మేం చెప్పిందే నిజమైంది



– కాగ్‌ నివేదికలో పోలవరం అవినీతి బట్టబయలు
  – పోలవరం నిర్వహణ ఎలా ఉందో కాగ్‌ నిగ్గు తేల్చింది. 
– కాంట్రాక్టర్‌కు దోచి పెట్టారని కాగ్‌ రిపోర్టులో తేల్చింది
– కాగ్‌  నేరుగా ప్రభుత్వంపైనే ఆరోపణ చేసింది
– పోలవరం 2019 నాటికి పూర్తయ్యేలా లేదని కాగ్‌ తేల్చింది
– కమీషన్లు దోచుకోవటానికే పోలవరం?
– పట్టిసీమ అనవసరమని కాగ్‌ ఆనాడే చెప్పింది
– పోలవరం కోసమే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు
– భూ సేకరణపై కేంద్రం ప్రశ్నలకు సమాధానం ఏదీ?

హైదరాబాద్‌: మొదటి నుంచి పోలవరం విషయంలో వైయస్‌ఆర్‌సీపీ ఏమైతే ఆరోపణలు చేసిందో కాగ్‌ నివేదికలో అవే ఉన్నాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు, కమీషన్ల కోసం చంద్రబాబు పోలవరం బాధ్యతలు చేపట్టారని, అదే విషయం కాగ్‌ నివేదికలో స్పష్టమైందన్నారు.  పోలవరం ప్రాజెక్టుపై కాగ్‌ రిపోర్టులో ఎన్నో ముఖ్యమైన అంశాలు ఉన్నాయని ఆయన మీడియాకు వివరించారు. గురువారం వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాగ్‌ అన్నది  ప్రతి విషయం కూడా డ్యాకుమెంట్‌గా అన్ని అభిప్రాయాలు తీసుకున్న తరువాత వివరాలు వెల్లడించే అత్యున్నత సంస్థ అన్నారు. ఈ ఏడాది కాగ్‌ నివేదికలో ఎక్కువ శాతం నీటిపారుదలశాఖకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. మూడు ముఖ్యమైన విషయాలపై కాగ్‌ నివేదిక ఉందన్నారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు ప్రదర్శన తన నివేదికలో పొందుపరిచిందన్నారు. కేంద్ర జలవనరుల సూచన లకు అనుగుణంగా ఉండాలన్నది ఒక అంశమైతే, పోలవరంలో ఖర్చులు, నిర్వాహణ, మానిటరింగ్‌ సరిగా ఉందా? లేదా అన్నది వివరించారన్నారు. ఏపీకి పోలవరం చాలా ప్రాముఖ్యమైన ప్రాజెక్టు అన్నారు. 7 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు అని, 900 మెగా వాట్ల పవర్‌ ప్లాంట్, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు నీటి సరఫరా, తాగునీటి అవసరాలు తీర్చే పెద్ద ప్రాజెక్టు పోలవరం అన్నారు. ఏపీ పునర్వీభనలో యూపీఏ ప్రభుత్వం దిగిపోయే సమయంలో మనకు పోలవరం ప్రాజెక్టు ఇచ్చారన్నారు. ఈ రోజుకు కూడా భూసేకరణ జరగలేదన్నారు. 36 వేల ఎకరాల భూమి నీటి ముంపుకు అవసరం ఉందన్నారు. 26 వేల ఎకరాలు కెనాల్‌కు అవసరమని చెప్పిందన్నారు. 1.60 వేల కుటుంబాలకు పునారావాసం కల్పించాల్సి ఉండగా ఇంతవరకు నాలుగు శాతం మాత్రమే తరలించారన్నారు. ఈ రోజు వరకు కూడా పక్క రాష్ట్రాల్లో నీటి ముంపు లేకుండా ఉండే చర్యలు ఇంతవరకు మొదలే కాలేదన్నారు. రూ.1407 కోట్లు భూసేకరణ కోసం ఖర్చు చేశామని చెబుతున్నారని, సరైన లెక్కలు చూపకపోవడంతో  కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని నివేదికలో పేర్కొన్నారన్నారు. 

 పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు రూ.18300 కోట్లు ఇవ్వాల్సి ఉండగా వివిధ రకాలుగా ఎక్కువగా ఇచ్చారని నివేదికలో పేర్కొన్నారని చెప్పారు. ఇది తీవ్రమైన ఆరోపణ అని గుర్తు చేశారు. ఆలస్యమైనందునా కాంట్రాక్టర్ల నుంచి తిరిగి డబ్బులు వసూలు చేసే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. పర్యావరణ, అరణ్యశాఖలకు సంబంధించి ఎన్నో మానిటరింగ్‌ మోకానిజమ్స్‌ సరిగా జరుగలేదన్నారు. వీటన్నిటి కారణంగా, ఆలస్యంగా ప్రాజెక్టు పనులు జరగడంతో 2019లో పోలవరం పూర్తి కావడం అసాధ్యమని కాగ్‌ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని బుగ్గన చెప్పారు. 
– మొదటి నుంచి కూడా వైయస్‌ఆర్‌సీపీ పోలవరం విషయంలో పలు అనుమానాలు వ్యక్తి చేసిందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. పోలవరం చాలా పెద్ద ప్రాజెక్టు అని, ఇది జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందన్నారు. పలు రాష్ట్రాలకు సంబంధం ఉన్న ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే ఈ ప్రాజెక్టును చేపట్టి ఉంటే త్వరగా పూర్తి అయ్యేదని మొదటి నుంచి చెబుతున్నామని గుర్తు చేశారు. చట్టంలో ఉన్న ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవడం తప్పు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు చేపట్టడంతో ఎన్నో అభియోగాలు, ఆటంకాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. 

