వైయస్‌ జగన్‌ వ్యాఖ్యల్లో తప్పేముంది? బొత్స సత్యనారాయణ

తూర్పుగోదావరి: నియంతృత్వ పోకడలకు పోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై నంద్యాల సభలో వైయస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సమర్ధించారు. వైయస్‌ జగన్‌ ప్రజల బాధను వ్యక్త పరిచారని, బాబుపై ఆయన చేసిన వ్యాఖ్యల్లోని భావం ముఖ్యమని పేర్కొన్నారు. సోమవారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలిశారు. ఈ మేరకు ఆయన తలపెట్టిన పాదయాత్రకు వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, కన్నబాబు, సునీల్‌ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజమండ్రిలో చంద్రబాబు కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి వంచించారన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో  చంద్రబాబు గొప్ప కోసం 29 మంది అమాయకులు ప్రాణాలను బలిగొన్నారని మండిపడ్డారు. ఆ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా ప్రజలు మరిచిపోయారనుకుంటున్నారా? రాష్ట్ర ప్రజలకు గుర్తుందన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం వేసిన విచారణలో ఏం తేలిందని నిలదీశారు. చంద్రబాబు ఇంటింటికి తిరిగి కాపులను బీసీ జాబితాలో చేర్చుతామన్నారని గుర్తు చేశారు.  సీఎం చెప్పిన మాటకు కాపులు ఊరుకుంటారా? మీరిచ్చిన హామీ కోసం ముద్రగడ పాదయాత్ర చేస్తామంటే ఇంటికో పోలీసును పెట్టి ఉద్యమాన్ని అణచివేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మానాభం పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమన్నారు.  

Back to Top