మేమొచ్చాక వీళ్లు తిన్నదంతా కక్కిస్తాం

  • ముఖ్యమంత్రే దగ్గరుండి భూ కబ్జాలు చేయిన్నాడు
  • సీఎం సహా మంత్రులు, అధికారులు అంతా కుమ్మక్కయ్యారు
  • లోకేష్, గంటా నీకింత, నాకింత అని పంచుకుంటున్నారు
  • పేదల భూములను గద్దల్లా తన్నుకుపోతున్నారు
  • సీబీఐ ఎంక్వైరీ జరిగితే బాబును తన్ని లోపలేస్తారు..?
  • అంగుళం కూడ పోకుండా పేదవాడి తరపున పోరాడతాం
  • వచ్చేది మన పాలన ఎవరూ అధైర్యపడొద్దు
  • మన ప్రభుత్వం వచ్చాక దోపిడీకి గురైన భూములన్నీ తిరిగి పంచుతాం
  • విశాఖ మహాధర్నాలో వైయస్ జగన్ ప్రసంగం
విశాఖపట్నంః టీడీపీ భూ కుంభకోణాలపై వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. బాబుకు విశాఖ ఎంతో ఇస్తే...చంద్రబాబు మాత్రం విశాఖకు స్కాములు, అవినీతి ఇచ్చారని దుయ్యబట్టారు. విశాఖను దోచుకునేందుకు పార్టీ నేతలకు, బంధువులకు బాబు పర్మీషన్ ఇచ్చాడని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, రెవెన్యూ అధికారులు అంతా మాఫియాగా తయారై పేదల భూములను గద్దల్లా తన్నుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల భూ కబ్జాలకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ ఎదుట చేపట్టిన మహాధర్నాలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.....

ఇక్కడి కలెక్టర్ ఈ మధ్యకాలంలో ఓ ప్రకటన చేశారు. జిల్లాలో 43 మండలాలున్నాయి. 2 లక్షల 45వేల 896 ఫీల్డ్ మేజర్ మెంట్ పుస్తకాలున్నాయి. 16, 375 సర్వే నంబర్లు కనబడడం లేదట.  వీటిలో లక్ష ఆరువేల 239 ఎకరాలకు సంబంధించిన సర్వే నంబర్లు కనిపించడం లేదట. పైగా కలెక్టర్ చెబుతున్నాడు. హుద్ హుద్ వచ్చినప్పుడు రికార్డులు పోయాయని చెబుతున్నాడు.  మూడేళ్ల తర్వాత ఇవాళ కలెక్టర్ కు రికార్డులు పోయాయని గుర్తొచ్చిందట. నిజంగా హుద్ హుద్ వచ్చినప్పుడు మనమంతా చూశాం. నీళ్లేమీ రాలేదు. గాలి ,  చిన్న వర్షం వచ్చి వెళ్లిపోయింది. కలెక్టర్ ల బిల్డింగ్ లు గాలికి ఎగిరిపోయినట్టు మనం ఎక్కడా చూడలేదు. అందరం విశాఖలోనే ఉన్నాం. ఇదే విశాఖలో హుద్ హుద్ జరిగినప్పుడు 11రోజుల పాటు ప్రతి ప్రాంతాన్ని నేను సందర్శించా. వీళ్లు చేసే అన్యాయమైన పని ఏమంటే రెవెన్యూ రికార్డులు మాయం చేయడం, వాళ్ల ఇష్టానుసారంగా మార్చేసుకోవడం. పేరేమో రికార్డులు పోయాయని చెప్పడం. ప్రభుత్వ భూములే దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 23,876 ఎకరాలు అక్రమాలకు గురయ్యాయని మీడియాలో కథనాలు వచ్చాయి. 375 రీసెటిల్ మెంట్ రిజిస్టర్ లు కనిపించడం లేదట. ఇంత దారుణంగా స్కాములు జరుగుతున్నాయి. అవి ఏ స్థాయిలో ఉన్నాయంటే ...రికార్డులు మాయం చేయడం, మార్చేసేంతగా జరుగుతున్నాయి.

