దొంగ దీక్షలు చేస్తున్న నేతలను తరిమికొట్టాలి

  • బాబు దీక్ష నారావారి నయవంచక విధ్వంసపు దీక్ష
  • చంద్రబాబుకు వెయ్యి ఏళ్ల జైలు, రూ. 5 లక్షల కోట్ల జరిమానా ఖాయం
  • చేసిన పాపాలు కడుక్కోవడానికి ‘జగన్నామస్మరణ’
  • మిత్రపక్ష బీజేపీ ఛీ కొట్టినాక సిగ్గులేకుండా దీక్షలా..?
  • బాబుకు అల్జిమర్స్‌ వ్యాధేమో.. చెకప్‌ చేసుకుంటే మంచిది
  • మేం నిప్పు అని తండ్రీకొడుకులిద్దరూ కాణిపాకంలో ప్రమాణం చేయగలరా..?
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా

  • హైదరాబాద్‌: రాష్ట్రం విడిపోయిందని ప్రజలంతా బాధతో ఉంటే పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తూ దొంగ దీక్షలు చేస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలను ప్రజలంతా తరిమికొట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ ఆర్కే రోజా ప్రజలకు పిలుపునిచ్చారు. వినేవాడు వెర్రివాడైతే.. చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లుగా ఆయన చేసిన తప్పులు,  అవినీతి, మోసాలపై ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇలాంటి దొంగ దీక్షలు చేస్తునే ఉంటాడని ధ్వ‌జ‌మెత్తారు. నవనిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు 7 రోజుల పాటు చేస్తున్న దీక్షలపై రోజా విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఉగ్రవాదంపై పోరాడుతున్నామని బిన్‌లాడెన్‌ చెప్పినా... రాక్షసత్వం నశించాలని రావణాసురుడు ప్రతిజ్ఞ చేసినా ఎలా నవ్వుకుంటారో.. అవినీతిపై పోరాడుదామని చంద్రబాబు ప్రమాణం చేస్తున్నా.. అదే విధంగా నవ్వుకుంటున్నార’’ని రోజా ఎద్దేవా చేశారు. బాబు మాటలు మిలీనియం జోక్‌ ఉందన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పక్క రాష్ట్రంలో సంబరాలు చేసుకుంటుంటే... రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టించింది చాలక ఏడు రోజుల నవనిర్మాణ దీక్ష అంటున్నావంటే.. ఒక ఇంట్లో ఏదైనా చెడు జరిగితే మనం పండుగలు చేసుకుంటామా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఏపీ నదులను, ఆస్తులను, ఆఖరికి రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టి కొత్తగా దీక్ష పేరుతో ప్రజలను మోసం చేయాలనుకుంటున్నావా చంద్రబాబు అని రోజా నిలదీశారు. చంద్రబాబు చేసే దీక్ష నారావారి నయవంచన దీక్ష, నారావారి విధ్వంసపు దీక్ష అని ఆరోపించారు. 

    బాబుకు జైలు శిక్ష ఖాయం
    చంద్రబాబు మూడేళ్లు అవినీతి రహిత పాలన అందించాడా అని న్యాయదేవత ముందు విచారణ జరిపిస్తే బాబుకు కచ్చితంగా వెయ్యి ఏళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల కోట్ల జరిమానా ఖాయమని రోజా అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమీ నెరవేర్చకపోయినా.. అన్ని జరిగినట్లు దీక్షలో ప్రతిజ్ఞ చేస్తున్నారంటే బాబు అల్జిమర్స్‌ వ్యాధి అయినా ఉండాలి.. లేక అంతకంటే పెద్ద జబ్బు ఏదైనా ఉంటుందని రోజా విమర్శించారు. జరగనివి కూడా జరిగినట్లు చెబుతున్నారంటే.. చంద్రబాబు డాక్టర్‌తో చెకప్‌ చేయించుకొని ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే మంచిదని చురకంటించారు. రాష్ట్రంలో 2014లో చంద్రబాబుతో స్టార్ట్‌ అయిన దోపిడీ ఇప్పుడు బాబుగారి బాబుతో కొనసాగుతందన్నారు. కొత్తగా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. చంద్రబాబు తన పరిపాలనపై నిజంగా నమ్మకం ఉంటే మనందరికీ ఇష్టదైవమైన కాణిపాకం వినాయకుడి గుడికెళ్లి మేం ఎలాంటి అవినీతి చేయలేదని తండ్రీకొడుకులిద్దరూ ప్రమాణం చేయాలన్నారు. అలాగే మా రెండు ఎకరాల్లో వేసిన విత్తనాలు రూ. 2 వేలు, 500లతో వచ్చిన పంటతో హెరిటేజ్‌ లాభాలు, లోకేష్‌కు 5 నెలల్లో 22 రెంట్ల ఆస్తి పెరిగినట్లు ప్రమాణం చేయగలరా అని నిలదీశారు. 

    డిక్కీ బలిసిన కోడిలా ఉంది లోకేష్‌ సవాల్‌
    చేసిన పాపాలు కడుక్కోవడానికి రాక్షసులంతా శ్రీహరి నామస్మరణ చేస్తారని, కానీ చంద్రబాబు చేసిన పాపాలు కడుక్కోవడానికి ‘వైయస్‌ జగన్‌ నామస్మరణ’ చేస్తున్నారేమోనని అనుమానంగా ఉందన్నారు. మూడు రోజలు పాటు సాగిన మహానాడులో చేసిన, చేయబోతున్న పనుల గురించి చెప్పుకోకుండా టీడీపీ నేతలంతా వైయస్‌ జగన్‌ స్మరించుకున్నారన్నారు. లోకేష్‌ సవాలు చూస్తుంటే సినీహీరో మహేష్‌బాబు సినిమాలోని డైలాగ్‌ గుర్తొస్తుందన్నారు. ‘డిక్కీ బలిసిన కోడి చికెన్‌ షాప్‌ ముందుకొచ్చి తొడకొట్టినట్లుగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. సొంతంగా పార్టీ పెట్టుకొని 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న  వైయస్‌ జగన్‌ ఎక్కడా.. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకుండా దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్‌ ఎక్కడా..? అని ధ్వజమెత్తారు. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీనే బాబుతో పొత్తుపెట్టుకుంటే బస్మాసురుడితో పెట్టుకున్నట్లేనని ఫ్లకార్డులు పట్టుకొని విజయవాడలో ఆందోళనకు దిగారన్నారు. మిత్రపక్షమే ఛీ కొట్టినా చంద్రబాబు సిగ్గులేకుండా దీక్ష ఎందుకు చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు మంచి చేసి అభిమానం పొంది ఎన్నికల్లో గెలుద్దామని లేదు కానీ, ఎన్ని నోట్లు పంచుదాం.. ఎన్ని ఓట్లు కొందాం.. అవినీతి సంపాదనతో అధికారాన్ని ఎలా కొందామనే ఆలోచనే టీడీపీ సర్కార్‌లో ఉందన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆలోచనే లేదన్నారు. దీనికి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అన్నారు. చంద్రబాబు దొంగ దీక్షలకు మోసపోకుండా చంద్రబాబు ప్రజలు ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి డ్రామాలకు తెరదించే విధంగా టీడీపీ నేతలను నిలదీసి తరిమికొట్టాలని పునరుద్ఘాటించారు.
Back to Top