ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ. లక్ష బాకీ



విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి లక్ష రూపాయలు నిరుద్యోగ భృతి కింద బాకీ పడిందని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మల్లాది విష్ణు విమర్శించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర యువకులను నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిందని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మల్లాది విష్ణు మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రావడానికి బాబు వస్తే జాబు వస్తుందన్న నినాదం ముఖ్యమైందన్నారు. ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామని, నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు మాట తప్పారని మండిపడ్డారు. ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని 10 లక్షల మందికి వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామనడం ఎంత వరకు సమంజసమన్నారు. రాష్ట్రంలో కోటి 70 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఒక్కోక్కరికి నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటే నాలుగేళ్లుగా ఒక్క రూపాయి కూడా  ఇవ్వకుండా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ప్రభుత్వం బాకీ పడిందన్నారు.



 

  
 
Back to Top