జ‌ల ప్ర‌దాత వైయ‌స్సార్

హైదరాబాద్: ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎన్నెన్నో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు ఆద్యుడిగా నిలిచారు. నీటిని తెలంగాణ ప్రాంతంలో పారించి జ‌ల ప్ర‌దాత అనిపించుకొన్నారు. అన్ని ప్రాంతాల్ని స‌మ‌దృష్టితో చూసిన మ‌హానుభావుడు ఆయ‌న‌. 

  జలయజ్ఞంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి (25 టీఎంసీలు), భీమా (20 టీఎంసీలు), నెట్టెంపాడు (20 టీఎంసీలు) ప్రాజెక్టులను ఆయన హయాంలో చేపట్టారు. 7.8 లక్షల ఎకరాల ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే లక్ష్యంతో రూ.7,969.38 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటితోపాటు 3.9 టీఎంసీల సామర్థ్యంతో 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా కోయల్‌సాగర్ ప్రాజెక్టును చేపట్టారు. నిర్మాణం వేగంగా జరగాలన్న ఉద్దేశంతో భారీగా నిధులు ఇవ్వడంతో శరవేగంగా ఆ ప్రాజెక్టుల పనులు జరిగాయి. సుమారు రూ.5 వేల కోట్లు వైఎస్ హయాంలోనే ఖర్చు చేశారు. వైఎస్ మరణానంతరం కొన్ని అవాంతరాలు వచ్చినా... ప్రస్తుత ఏడాదిలో ఆ పనులన్నీ కొలిక్కి వచ్చాయి. 
ఈ ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు సుమారు 1.5 లక్షల ఎకరాలు వృద్ధిలోకి రాగా.. ఈ ఏడాది పాత ఆయకట్టు కలుపుకొని 4.6 లక్షల ఎకరాలకు నీరందనుంది. ప్రస్తుతం కృష్ణా నుంచి జూరాలను చేరుతున్న వరద మరికొంత కాలం కొనసాగితే నెట్టెంపాడు కింద 1.5 లక్షల ఎకరాలు, కోయల్‌సాగర్ కింద 20 వేల ఎకరాలు, భీమా కింద 1.40 లక్షల ఎకరాలకు నీరందనుండగా... కృష్ణా నీరు శ్రీశైలాన్ని చేరితే కల్వకుర్తి కింద 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరందనుంది. ఇన్నాళ్లూ బీడుగా ఉన్న భూములకు వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులతో జలాభిషేకం జరుగుతోంది.

కృష్ణాన‌దిలో నీళ్లు పొంగుతుండ‌టంతో ప్ర‌జ‌లంతా వైయ‌స్సార్ సేవ‌ల్ని స్మ‌రించుకొంటున్నారు.
Back to Top