ఆదివారం వైయస్ఆర్‌సీపీ రెండవ ప్లీనరీ

హైదరాబాద్ :

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రెండవ ప్లీనరీ (ప్రజాప్రస్థానం) ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం వైయస్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో జరుగుతుంది. ఈ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఇతర సంస్థాగత కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. శనివారం పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సమావేశమై అధ్యక్ష ఎన్నికలకు కావాల్సిన షెడ్యూలును ప్రకటించి దానిపై రెండవ తేదీన ఫలితాలు ప్రకటించడంతో పాటు ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఉమ్మారెడ్డి చెప్పారు.

ప్లీనరీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశంలో రెండేళ్లుగా పార్టీ చేసిన వివిధ కార్యక్రమాలతో  పాటు సమైక్యాంధ్రప్రదేశ్ కోసం‌ పార్టీ చేసిన కృషిపై ఒక నివేదిక ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.

ప్లీనరీ వివరాలివీ :
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డికి, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి మృతి చెందిన నేతలకు‌ ప్లీనరీలో ముందుగా సంతాపం తెలియజేస్తారు. ఆ తర్వాత పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ప్రారంభోపన్యాసం చేస్తారు.
అనంతరం రైతు శ్రేయస్సు కోసం దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని, ఆర్థిక తదితర అంశాలపై పలు తీర్మానాలను ప్రవేశపెడతారు.
మరో‌ ప్రజాప్రస్థానం ద్వారా సుదీర్ఘ పాదయాత్ర చేసిన శ్రీమతి షర్మిల ప్రసంగం సమావేశం మధ్యలో ఉంటుంది. ఆ తరువాత జిల్లాల్లో కొత్తగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఆమోదిస్తారు. ప్లీనరీ ముగింపు సందర్భంగా పార్టీ కొత్త అధ్యక్షుని సందేశం ఉంటుంది.

ఎన్నిక క్రమం ఇలా ఉంటుంది :
ఫిబ్రవరి 1 శనివారం మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకు సీజీసీ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. 3 నుంచి 4 గంటల వరకు అధ్యక్ష పదవికి నామినేషన్లను స్వీకరిస్తారు. 4 నుంచి 4.30 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 5 గంటలకు ఆమోదిత నామినేషన్ల పేర్లను ప్రకటిస్తారు.
ఫిబ్రవరి 2 ఆదివారం ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. 11.30 నుంచి 12.30 వరకు ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారు.

Back to Top