రూ. 2 వేల పంటి ఆపరేషన్కు సుమారు రూ. 3 లక్షలు
నిధుల దుర్వినియోగం ఈ విధంగా ఉంటే అభివృద్ధి ఎలా
వైయస్ఆర్ జిల్లా: రాజధాని పేరుతో ఒకపక్క, ఇసుక, మట్టి మాఫియాతో మరోపక్క చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంజద్ బాషా ధ్వజమెత్తారు. వైయస్ఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద వైయస్ఆర్ సీపీ చేపట్టిన కరువు ధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే యనమల రామకృష్ణుడు సింగపూర్ వెళ్లి పంటి ఆపరేషన్ చేయించుకుంటే ప్రభుత్వం సుమారు రూ. 3 లక్షలు ఖర్చు చేసిందన్నారు. అదే ఆపరేషన్ కడప, విజయవాడలో చేయించుకుంటే రూ. 2 వేలు అవుతుందన్నారు. జిల్లాల పర్యటన పేరుతో చంద్రబాబు రూ. వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని, కడప జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు రెండు హెలికాఫ్టర్లు, ఒక ప్రత్యేక విమానం రెండ్రోజుల పాటు ఒక్కడే మకాం వేశాయన్నారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న సీఎం చంద్రబాబు తప్ప మరెవరూ లేరన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలకుడు రావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు ప్రజల బతుకులు బాగుపడతాయన్నారు. ప్రజలంతా నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసాలను గుర్తుంచుకొని మంచి నాయకుడికి ఓటు వేసి గెలిపించాలని సూచించారు.