ప్ర‌భుత్వ తీరు కు నిర‌స‌నగా వాకౌట్‌

హైద‌రాబాద్‌) ఎన్నిక‌ల ముందు అబ‌ద్దాలు చెప్పి, రుణ‌మాఫీ చేయ‌కుండా త‌ప్పించుకొంటూ రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం అవుతున్న ప్ర‌భుత్వ తీరుని నిర‌సిస్తూ వాకౌట్ చేస్తున్న‌ట్లు ప్ర‌తిప‌క్ష నేత వై ఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో రైతు రుణ‌మాఫీ మీద ప్ర‌తిప‌క్ష‌స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వ్య‌వ‌సాయ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేదు. దీని మీద ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మాట్లాడారు.
మంత్రి మాట‌లు వింటే ఆశ్చ‌ర్యం క‌లుగుతోందని ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ అన్నారు. ఇటువంటి ప్ర‌భుత్వాన్ని దేశంలో ఎక్క‌డా చూడ‌లేద‌న్నారు. రుణ‌మాఫీ చేస్తాన‌ని ప‌దే ప‌దే ప్ర‌భుత్వం చెప్పింద‌న్నారు. ఎన్నిక‌ల వేళ రైతుల‌తో ఓట్లు వేయించుకొనేందుకు ఇదే ప్ర‌చారం చేశార‌న్నారు. బ్యాంకులో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్య‌మంత్రి కావాలి, రైతుల రుణాల‌న్నీ బేష‌ర‌తుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్య‌మంత్రి కావాలి, ఏ టీవీ ఆన్ చేసినా ఇదే మాట వ‌చ్చేది..గ్రామాల్లో గోడ‌ల‌న్నీ ఇవే రాత‌లు కనిపించేవ‌ని వైఎస్ జ‌గ‌న్ వివ‌రించారు. 
చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యేస‌రికి రాష్ట్రంలో రూ. 87, 612 కోట్ల రూపాయిల వ్య‌వ‌సాయం రుణాలు ఉండేవ‌న్నారు. టీడీపీ నాయ‌కులు ప‌దే ప‌దే చెప్పిన మాటలు విని రైతులు అప్పులు తిరిగి క‌ట్ట‌లేద‌న్నారు. అప్ప‌టి దాకా రూ. ల‌క్ష లోపు రుణాల‌కు వ‌డ్డీ లేకుండా, రూ. ల‌క్ష నుంచి రూ. 3 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌కు పావ‌లా వ‌డ్డీకే రుణాలు వ‌చ్చేవి. అయితే చంద్ర‌బాబు క‌ట్ట‌వ‌ద్ద‌న్నందుకు గాను రైతులు అప్పులు తీర్చ‌టం మానేశారు. దీంతో రైతుల‌కు అప‌రాధ వ‌డ్డీ 14 నుంచి 18 శాతం ప‌డుతోంది. దీంతో రూ. 87, 612 కోట్ల కు గాను, వ‌డ్డీ దాదాపు రూ. 24,000 కోట్ల రూపాయిలు తేలింది. ఇందులో చంద్ర‌బాబు రెండు విడ‌త‌లుగా చేసిన రుణ‌మాఫీ రూ. 7,300 కోట్లు మాత్ర‌మే. అంటే వ‌డ్డీలో మూడోవంతు డ‌బ్బులు ఇచ్చి రుణ‌మాఫీ చేశాం అంటే ఎలా అని వైఎస్ జ‌గ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు. బాబు బావ‌కే రుణ‌మాఫీ లేదు అంటూ ప‌త్రిక‌ల్లో వచ్చిన వార్త‌ల్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. మిమ్మ‌ల్ని న‌మ్మి ఓట్లేశాం, పూర్తిగా మోస‌పోయాం అంటూ చంద్రబాబు బావ చెప్పిన మాటల్ని ఉద‌హ‌రించారు.
ఈ స‌మయంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ అడ్డు త‌గిలారు. మాట్లాడ‌నివ్వ‌నంటూ సంకేతాలు పంపారు. దీనిపై విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అభ్యంత‌రం తెలిపారు. తాము వాకౌట్ చేయ‌ద‌లిచామ‌ని, అందుకు కార‌ణం చెప్పే అవ‌కాశం ఇవ్వాల‌ని వైఎస్ జ‌గ‌న్ అడిగారు. క‌నీసం ఆ కార‌ణం మీకైనా తెలియాలి క‌దా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల ముందు అబ‌ద్దాలు చెప్పి, రుణ‌మాఫీ చేయ‌కుండా త‌ప్పించుకొంటూ రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం అవుతున్న ప్ర‌భుత్వ తీరుని నిర‌సిస్తూ వాకౌట్ చేస్తున్న‌ట్లు ప్ర‌తిప‌క్ష నేత వై ఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో వైఎస్సార్సీపీ స‌భ్యులంతా వాకౌట్ చేశారు. 
Back to Top