ఇదే జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు భాస్కరరావు తనకు సంబంధం లేని భూములను తనపేరుతోనే డాక్యుమెంట్లు సృష్టించి ...బ్యాంకుకు ఈ భూములు తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చుకున్నది మనం చూస్తునే ఉన్నాం. సర్వే నం .122//11 ఉన్న పేదల కాలనీలోని ఈ భూములు తనయని బ్యాంకుల్లో తాకట్టుపెట్టారు. సర్వే నం. 122// 9, 10,11,12 వేరేవాళ్ల పేర్లమీద ఉన్నవాటిని తనవేనని డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకుల్లో ఆ భూములు తాకట్టుపెట్టి లోన్లు తెచ్చుకుటుంటే అధికారులు దగ్గర ఉండి దాన్ని చేయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది..? గంటా శ్రీనివాసరావుకు ఇంత, నారాలోకేష్ కు ఇంత అని పంచుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. గంటా సాక్షాత్తు మంత్రి. రెవెన్యూ రికార్డులు మార్చి తన బంధువుల చేత తాకట్టుపెట్టి లోన్లు తీసుకుంటున్నారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ...విశాఖలో భూదందాను ఎందుకు అరికట్టలేకపోతున్నారని అన్నాడు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఈదందా సాగదని అయన్నఅన్నాడు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చి విశాఖలో భూకబ్జాలు చేస్తున్నారని, జరుగుతున్న స్కాంల మీద అయ్యన్నపాత్రుడు పత్రికలకెక్కాడు. మూడేళ్లయ్యాక డాక్యుమెంట్లు పోయాయని కలెక్టర్ ఇవాళ చెబుతాడు. ఇంతకుముందు ఇక్కడ జాయింట్ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్గా, ఇప్పుడు కలెక్టర్ గా ఆయనే ఉన్నాడు.  మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులతో అధికారులు కుమ్మక్కై జీవోలిప్పించి...వేరేవాళ్ల పేరుమీదున్న ప్రభుత్వ, అసైన్డ్ భూములను తన పేరుమీద రాయించుకొని భూదందాలు చేస్తున్నారు. ఇదే భూదందాకు సంబంధించి చోడవరం ఎంపీపీ వెంకట సత్యనారాయణ కొమ్మాదిలో తన పేరుతో 23.4 ఎకరాలు భార్య కొండతల్లి పేరుతో మరో 25 ఎకరాలు రాయించుకున్నారని ఈనాడులో వచ్చింది. ఈనాడునే చూపిస్తున్నా.  జగన్ ఇవాళ ధర్నాకు వస్తున్నాడని కంప్యూటర్ లో రికార్డుల్లో పేర్లు సరిచేశారు. కంప్యూటర్ బటన్ ఎలా ఉందంటే జగన్ వస్తున్నాడంటే ఓ బటన్, రావడం లేదంటే ఇంకో బటన్ నొక్కుతున్నారు. ఇంత దారుణంగా భూములు కాజేస్తున్నారు. 

ఇదే విశాఖలో జరుగుతున్న స్కాంలు ఎలా ఉన్నాయంటే...ఎంవీఎస్ మూర్తి గీతం కాలేజీలు నడుపుతున్నాడు. ఈయన సాక్షాత్తు బాబుకు బంధువు. ఈయన రిషికొండలో గతంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం  అలాట్ చేసిన   55 ఎకరాలు కబ్జా చేశాడు.  ఆతర్వాత ఈ భూములు నాకే ఇచ్చేయండి అని బాబుకు లేఖ రాయడం...బాబు క్యాబినెట్ లో తీర్మానం చేసి మూర్తికిచ్చేయడం. రిషికొండలో అక్షరాల రూ. వేయి కోట్లు విలువ చేసే ఈ భూములను బాబు బంధువులకు ధారాదత్తం చేశాడు.   పేదవాళ్లకు ఇళ్లు కట్టించాలని రాజీవ్ స్వగృహ కోసం వైయస్ఆర్ అప్పట్లో జీవో ఇష్యూచేసిన ఏడు ఎకరాలను కూడ మూర్తి కబ్జా చేశాడు. ఆ భూములు తనకే ఇవ్వాలని అడగడం, బాబు దానికోసం అప్రూవల్ ఇవ్వడం. దాని విలువ రూ. వంద కోట్లు. ఆ భూములన్నీ ఎన్ క్రోచ్ అయ్యాయని ఇంతకుముందు కలెక్టర్ రాజీవ్ స్వగృహకు లేఖ రాశాడు. ఓ అన్యాయస్తుడు మీ భూముల మీద కన్నేశాడు. మీ భూములు కాపాడుకోవాలని లేఖలు రాశాడు. భూములు కబ్జాలో ఉన్నాయని తెలియజేస్తూ అధికారులు ఇస్తా ఉన్నా సొంత బందువలకు వేలకోట్లు బాబు దగ్గరుండి ధారాదత్తం చేస్తా ఉన్నాడు.

