చంద్రబాబు ఇకనైనా పాఠాలు నేర్చుకోవాలి



– సాధారణ వానలకే అమరావతి అస్తవ్యస్తం
– రాజధానికి ఈ ప్రాంతం పనికి రాదని శివరామకృష్ణన్‌ నివేదిక ఇచ్చింది
 
అమరావతి: ఇటీవల వరుసగా సంభవిస్తున్న వరదలను చూసైనా చంద్రబాబు రాజధాని నిర్మాణ విషయంలో పాఠాలు నేర్చుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీవీఎస్‌ నాగిరెడ్డి సూచించారు. అమరావతిలో సాధారణ వ ర్షానికే అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరదల కారణంగా ఇవాళ కేరళ మొత్తం మునిగిపోయిందని, గతంలో చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌లోని బాలానగర్‌ మునిగిపోయాయన్నారు. ఇలాంటి సంఘటనలు చూసైనా చంద్రబాబు పాఠాలు నేర్చుకుంటే బాగుంటుందన్నారు. అమరావతి ప్రాంతంలో 13 అడుగుల్లో భూగర్భ జలాలు ఉన్నాయని, రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి ఉండదని చెప్పారు. అన్ని పంటలు పండే ప్రాంతంలో మూర్ఖంగా రాజధాని నిర్మాణం చేపట్టడం ఏంటని నిలదీశారు. ఈ ప్రాంతంలో వరద ముప్పు ఉందని సీఆర్‌డీఏ నివేదికలో కూడా ఉందన్నారు.  ఇక్కడ పడిన వర్షం 90 నుంచి 100 మిల్లీ మీటర్ల వర్షమన్నారు. ఇవాళ కేరళలో 350 మిల్లీమీటర్లని, గతంలో చెన్నై మునిగినప్పుడు 430 మిల్లీ మీటర్లు అని చెప్పారు. గతంలో బాంబేలో 24 గంటల్లో 1000 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు. ఇప్పుడు ఏపీలో పడిన వర్షం భారీ వర్షం కాదని, సాధారణ వానాలకే అమరావతి నగరం అస్తవ్యస్తంగా మారిందన్నారు. చంద్రబాబు పాదమే కరువు పాదం కాబట్టి ఆయన పిరియడ్‌లో వర్షాలు సరిగా కురవలేదన్నారు. ఏపీ రాజధాని అమరావతి చుట్టూరా జల విలయం ఉందని గతంలోనే శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలు ఇచ్చిందన్నారు. ఇక్కడి భూములు మామూలు వర్షాలకే బురదమయం అవుతాయన్నారు. ఈ ప్రాంతం రాజధానికి పనికి రాదని నివేదిక ఇచ్చినా కూడా చంద్రబాబు పట్టించుకోకుండా వేల కోట్లు ఖర్చు చేసి టెంపరరీ భవనాలు నిర్మించారన్నారు. సిమెంట్, కాంక్రీట్‌ ఉన్న భవనాలు కూలడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మరింత కరుడుగట్టిన రైతు వ్యతిరేకిక చంద్రబాబు మారాడని, దోపిడీదారుడిగా మారాడని నాగిరెడ్డి మండిపడ్డారు. రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రి హేళనగా మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. గతంలో వైయస్‌ జగన్‌ చాంబర్‌లో నీళ్లు వస్తే పైపులు కోశారని ఆరోపించారని, ఇవాళ మంత్రుల చాంబర్లలోకి కూడా వర్షం నీరు వచ్చిందని, వారు కూడా పైపులు కోశారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలని ఆయన సూచించారు. 
 
Back to Top