ఓటుకు నోటు కేసు నుంచి త‌ప్పించుకునేందుకే ఏసీ దీక్ష‌లు

  
విజ‌య‌వాడ‌:  ఓటుకు కోట్లు కేసు నుంచి త‌ప్పించుకునేందుకు చంద్రబాబునాయుడు  ర్యాలీలు, ధర్మపోరాటం పేరుతో ఏసీ దీక్షలు చేస్తున్నార‌ని  వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ధ్వజమెత్తారు. జైలుపాలు కావాల్సి ఉంటుందని ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు ప్రజల్లో సానుభూతి కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. గతేడాది అంతర్జాతీయ మహిళా సదస్సుకు వచ్చిన ఆమెను ఎయిర్‌పోర్టులో పోలీసులు అక్రమంగా నిర్భంధించడంపై గన్నవరంలోని కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు నిమిత్తం ఆమె విజ‌య‌వాడ‌కు వచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా, మహిళలు, ఆడపిల్లల రక్షణ గురించి ఏరోజు పట్టించుకోని ఆయన ఇటీవల ప్రజలు, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు కొత్త నాటకానికి తెరతీశారని విరుచుకుపడ్డారు.  తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఏసీబీ మీటింగ్‌ పెడితే ఇక్కడ చంద్రబాబు ఎలా వణుకుతున్నారో అందరూ గమనిస్తున్నారని చెప్పారు. 

గుమ్మడికాయల దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లు మంత్రి సోమిరెడ్డి, కంభంపాటి, వర్ల రామయ్య మాట్లడడం చూస్తుంటేనే ఆ పార్టీకి ఓటుకు నోటు కేసు భయం పట్టుకుందని అర్థమవుతుందన్నారు. ఓటుకు నోటు కేసు అసలు కేసే కాదన్న వాళ్లు ఈ రోజు బీజేపీతో కలిసి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుట్రపన్నారని చెప్పడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్‌ను తన ఇంటికి పిలిచి 36 రకాల వంటకాలతో విందు ఇచ్చి ఆయనతో లాలూచీ పడిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. 


Back to Top