రేఖపల్లి: ఉభయగోదావరి జిల్లాల్లో ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ పర్యటన ఖరారైంది. విలీన మండలాల్లో జూలై 1, 2 తేదీల్లో పర్యటించనున్నారని పార్టీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. జూలై 1వ తేదీన జగన్మోహన్రెడ్డి ముందుగా పశ్చిమగోదావరి జిల్లాలోని విలీన మండలాల్లో పర్యటిస్తారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆయన ప్రజలతో సమావేశం అవుతారు. ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి భద్రాచలం చేరుకొంటారు. జూలై 2న ఎటపాక మండలం మీదుగా కూనవరం చేరుకొని అక్కడి నుంచి రేఖపల్లిలో నిర్వాసిత రైతులతో మాట్లాడనున్నారని చెప్పారు. అనంతరం రేఖపల్లి చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారని రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల మీద ఎమ్మెల్యే రాజేశ్వరి వీఆర్పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల్లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.