గిరిజన సలహా సంఘం ఏర్పాటుచేయకపోవడం దురదృష్టకరం

హైదరాబాద్ః  టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గ‌డుస్తున్నా, ఇప్ప‌టి వ‌ర‌కు గిరిజ‌న స‌ల‌హా సంఘం ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు . గిరిజ‌నుల అభివృద్ధికి పాటుప‌డుత‌ున్నామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు.... ఆ మాట‌ల‌ను ఆచ‌ర‌ణ‌లోకి తీసుకురావ‌డం లేద‌న్నారు. గిరిజన సలహా సంఘం అన్నది షెడ్యూల్ 5 ప్రకారం రాజ్యాంగ హక్కు అని వైఎస్ జగన్ సభలో ఎలుగెత్తారు.  రాష్ట్రంలో ఏడు గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాలుండ‌గా, అందులో ఆరు చోట్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గెలిచినందువ‌ల్లే ట్రైబ్స్ అడ్వ‌యిజ‌రీ క‌మిటీని ఏర్పాటు చేయ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఆ ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి ఓట్లు వేసిన వారు సైతం కొంద‌రు ఉన్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. గిరిజ‌నుల‌కు సంబంధించి ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకోవాల‌న్నా గిరిజ‌న స‌ల‌హా సంఘం త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై టీడీపీ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హరిస్తుంద‌ని విమర్శించారు.  ప్ర‌భుత్వం అన్ని జిల్లాల‌ను, వ‌ర్గాల‌ను స‌మానంగా చూడడం లేదని ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ జగన్ టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు. 

 దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు  బాదుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంపై మండిపడ్డారు.  పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఆ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశమని, ప్రజలపై దీనివల్ల తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. అందువల్ల ఈ అంశంపై చర్చించాల్సిందేనని, అవసరమైతే దీనికోసం జీరో అవర్‌ను రద్దు చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలుపై 31 శాతం ప్లస్ నాలుగు రూపాయలు, డీజిల్‌పై 22.1 శాతం ప్లస్ నాలుగు రూపాయల వ్యాట్ విధిస్తున్నారని ఆయన చెప్పారు. ఆ డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వానికే వెళ్తోందని గుర్తు చేశారు. సర్కారు తీరువల్లే ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఐతే, చర్చకు ప్రభుత్వం తోకముడిచింది. తమ డొల్లతనం ఎక్కడ బయటపడుతుందోనని మైక్ కట్ చేసింది. 

తాజా వీడియోలు

Back to Top