జలీల్ ఖాన్ నమ్మకద్రోహి

విజయవాడః టిక్కెట్ ఇచ్చిన పార్టీని, ఓట్లు వేసిన ప్రజలను, కష్టపడి గెలిపించిన కార్యకర్తలకు ద్రోహం చేసి .....టీడీపీకి అమ్ముడుపోయిన నమ్మకద్రోహి జలీల్‌ఖాన్ అని  వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు.  జలీల్‌ఖాన్ పోవడం వల్ల పార్టీకి గ్రహణం వీడిందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకుల సమావేశం వన్‌టౌన్‌లోని మాఇల్లు ఫంక్షన్ హాల్‌ జరిగింది. 

నగర పాలక సంస్థ పార్టీ ఫ్లోర్‌లీడర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ టిక్కెట్ ఇచ్చి గెలిపించిన పార్టీని, కార్యకర్తలను మోసం చేసి జలీల్‌ఖాన్ తెలుగుదేశంలో చేరటం దుర్మార్గమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామా దేవరాజు మాట్లాడుతూ పార్టీ శ్రేణులందరూ కష్టపడి జలీల్‌ఖాన్‌ను గెలిపిం చుకుంటే ఈ విధమైన వెన్నుపోటు పోడవటం దారుణమన్నారు.  కాగా 6న జరిగే నియోజకవర్గ సమావేశాన్ని జయప్రదంచేయాలన్నారు.


జలీల్‌ఖాన్ వైఎస్సార్ సీపీ నాయకుల రక్తాన్ని పీల్చిపిప్పి చేసి గెలిచారని 50వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ అన్నారు. కేవలం తనకు ముడుపు లు ఇచ్చే వారిని పక్కన పెట్టుకొని మంతనాలు చేశారే తప్ప కార్యకర్తలకు ఎప్పు డూ అండగా లేరన్నారు. జలీల్ వెళ్లిపోవడంతో పార్టీ మరింత పటిష్టమైందన్నారు.     

జలీల్‌ఖాన్ పార్టీలో ఉండి ఇక్కడి ప్రజలకు కానీ, కార్యకర్తలకు గానీ చేసిందేమి లేదని 40వ డివిజన్ కార్పొరేటర్ ఆసీఫ్ అన్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా తనకు ఓట్లు వేసిన ప్రజలకు ఏమి చేయలేదని జలీల్‌ఖానే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. అలాగే పార్టీని వీడిపోయిన ఆయన గురించి మాట్లాడటం వృథా అని పేర్కొన్నారు.
 
Back to Top