బడా బాబులకు వేల కోట్లు ఎక్కడివి?

గుంటూరు: పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బడా బాబులకు వేల కోట్ల కొత్త నోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, టీడీపీ నాయకులు ఏసీ రూముల్లో కూర్చొని ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. కనీసం వంద రూపాయలు తెచ్చుకొనేందుకు కూడా సామాన్యుడు చాలా కష్టపడుతున్నాడన్నారు. ఏ నాడు కూడా టీడీపీ నేతలు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడలేదని విమర్శించారు. బయటకు వచ్చి చూస్తే ప్రజల ఇబ్బందులు అర్థమవుతున్నాయని సూచించారు.  చంద్రబాబు నిత్యం టెలీ కాన్ఫరెన్స్‌లు అంటూ ఏసీ రూముల్లో కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం కాదని, ప్రజల్లోకి వచ్చి అసలు ఇక్కట్లను గమనించాలని మోపిదేవి సూచించారు. 
Back to Top