మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌



– మత్స్యకారులకు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
– అబద్ధాలు చెప్పేవారు, మోసాలు చేసేవారు మీకు కావాలా?
– బాబుకు ఫోటోలకు ఫోజులివ్వడం బాగా తెలుసు
– ప్రభుత్వ స్కూళ్లలో బుక్స్, యూనిఫాం ఇప్పటికీ ఇవ్వలేదు
– ఎంఎస్‌ఎన్‌ ట్రస్ట్‌ భూములు టీడీపీ నేతలు దోచుకుంటున్నారు
– నవరత్నాలు పేదింటి గడపకు వెళ్లాలి
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని టీడీపీ నీరుగార్చింది
– నవరత్నాలతో పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలి అనుకుంటున్నాం
– నాన్నగారి కంటే రెండు అడుగులు ముందుకు వేస్తాను
– ఎన్ని లక్షలు ఖర్చు అయినా భరిస్తాం
– మెస్, బోర్డింగ్‌ చార్జీల కింద ఏడాదికి రూ.20 వేలు
– పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు అమ్మ ఒడి కింద ఇస్తాం
– పేరుకే ఆరోగ్యశ్రీ ఉంది
– ఆరోగ్యం కోసం అప్పులపాలు కాకుండా చూస్తాం
– దీర్ఘకాలిక రోగులకు నెలకు రూ.10 వేల పింఛన్‌
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 45 ఏళ్లకే పింఛన్‌ 
– ఫిషింగ్‌ హాలీడే సమయంలో ప్రతి ఇంటికి రూ.10 వేలు ఇస్తాం
– మత్స్యకారులు ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.10 లక్షలు పరిహారం

తూర్పు గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలు ఇస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు.  ప్రజా సంకల్ప యాత్ర 217వ రోజు కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని అచ్చంపేట జంక్షన్‌లో ఏర్పాటు చేసిన మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళంలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

ఈ రోజు కాకినాడ రూరల్‌ పరిధిలో మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకు ముందు చాలా మంది నాయకులు మాట్లాడారు. అందరూ కూడా మత్స్యకార నాయకులే. వారు క్లుప్తంగా చెప్పారు. మీ అందరూ కూడా చంద్రబాబు పరిపాలన చూస్తున్నారు. మరో ఆరునెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయని తెలిసిన నేపథ్యంలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి.
– చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలు నెరవేర్చారా లేదా ? అన్నది ఆలోచించాలి. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. మీకు ఎలాంటి నాయకుడు కావాలి? అబద్ధాలు చెప్పేవారు మీకు నాయకులు కావాలా? మోసాలు చేసేవారు మీకు నాయకులు కావాలా? నాలుగున్నర సంవత్సరాలుగా చంద్రబాబు పాలనలో మనం చూసింది ఏందని అడుగుతున్నాను. ఎన్నికలకు ముందు చక్కని ఫోటో పెట్టుకొని , పెళ్లికొడుకుగా తయారై ఒక్కో పేజీ ఒక్కో కులానికి తన మేనిఫెస్టోలో కేటాయించి ఇలాంటి ఫోటోలు పెడతారు. ఆయన రాసుకున్న మాటలే చెబుతున్నాను.
– చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు 50 శాతం సబ్సిడీపై డీజిల్‌ ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా డీజిల్‌ సబ్సిడీపై పెంచలేదు. ఎన్నికలు ఆరు నెలల్లో ఉన్నాయంటే చంద్రబాబుకు మత్స్యకారులు గుర్తుకు వస్తాయి. డీజిల్‌ సబ్సిడీని వెంటనే పెంచబోతున్నారని వార్తలు వస్తాయి. కారణం ఏంటంటే జగన్‌ అనే వ్యక్తి మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ పెంచుతానని చెప్పిన తరువాత చంద్రబాబు నక్క బుద్ధి చూపించారు. 
– మత్స్యకారుల పిల్లలకు రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. కొత్త స్కూళ్ల కథ దేవుడెరుగు ..ఉన్న స్కూళ్లను మూత వేస్తున్నారు. ఇదే పెద్ద మనిషి కేజీ నుంచి పీజీ వరకు పిల్లలను ఉచితంగా చదివిస్తా అన్నారు. ఇవాళ మన పిల్లలను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా చదివించే పరిస్థితిలో ఉన్నామా? చంద్రబాబు పుణ్యనా రాష్ట్ర స్కూల్‌ మూత వేస్తున్నారు. గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంతవరకు పుస్తకాలు ఇవ్వలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంతవరకు యూనిఫాం ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. కారణం ఏంటో తెలుసా? ఈ పిల్లలు గవర్నమెంట్‌ స్కూళ్లకు వెళ్లడం మాన్పించాలి. జూలై చివరికి వచ్చినా పుస్తకాలు ఇవ్వకపోతే పిల్లలకు చదువు రాదని భావించి తల్లిదండ్రులు కష్టమైనా సరే తమ పిల్లలను నారాయణ, చైతన్య స్కూళ్లకు పంపిస్తారు. ఈ స్కూళ్లు చంద్రబాబు బినామీ నారాయణ స్కూళ్లు. ఇంతదారుణంగా పరిపాలన చూస్తున్నాం.