ఆ రోజు చంద్రబాబు ప్రత్యేక హోదాను పోలవరం కోసం తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రం కంటే కేంద్రం గొప్పది కాదా అని నిలదీశారు. కేంద్రం తలుచుకుంటే పోలవరాన్ని ఈ పాటికి పూర్తి చేసేదన్నారు. కేంద్రం బాధ్యతను చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని, కారణం కాంట్రాక్టర్లు తన చేతుల్లోకి వస్తారని, వారి నుంచి కమీషన్లు పొందేందుకే పోలవరం చంద్రబాబు తీసుకున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో 1994 నుంచి 2004 వరకు 10.60 లక్షల ఎకరాలు మేం నీటిపారుదల కిందకు తెచ్చామని, 2004 నుంచి 2014 వరకు 23.54 లక్షల ఎకరాలకు తెచ్చామని చెప్పినట్లు తెలిపారు. మీకే కంటే వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇచ్చారని చంద్రబాబే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ హయాంలో ఎప్పుడు కూడా కాగ్‌ ఆరోపణలు రాలô దని చెప్పారు. రాష్ట్రంలో 40 ప్రాజెక్టులు ఉన్నాయని, రూ.17400 కోట్లు అవసరమని, మేం కచ్చితంగా పూర్తి చేస్తామని బాబు తన శ్వేతపత్రంలో  చెప్పారన్నారు. సెప్టెంబర్‌ 10వ తేదీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ..రూ.58 వేల కోట్లతో నీటి పారుదల శాఖ ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పారన్నారు. అసలు ఇందులో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారని ఆయన నిలదీశారు. రూ.18500 కోట్లు ఈ ప్రభుత్వం అనవసరంగా కాంట్రాక్టర్లకు కట్టబెట్టిందని కాగ్‌ నివేదికలో తేల్చిందన్నారు. గతేడాది పట్టిసీమ ప్రాజెక్టుపై కాగ్‌ తీవ్ర ఆక్షేపణలు చేసిందని, అసలు ఈ ప్రాజెక్టు అనవసరమని చెప్పిందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.600 కోట్లు ఎక్కువగా ఖర్చు చేశారని కాగ్‌ చెప్పినట్లు తెలిపారు. పోలవరం రైట్‌ లెవల్‌ కెనాల్‌ చేసే పనే పట్టిసీమ ప్రాజెక్టు చేస్తుందన్నారు. రైట్‌ కెనాల్‌ చేయాలి కానీ, పట్టిసీమ ఎందుకని కాగ్‌ ప్రశ్నించినట్లు చెప్పారు. ఇంతతీవ్రమైన ఆరోపణలు వస్తుంటే కనీసం ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


 పోలవరం ప్రాజెక్టు వ్యయం 2014కు రూ.16 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.55 వేల కోట్లు చూపుతున్నారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి రూ.8250 కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెరిగిందని కాగ్‌ చెబుతుందన్నారు. మిగతాది కొత్త భూసేకరణ చట్టం కింద ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఇక్కడ మరో వివాదం ఉందని, అదే ప్రాజెక్టు, అంతే నీటి నిల్వలు ఉంటే ఎక్కువ భూమి ఎందుకు అవసరం వచ్చిందని కేంద్రం ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.  దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు కోరిక మేరకే కేంద్ర ఆర్థిక మంత్రి పోలవరానికి రూ.16 వేల కోట్లు మాత్రమే  ఇస్తామని చెప్పారని, భూసేకరణకు అధనంగా ఇస్తామని చెప్పినట్లు ఎక్కడైనా మీ వద్ద ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇంతపెద్ద ప్రాజెక్టులో రూ.30 వేల కోట్లు తేడా వస్తుంటే ఇంతవరకు కేంద్రంతో ఎందుకు క్లారిటీ తీసుకోలేదని నిలదీశారు.  ఏపీ ప్రభుత్వం 2014 నుంచి 2017 వరకు పోలవరానికి రూ.6600 కోట్లు ఖర్చు చేస్తే..ఇందులో కేంద్రం నుంచి రూ.3350 కోట్లు వచ్చాయన్నారు. రూ.3250 కోట్లు ఇంకా రావాల్సి ఉందన్నారు. భూసేకరణ కోసం ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1400 కోట్లకు సంబంధించిన లెక్కలు చూపలేదని, యూసీసీ ఇవ్వలేదని కేంద్రం అభియోగం మోపుతుందన్నారు.  మిగతా రూ.18 వేల కోట్ల ఖర్చులపై కూడా ఏపీ ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాధానం లేదన్నారు. ఇంత ఎక్కువగా ఖర్చులు ఎందుకు అవుతున్నాయని బుగ్గన ప్రశ్నించారు. చట్టం ప్రకారం పోలవరం బాధ్యత కేంద్రానిదే అని, అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఇంతవరకు డిజైన్లు, డ్రాయింగ్స్‌ ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. పోలవరం పనులపై థర్డ్‌ పార్టీ క్వాలిటీ కంట్రోల్‌ లేదన్నారు. కాగ్‌ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 
 
Back to Top