వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బం‌ద్ విజయవంతం

అనంతపురం :

రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా అనంతపురములో సమైక్య ఉద్యమం మిన్నంటింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపునకు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు, వివిధ ప్రజా సంఘాలు స్పందించాయి. జిల్లా వ్యాప్తంగా‌ శుక్రవారం విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. సమైక్య వాదులు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. సోనియా గాంధీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేశారు. పార్టీ కార్యాలయాల వద్ద కంచెలు వేశారు. ఆర్ట్సు కళాశాల హాస్టల్ విద్యార్థులు బయటకు రాకుండా కట్టడి చేశారు. హాస్ట‌ల్ నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేయడంతో కొందరు విద్యార్థులు ససేమిరా అన్నారు. దీంతో పలువురిని బలవంతంగా పంపించేశారు.

అనంతపురంలో వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచి బం‌ద్ పాటించారు. ర్యాలీ నిర్వహించి సప్తగిరి సర్కి‌ల్‌లో మానవహారంగా ఏర్పడి యూపీఏ దిష్టిబొమ్మను దహనం చేశారు. మధ్యాహ్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. విభజన నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరే‌ట్‌లో ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు ఓపీ సేవలను బహిష్కరించి నిరసన తెలిపారు. వైద్య ఆరోగ్య జేఏసీ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట మానవహారంగా ఏర్పడ్డారు. ఎస్‌యూసీఐ, యువ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు.

రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. రాజకీయ జేఏసీ, ఆర్టీసీ, ఏపీ ఎ‌న్‌జీఓలు మద్దతు తెలిపారు. ధర్మవరం, గుంతకల్లు, గుత్తిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ నేతలు బై‌క్ ర్యాలీ నిర్వహించారు. పామిడిలో రాస్తారోకో చేశారు. కదిరిలో పార్టీ సమన్వయకర్తలు ఇస్మాయిల్, షాకీర్.. కళ్యాణదుర్గంలో తిప్పేస్వామి.. పెనుకొండలో మంగమ్మ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది.‌ శనివారం కూడా బంద్ కొనసాగించాలని ‌పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులు, సమైక్యవాదులకు పిలుపుతో రెండవ రోజునా బంద్‌ కొనసాగుతోంది.

Back to Top