ఎన్నికల ఫలితాలపై 4 నుంచి పార్టీ సమీక్షలు

హైదరాబాద్:

జూన్ 4, 5, 6 తేదీల్లో‌ రాజమండ్రిలో వరుసగా ఐదు జిల్లాల పరిధిలోని 10 లోక్‌సభా నియోజకవర్గాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమీక్షలు జరుగుతాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లోని లోక్‌సభా నియోజకవర్గాల్లో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు, ఓటములపై చర్చిస్తారని ఆయన వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల సమీక్షా సమావేశాల వివరాలను వెల్లడించారు.

ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన, ఓడిన అభ్యర్థులు, జిల్లాలోని ముఖ్య నేతలు, జెడ్‌పీటీసీకి పోటీచేసిన వారిని కూడా సమీక్షలకు ఆహ్వానిస్తున్నట్లు నెహ్రూ తెలిపారు. పోటీచేసిన అభ్యర్థులు తమ గెలుపు, ఓటములకు గల కారణాలపై నివేదికలు సిద్ధం చేసుకుని రావాలని సూచించినట్లు చెప్పారు.

పోలవరం ఆర్డినెన్సుపై వివాదం సరికాదు :
పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్సు వల్ల ఎవరికీ నష్టం లేదని.. దీనిని వివాదం చేయడం తగదని జ్యోతుల నెహ్రూ ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రాజెక్టు ఒక రాష్ట్రంలోనూ, ముంపునకు గురయ్యే భూభాగం మరో రాష్ట్రంలోనూ ఉండటం తగదనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లాలోని కొంత భాగాన్ని ఆంధ్రకు కలుపుతూ ఆర్డినెన్సు జారీ అయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టకపోయినా గోదావరి నదీ ప్రవాహంలో ఎపుడూ ఈ ప్రాంతంలోని చాలా గ్రామాలు మునకకు గురవుతూ ఉంటాయనే విషయం గమనించాలన్నారు. ముంపునకు గురయ్యే భూభాగం వేరే రాష్ట్రంలో ఉంటే ఆలమట్టి ప్రాజెక్టు విషయంలో ఉత్పన్నమైన పరిస్థితే తలెత్తుతుందన్నారు.

ప్రాజెక్టు వల్ల భద్రాచలం రామాలయం కూడా ముంపునకు గురికాదని, ఆ మాటకొస్తే భద్రాచలం గతంలో ఆంధ్రాదే కదా అని జ్యోతుల వ్యాఖ్యానించారు. సుహృద్భావ వాతావరణంలో విడిపోయేటపుడు ఇలాంటి వివాదాలు సరికాదన్నారు.

Back to Top