సెక్రటేరియట్‌ తరలింపును అడ్డుకుంటాం

  • కేసీఆర్‌ తెలివితక్కువతనంతో ప్రజాధనం దుర్వినియోగం
  • సచివాలయం తరలింపును నిరసిస్తూ 16న వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్‌
హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలివితక్కువ ఆలోచనతో తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మిగిలిపోతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్‌ విమర్శించారు. మూడనమ్మకాలతో కేసీఆర్‌ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. సెక్రటేరియట్‌ తరలించాలన్న దురాలోచనలను మానుకోవాలని హెచ్చరించారు. సెక్రటేరియట్‌ తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన బైసన్‌పోల్‌ గ్రౌండ్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శివకుమార్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన తరువాత రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా రాజధానిలో భవనాలు పంచడం జరిగిందన్నారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఉమ్మడి రాజధానిని వదిలి అమరావతికి పారిపోయారన్నారు. ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఖాళీ ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాల్సిన కేసీఆర్‌ వందల కోట్లు వెచ్చించి కొత్త నిర్మాణాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. భవనాలకు వెచ్చించే నిధులు ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని సూచించారు. 

కేసీఆర్‌ విలాసాలకు అలవాటుపడ్డారు..
విలాస జీవితానికి అలవాటుపడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏదైనా తన ఫాంహౌస్‌లా ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నారని శివకుమార్‌ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ కొత్త కొత్త నిర్ణయాలకు ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారన్నారు. 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన సచివాలయాన్ని కూల్చివేయడాన్ని వైయస్‌ఆర్‌ సీపీ వ్యతిరేకిస్తుందన్నారు. ప్రభుత్వం సెక్రటేరియట్‌ తరలింపు నిర్ణయాన్ని విరమించుకొని, మ్యానిఫెస్టోలో పెట్టిన వాగ్ధానాల అమలు దిశగా పనిచేయాలని సూచించారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఫీజు రియంబర్స్‌మెంట్‌ వంటి పథకాలు అమలు చేయాలని కోరారు. ఒకసారి ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శిస్తే పరిస్థితులు తెలుస్తాయని, విష జ్వరాలతో ప్రజలు, ఆఖరికి ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులు కూడా మృత్యువాత పడుతున్నారన్నారు.

ధర్నాను విజయవంతం చేయాలి
16న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ధర్నాకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అఖిలపక్ష నేతలు, జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా పాల్గొంటారని శివకుమార్‌ స్పష్టం చేశారు. ధర్నాతో ప్రభుత్వ వైఖరి మారకపోతే సెక్రటేరియట్‌ ముట్టిడికి దిగుతామని హెచ్చరించారు. పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. 
Back to Top