– చంద్రబాబు అధికారంలోకి రాకముందు నెల నెల మత్స్యకారులకు ఫిషింగ్‌ హాలీడే సమయంలో రెండు నెలల పాటు రూ.4 వేలు ఇచ్చేది పెంచుతామని ఎన్నికలకు ముందు చెప్పారు. రూ.4 వేలు కూడా నూటికి పది మందికి మించి రావడం లేదు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు ఏమంటారు? 
– మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్కరికైనా అందాయా? ఎన్నికలు ఆరు నెలలు ఉన్నాయంటే చంద్రబాబు ఏమంటారు. వెంటనే ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాల్లో మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తున్నారని వార్తలు రాస్తున్నారు. జీవో వచ్చినా..పింఛన్‌ అందడం లేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందు డ్రామాలు ఎంత కసిగా రక్తికట్టిస్తారన్నది ఇది ఓ ఉదాహారణ
– ముమ్మిడివరం నియోజకవర్గంలో పాదయాత్ర చేసే సమయంలో అక్కడ గుజరాత్‌ పెట్రోల్‌ కంపెనీ ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌ను పరిశీలించాను. మత్స్యకారుల కుటుంబాలకు డబ్బులు ఇస్తామది ఆ కంపెనీ చెప్పారు. వీళ్ల ఖర్మ ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. రూ.130 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెబుతున్నారు.
– చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేశారు. ఈయన వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. కానీ మత్స్యకార సోదరులకు హక్కుగా రావాల్సిన బకాయిలు నాలుగున్నరేళ్లు అయినా కూడా రూపాయి కూడా ఇప్పించలేకపోయారు.
– ఇక్కడికి వచ్చేసరికి మత్స్యకారులు నాతో చెప్పుతున్నారు. మల్లాడి సత్యలింగనాయక ట్రస్ట్‌ పెట్టి మత్స్యకారులకు మేలు చేసేందుకు ట్రస్ట్‌ పెట్టారు. ఆ ట్రస్టుకు చెందిన 1500 ఎకరాల భూములను టీడీపీ నేతలు గద్దళ్లా దోచేస్తున్నారు. ఎకరాకు రూ.16 కౌలు చెల్లిస్తూ ఆ భూములు అనుభవిస్తున్నారు. ఆ భూములు మత్స్యకారులకే ఇస్తే వారు  బాగుపడరా? ఆ ట్రస్టుకు డబ్బులు ఇచ్చి మేలు చేయాల్సింది పోయి..టీడీపీ నేతలే గద్దళ్లా దోచుకుంటున్నారు.
– ఇలాంటి అన్యాయమైన పాలన పోయి..రేపు పొద్దున మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేయాలన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి పేదవారి ముఖంలో చిరునవ్వులు చూడాలని ఆరాటపడుతున్నాను. ఆ నవరత్నాలు పేదలకు అందితే జీవితంపై ఆశ పుడుతుంది. మత్స్యకారులకు ఇచ్చిన హమీలను గుర్తు చేస్తాను. ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందని మీరు సలహా ఇస్తే స్వీకరిస్తాను.
– ప్రతి పేదవాడికి చదువుల గురించి నవరత్నాల్లో నుంచి చెబుతాను. మనం పేదరికం నుంచి బయటకు రావాలంటే అది ఎలా సాధ్యమన్నది ఓ ప్రశ్న. నాన్నగారు ఎప్పుడు అంటుండే వారు. పేదరికం నుంచి బయటకు రావాలంటే ఆ కుటుంబం నుంచి పెద్ద పెద్ద చదువులు చదివితేనే ఇది సాధ్యం. నాన్నగారి హయాంలో పెద్ద పెద్ద చదువులు చదివేందుకు ఓ భరోసా ఉండేది. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా ఫర్వాలేదు..నేను భరిస్తా అనే వారు. నాన్నగారు చనిపోయాక పరిస్థితి తారుమారైంది. ఇవాళ ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. ఇంజినీరింగ్‌ ఫీజులకు చంద్రబాబు హయాంలో రెక్కలొస్తున్నాయి.  ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తీసుకువస్తారు. 
– నాన్నగారు పేదవాడి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తారని ఇంతకు ముందే చెప్పాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చైనా నేను చదివిస్తాను. అంతేకాదు హాస్టల్‌లో ఉండి చదివేందుకు అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి పిల్లాడికి ప్రతి ఏటా రూ.20 వేలు హాస్టల్‌ ఖర్చుల కింద చెల్లిస్తాం. దీని వల్ల ఏ తల్లిదండ్రులు కూడా అప్పులపాలు అయ్యే పరిస్థితి రాదు.
