హైదరాబాద్, 1 జూన్ 2014:
తెలంగాణ 10 జిల్లాల్లోనూ సోమవారంనాడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ అడ్హాక్ కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాన కార్యక్రమం జరుగుతుందని పార్టీ అడ్హాక్ కమిటీ సభ్యుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన తెలంగాణ పార్టీ అడ్హాక్ కమిటీ సమావేశం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అడ్హాక్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నవ తెలంగాణ నిర్మాణంలో, అభివృద్ధిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కూడా తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాతుందని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సోమవారం జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో వైయస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొనాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తున్నారని పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర డీజీపీగా ఉన్న బయ్యారపు ప్రసాదరావును ఆ పదవి నుంచి తప్పించి జేవీ రాముడును అందలం ఎక్కించడమే దీనికి తాజా తార్కాణం అని ఆగ్రహం వ్యక్తంచేశారు.