సమైక్య వాణిపై సస్పెన్షన్‌ దాష్టీకం

హైదరాబాద్ :

రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై ఓటింగ్ ‌నిర్వహించాలని, లేకపోతే దానిపై చర్చకు ముందే సమైక్య రాష్ట్ర తీర్మానం చేయాలని పట్టుబట్టిన వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ప్రజాప్రతినిధులను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు. ‘సమైక్యాంధ్రే మా లక్ష్యం. ఓటింగ్ జరగకుండా చర్చను కొనసాగిస్తే విభజనను అంగీకరించినట్టే. ముందు ఓటింగ్ జరపాల్సిందే. పూర్తి సమాచారం లేని అసమగ్ర బిల్లుపై చర్చ అర్థరహితం’ అంటూ నిరసన వ్యక్తం చేసినందుకు 15 మంది‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలను సభ నుంచి గెంటేశారు. విభజన బిల్లుపై ఎలాగైనా చర్చను ముందుకు తీసుకెళ్లాలన్న ఆతృతతో ఉన్న ప్రభుత్వం సమైక్య నినాదాలతో ఉభయ సభల్లో పోడియాలను చుట్టుముట్టిన వైయస్ఆర్‌సీపీ సభ్యులపై ఒకరోజు పాటు సస్పెన్షన్ వేటు వేసింది. మార్షల్సును పెట్టి మరీ వారిని ఉభయ సభల నుంచి బయటికి గెంటించింది.

పెద్దలసభ సంప్రదాయాలను తోసిరాజంటూ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి‌. దీన్ని నిరసిస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండలి అవరణలో ధర్నా చేశారు. నిన్నటి‌ వరకూ సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టి, బిల్లుపై చర్చ వద్దని డిమాండ్ చేసిన టీడీపీ ఇప్పుడు రాత్రికి రాత్రే వైఖరి మార్చి కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే టీడీపీకి ఏం న్యాయం జరిగిందంటూ నిలదీశారు. తమ సభ్యుల సస్పెన్షన్‌ను పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ తీవ్రంగా నిరసించారు. సమైక్యం కోసం గళమెత్తితే సభ నుంచి గెంటేయడం ఏమిటంటూ నిలదీశారు. తమ డిమాండ్‌ను పట్టించుకోకపోగా సస్పెండ్ చేసినందుకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌ‌ట్ చేశారు. మరోవైపు సస్పెన్ష‌న్‌తో ఆగకుండా వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కనీవినీ ఎ‌రుగని రీతిలో అణచివేతకు దిగింది.

అనంతరం పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మతో సహా 21 మంది ఎమ్మెల్యేలను ఖాకీలు అమానుష రీతిలో అరెస్టు చేశారు. దాదాపు ఈడ్చుకెళ్లి మరీ బలవంతంగా వాహనాల్లోకి  ఎక్కించారు. కనీసం మీడియాతో మాట్లాడేందుకు కూడా వారికి అవకాశ‌ం ఇవ్వలేదు. ఈ ఉదంతాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించిన మీడియా సిబ్బందిని కూడా దురుసుగా అడ్డుకున్నారు. చేతికి అందిన వారినల్లా విసురుగా లాగిపడేశారు. వారెవరూ ఎమ్మెల్యేల సమీపానికి కూడా వెళ్లకుండా నిరోధించారు. అనంతరం ఎమ్మెల్యేలను గోషామహ‌ల్ స్టేడియానికి తరలించారు. ‌అసెంబ్లీ వాయిదా పడే వరకూ వారిని గంటల తరబడి నిర్బంధంలోనే ఉంచారు. తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మధ్యాహ్నం సభ నుంచి సస్పెండైన అనంతరం అసెంబ్లీ ఇన్నర్ లాబీల వద్ద మొదలైన పోలీసుల అణచివేత, రవీంద్రభారతి చౌరాస్తా సమీపంలో ఎమ్మెల్యేలను అరెస్టు చేసే‌ వరకూ పకడ్బందీగా కొనసాగింది.

అంతేగాక వైయస్ఆర్‌సీపీ నిరసన కార్యక్రమాలకు ఎలాంటి కవరేజీ రాకుండా చూడటమే తమ ఉద్దేశం అన్నట్టుగా పోలీసులు ఆద్యంతం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రభుత్వ దమనకాండను శ్రీమతి విజయమ్మ సహా ఎమ్మెల్యేలంతా తీవ్రంగా నిరసించారు. స్టేడియంలో ధర్నా చేశారు. అరెస్టు అమానుషమని, తమ ప్రజాస్వామిక హక్కులను హరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

Back to Top