వైయస్‌ జగన్‌ సీఎం కావాలన్నదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష




విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ నేత ఉమాశంకర్‌ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని ఆయన తెలిపారు. గురువారం నర్సిపట్నంలో నిర్వహిస్తున్న వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ మైదాన ప్రాంత గిరిజనులు జననేతను కలిశారన్నారు. మైదాన ప్రాంత గిరిజనులను ఐటీడీఏ పరిధిలోకి గుర్తించాలని కోరారని తెలిపారు. మినీ ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరారని చెప్పారు. అలాగే మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని తమకు పింఛన్లు అందడం లేదని వాపోయారన్నారు. టీడీపీకి ఓట్లు వేసిన వారికే పింఛన్లు, పక్కా గృహాలు మంజూరు చేస్తున్నారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఫిర్యాదులు అందుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలు వైయస్‌ జగన్‌ ఓపికతో వింటున్నారని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వైయస్‌ జగన్‌ సీఎం కావాలని కోరుకుంటున్నారని ఉమా శంకర్‌ తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top