశామన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం పెట్టడమే కాకుండా ఎంపీ పదవులకు రాజీనామా చేసి అమరణ నిరాహారదీక్షలు చేపట్టామని గుర్తు చేశారు. చంద్రబాబుకు కండకావురం ఎలా ఉందంటే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఎప్పుడు ఆమోదిస్తారా? ఆ స్థానాల్లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా అన్న కోణంలో ఆలోచన చే స్తున్నారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగైతే గెలిచారో? అలాగే ఉప ఎన్నికల్లో అక్రమంగా సంపాదించిన డబ్బుతో గెలవాలన్న అహంకారంతో చంద్రబాబు ఉన్నారన్నారు. టీడీపీ ఎంపీలు పద్ధతి ప్రకారం నాటకాలాడుతున్నారని విమర్శించారు. హోదా సాధనకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేశామని, మమ్మల్ని టీడీపీ నేతలు హేళనగా చూశారన్నారు. గత పార్లమెంట్‌ సమావేశాల్లో లోక్‌సభ నిరవధికంగా వాయిద పడిన తరువాత టీడీపీ ఎంపీలు స్పీకర్‌ ఛాంబర్‌ వద్ద పడుకొని, నిలబడి, కూర్చోని ఫోటోలు తీసుకున్నారన్నారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు ఎల్లోమీడియాను ఉపయోగించుకున్నారే తప్ప..ప్రత్యేక హోదా సాధనకు వారు చేసింది ఏమీ లేదన్నారు. ప్రధాన మంత్రి ఇల్లు ముట్టడి అని పెద్ద జోక్‌ చేశారన్నారు. కిలోమీటర్‌ దూరంలో టీడీపీ ఎంపీలు నిలబడి..పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి హ్యాపీగా వ్యాన్‌ ఏర్పాటు చేసుకొని వెళ్లిపోయారన్నారు. మా రాజీనామాలు స్పీకర్‌ ఫార్మెట్లో ఇచ్చి ఒత్తిడి తెచ్చామన్నారు. అతి త్వరలోనే మా రాజీనామాలు ఆమోదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశాల్లో మేం ఉండము కాబట్టి టీడీపీ నేతలు వాళ్లకు ఇష్టం వచ్చినట్లు వేశాలు వేయవచ్చు అన్నారు. గాంధీ బొమ్మ వద్ద మాత్రం మీడియాలో ఫోజుల కోసం నిలబడతారని, తరువాత స్పీకర్‌ పోడియం వద్ద కాసేపు ని లబడి మరో నాటకం ఆడటం టీడీపీకి పరిపాటిగా మారిందన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరించి, ప్యాకేజీని స్వాగతించారని మండిపడ్డారు. ఏ రోజైనా ప్రత్యేక హోదా కోసం టీడీపీ నేతలు మాట్లాడారా అని ఆయన నిలదీశారు. మీ బలహీనతలు, అహంకారాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉందన్నారు. ఏ రోజు కూడా చంద్రబాబు ఒంటరిగా గెలిచిన దాఖలాలు లేవన్నారు. సింహం సింగిల్‌గా వెళ్తుందని, పిరికివారు పది మందితో కలిసి వెళ్తారని చెప్పారు. వైయస్‌ జగన్‌ సింగిల్‌గా ప్రజల వద్దకు వెళ్లి నాన్నగారి ఆశయ సాధనకు ముందుకు వెళ్తున్నారన్నారు. చంద్రబాబు మాదిరిగా పిరికిపందలా ఎవరినో ఒకరిని పట్టుకొని ముఖ్యమంత్రి కావాలన్న ఆశ వైయస్‌ జగన్‌కు లేదన్నారు. విభజన చట్టంలోని అంశాలను సాధించలేని అసమర్ధుడు చంద్రబాబు అన్నారు. దుగ్గరాజుపట్టణం పోర్టు 2018కి పూర్తి కావాల్సి ఉండగా, కేంద్రం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నా కూడా టీడీపీ ఆ పోర్టు పూర్తి కాకుండా అడ్డుకుందని ఆరోపించారు. మా ఎమ్మెల్యేలు, ఎంపీలను కొన్న చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ..జన్మభూమి కమిటీలతో కలెక్టర్‌కు కూడా ప్రాధాన్యత లేకుండా చేశారన్నారు. అవినీతిపరుడు, సహనం లేని, అహంకారంతో వ్యవహరించిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు. వయసు పైబడి ఇలా వ్యవహరిస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు తెలుసుకొని, అబద్ధాలు ఆడకుండా ఉంటారో వారికే ప్రజలను పాలించే హక్కు ఉంటుందని హెచ్చరించారు. 
 

తాజా వీడియోలు

Back to Top