అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేల ధర్నా భగ్నం

హైదరాబాద్:

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని, రూల్ 77 కింద తా‌ము ఇచ్చిన నోటీసుపై స్పష్టత ఇవ్వాలని, చర్చకు గడువు పొడిగించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీ సభా‌ మందిరంలో చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ప్రారంభమైన వారి ధర్నా సుమారు 7 గంటల పాటు కినసాగింది. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ముగిసింది.

బుధవారం మధ్యాహ్నం మూడవసారి డిప్యూటీ స్పీకర్ సభను‌ గురువారానికి వాయిదా వే‌శారు. దీనితో ఓటింగ్ విషయంలో స్పష్టత కావాలని, తాము ఇచ్చిన నోటీసును చర్చకు చేపట్టాలని కోరుతూ పార్టీ ఎమ్మెల్యేలు పోడియం వద్ద నిరసనకు దిగారు. వైయస్ఆర్‌సీఎల్పీ నాయకురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నేతృత్వంలో మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్, భూమా శోభా నాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, తెల్లం బాలరాజు, గొల్ల బాబూరావు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కె.చెన్నకేశవరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రె‌డ్డి, మోపిదేవి వెంకటరమణారావు, సి.ఆదినారాయణరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పినిపె విశ్వరూప్, రాజన్నదొర, కాటసాని రామిరెడ్డి తదితరులు నిరసనలో పాల్గొన్నారు.

ధర్నాను విరమించాలని శాసనసభ కార్యదర్శి రాజా సదారాం చేసిన విజ్ఞప్తిని వైయస్ఆర్‌సీపీ సభ్యులు మన్నించకపోవడంతో.. స్పీకర్‌ అనుమతితో పోలీసులు రంగప్రవేశం చేసి మార్షల్సు ససహాయంతో వారందరినీ బయటకు తీసుకొచ్చి వాహనాల్లో పార్టీ కార్యాలయానికి తరలించారు.

Back to Top