కడప: ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడ్డ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఇప్పటివరకూ ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు సస్పెండ్ చేయలేదని వైఎస్సార్ సీపీ ప్రశ్నించింది. రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంలో చంద్రబాబు పాత్ర కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవింద్రనాథ్ రెడ్డి, శ్రీనివాసులు, మేయర్ సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డిలు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన వీరు.. రేవంత్ రెడ్డి వ్యవహారంపై చంద్రబాబు అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు డబ్బులు ఎరవేసిన కేసులో చంద్రబాబు ప్రమేయం లేకపోతే రేవంత్ ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. మైకు దొరికితే నీతినిజాయితీకి తానే మారు పేరని చంద్రబాబు చెప్పుకుంటారని.. కానీ అవినీతికి బట్టలిప్పితే ఆయన కనిపిస్తారని వైఎస్సార్ సీపీ నేతలు ఎద్దేవా చేశారు. ఈనెల 7వ తేదీన కడప ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం శోఛనీయమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే కడప ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.