– మన పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు కావాలన్నా పునాదులు గట్టిగా ఉండాలి. ఆ పునాదులు ఈ చిట్టి పిల్లల నుంచి మొదలవుతాయి. ఆ చిట్టి పిల్లలు బడి బాట పట్టాలి. వారు బడికి వెళ్లి పునాదులు గట్టిగా పడితే మన బతుకులు మారుతాయి. ఆ పిల్లలను బడికి పంపిస్తే చాలు ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అమ్మ ఒడి కింద అందజేస్తాను.
– ఆరోగ్యశ్రీలో మార్పులు తీసుకువస్తాం. ప్రతి పేదవాడికి తోడుగా ఉండే పరిస్థితి తీసుకువస్తాం. ఏ పేదవాడు కూడా తన ఆరోగ్యం బాగోలేక అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకుండా చేస్తాం. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత..మీరు ఆసుపత్రికి వెళ్తే..రూ.1000 దాటితే చాలు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయించి ఇంటికి పంపిస్తాం. అంతేకాదు..ఆపరేషన్‌ అయిపోయిన తరువాత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్‌ సూచిస్తే..ఆ సమయంలో ప్రభుత్వమే డబ్బులిచ్చి తోడుగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ప్రతి పేదవారికి నెలకు రూ.10 వేలు పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటాం.
– అవ్వతాతల పింఛన్‌ పెంచాలని చంద్రబాబుకు మనసు రాదు. కారణంగా చంద్రబాబుకు లంచాలు రావని, జన్మభూమి కమిటీల వద్దే ఆగిపోతాయి. అడగకపోయినా కాంట్రాక్టర్లకు పెంచుతారు. మనందరి ప్రభుత్వం వచ్చాక నెలకు రూ.2 వేలు పింఛన్‌ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటాం. 
– ఈ మధ్యకాలంలోనే మత్స్యకారులకు హామీ ఇచ్చాను. ఫిషింగ్‌ హాలీడే ఏప్రిల్‌ 15 నుంచి రెండు నెలల పాటు ఉంటుంది. చంద్రబాబు హయాంలో రూ.4 వేలు కూడా సరిగా ఇవ్వలేదు. ఫిషింగ్‌ హాలీడేలో రెండు నెలల పాటు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇస్తున్నాం. ఆ డబ్బు అక్కచెల్లెమ్మల చేతిలో ఆ డబ్బు పెడతాం. 
– ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటరీయట్‌ తీసుకువస్తాం. మీ గ్రామంలోనే చదువుకున్న పది మందికి ఉద్యోగం ఇస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు 72 గంటల్లో అందే విధంగా ఏర్పాటు చేస్తాం. పింఛన్లు, మరుగుదొడ్ల కోసం లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా చేస్తాం. 
– మత్స్యకారులకు ఇది కాక..డీజిల్‌ సబ్సిడీ చంద్రబాబు హయాంలో ఇవ్వడం లేదని, కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. ప్రతి ఒక్కరికీ డీజిల్‌ మీద ఇచ్చే సబ్సిడీ పెంచుతాం. డీజిల్‌ కొట్టేటప్పుడే ఆ డబ్బు అందేలా చూస్తాం. దాని కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పని లేదు. మీకు కార్డు ఇస్తాం. ఆ కార్డు చూపిస్తే పెట్రోలు, డీజిల్‌పై సబ్సిడీకే పోసే విధంగా ఏర్పాటు చేస్తాం.
– మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు ఇంటికి తిరిగి వస్తారో? లేదో అని భయంతో బతుకుతున్నారు. హై రిస్క్‌లో ఉన్న మత్స్యకారులకు చెబుతున్నాను. రేపు పొద్దున ఇటువంటి ఘటన జరుగకూడదని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి తోడుగా ఉంటాను. చంద్రన్న భీమా నుంచి ఇప్పుడు సక్రమంగా పరిహారం అందడం లేదు. మనం వచ్చిన తరువాత మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తాం. 
– ప్రతి మత్స్యకార సోదరుడు అడుగుతున్నారు. మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. ప్రతి మత్స్యకారుడికి తోడుగా ఉంటాం. ఇది కాక ఇంకా ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వండి. స్వీకరిస్తాం. 
– కాకినాడకు సంబంధించి డీప్‌వాటర్‌ పోర్టులో పనిచేస్తున్న కార్మికులు విధి నిర్వాహణలో చనిపోతే పరిహారం రావడం లేదు. వీళ్లకు కూడా రూ.10 లక్షలు పరిహారం ఇచ్చి తోడుగా ఉంటామని మాట ఇస్తున్నాం. పోర్టులో పని చేసేవారికి ఐడీ కార్డులు ఇచ్చి ఆదుకుంటాం.  




 
Back to Top