టీడీపీ కోటకు బీటలుబారే రోజులొచ్చాయ్‌

చంద్రబాబు నియంతపాలనతో ఇబ్బందుల్లో ప్రజలు
2300 కిమీలకు నందమూరి వేదిక కావడం సంతోషం
రోడ్డు కం రైల్వే బ్రిడ్జీపై జనజాతర సాగిస్తాం

పశ్చిమగోదావరి: టీడీపీ నియంతపాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతీ గ్రామం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జననేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత అన్నారు. కొవ్వూరులో కొనసాగుతున్న 186వ రోజు ప్రజా సంకల్పయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కొవ్వూరు నియోజకవర్గానికి కంచుకోటగా ఉన్న టీడీపీకి బీటలు పారే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కొవ్వూరు మున్సిపాలిటీ, మిగతా మండలాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రతీ గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ప్రజలంతా టీడీపీ నియంతపాలనలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

కొవ్వూరు నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ 2300 కిలోమీటర్ల మైలురాయి దాటడం చాలా సంతోషంగా ఉందని వనిత అన్నారు. నందమూరి క్రాస్‌ ప్రజా సంకల్పయాత్ర 2300ల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. దీంతో నందమూరి క్రాస్‌ వద్ద స్థూపంతో పాటు.. మొక్క నాటేందుకు, పార్టీ జెండా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. మంగళవారం సాయంత్రం వైయస్‌ జగన్‌ రోడ్డు కం రైల్వే బ్రిడ్జీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారని వివరించారు. కొవ్వూరు నియోజకవర్గం నుంచి తూర్పుగోదావరిలోకి అడుగుపెడుతున్న వైయస్‌ జగన్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నామన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు ఏ విధంగా స్వాగతం పలికారో.. అదే విధంగా వైయస్‌ జగన్‌కు కూడా రోడ్డు కం రైల్వే బ్రిడ్జీపై ఘనస్వాగతం పలికేందుకు తూర్పు గోదావరి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 
 
Back to Top