ఇదే విశాఖ నగర శివారు భీమిలి నియోజకవర్గంలో నేరమని తెలిసినా రైతులను బెదరగొట్టి 358 ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూములను గంటా తన బినామీలకు కొనుగోలు చేయిస్తడు.  పేద ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను ఇలాంటి గద్దలు వచ్చి తన్నుకుపోతున్నారు. ల్యాండ్ పూలింగ్ లో భూములు తీసుకోవచ్చని బాబు సుపుత్రుడు లోకేష్ ద్వారా జీవోలు కూడ ఇప్పిచ్చేస్తరు. ముదపాకలో దాదాపు 955 ఎకరాల అసైన్డ్ భూములపై పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కన్నేశాడు. అగ్రిమెంట్ దారులు ల్యాండ్ పూలింగ్ కు భూములివ్వొచ్చని తక్కువ ధరకు కొనుగోలు చేసి... అదే భూములను రెండు కోట్లకు అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. నాకింత, లోకేష్ కింత అని డీల్ చేసుకుంటున్న వీళ్లు అసలు మనుషులేనా. వివాదాస్పదంగా ఉన్న దసపల్లా భూముల్లో బాబు టీడీపీ ఆఫీసు కట్టిస్తున్నాడు. అయ్యా చంద్రబాబు..! ప్రైవేటు భూములను కబ్జా చేశారా..? ప్రభుత్వ భూములను కబ్జా చేశారా..? అని నేను అడుగుతున్నా..? విశాఖపై నాకు చాలా ప్రేముందని నటిస్తున్నాడు. ఇక్కడ  మంచి ఎయిర్ పోర్టు ఉంటే మూసేసి బోగాపురంలో కొత్తది తెరుస్తడట. మంచిదేనుకున్నాం. కానీ, టీడీపీ వాళ్లు భూములు కొనుగోలు చేసిన చోట ఎయిర్ పోర్టు వస్తుంది. వాళ్ల భూములు ఎయిర్ పోర్టుకు తీసుకోరట. పక్కనే ఉన్న రైతుల భూములు
లాక్కుంటున్నారు. పక్కనే టీడీపీ ఎంపీ, మంత్రి అయ్యన్నపాత్రుడు భూమి ఉన్నా ముట్టుకోవడం లేదు. నాకింత, లోకేష్ కింత అని పంచుకుంటున్నారు.  ఇవాళ విశాఖ జిల్లాలో పేదవాడు భయపడుతూ బతుకున్న పరిస్థితి నెలకొంది.  పెద్దవాడి కన్ను ఎప్పుడు పడుతుంది, భూములు ఎప్పుడుపోతాయోనని పేదలు అనుక్షణం భయపడుతున్నారు. భూ దందాపై తొలుత బహిరగం విచారణ అన్నారు. అలా అయితే వేలమంది వచ్చి కంప్లైంట్ చేస్తారని చెప్పి ...ఇప్పుడు సిట్ తో ఎంక్వైరీ చేయిస్తామని చెబుతున్నారు. ఈ సిట్ లో ఉన్న అధికారులంతా బాబుకింద పనిచేస్తున్న వారే.  వారితో ఎంక్వైరీ చేయిస్తారట. పేదల భూములు దోచుకుందే నీవు, నీకొడుకు, మంత్రులు, రెవెన్యూ అధికారులు. వీళ్లతో ఎంక్వైరీ చేయిస్తే బాధితులకు ఎలా న్యాయం జరుగుతుందని నిలదీస్తున్నా..? ఇది ఎలా ఉందంటే... సీతమ్మ వారిని ఎత్తుకుపోవడం కరెక్టేనా అని రావణుడు కుంభకర్ణుడితో సిట్ వేయిస్తే ఏమవుతుంది. అదే ఎంక్వైరీ హనుమంతునితో చేయిస్తే వీరందరినీ తన్ని లోపల వేస్తాడు. రావణుడిని, రాక్షసులను అందరినీ తంతాడు. సీబీఐకిస్తే బాబును, కొడుకును, మంత్రులను తన్ని లోపల వేస్తారు. కానీ, ఆయన సీబీఐ వేయడట. ఎందుకు వేయరయ్యా అంటే. అది తెగాలంటే 20 ఏళ్లు పడుతుందని వేయడం లేదట. నేను అడుగుతున్నా. 20 ఏళ్లు పడుతుందని నీ బాధనా..? లేక 20 ఏళ్లు నిన్ను జైళ్లోకి పంపిస్తారని నీ బాధనా..?

బాబు హయాంలో క్యాబినెట్ మీటింగ్ జరిగిందంటే...అసైన్డ్ భూములున్న పేదవాళ్లు భయంతో వణికిపోతున్నారు. పేదవాడిని దోచేసుకో...పెద్దవాడితో కుమ్మక్కుకా అన్న సిద్ధాంతాన్ని బాబు ఫాలో అవుతున్నారు. నేరుగా బాబును ఒక్కటే అడుగుతున్నా..విశాఖ మీకు, మీ పార్టీ చాలా చేసింది. మరి మీరు విశాఖకు ఏం చేశారని అడుగుతున్నా..? విశాఖకు బాబు స్కాములు, అవినీతి, దోచుకునేదానికి పర్మిషన్ ఇచ్చారు. దోచుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ముఖ్యమంత్రే దగ్గరుండి అన్యాయం చేయిస్తున్నాడు. ముఖ్యమంత్రి అంటే అందరికీ భయం ఉంటుంది. ఆయనకు తెలిస్తే జైల్లో పెట్టిస్తాడన్న భయ ఉంటుంది. కానీ, బాబు హయాంలో ఎలా ఉదంంటే.. కాపాడాల్సిన బాబే
మంత్రులు, ఎమ్మెల్యేలు,  అధికారులు అంతా మాఫియాగా తయారై దోచుకుతింటుంటే ఏం చేయాలో తెలియని అయోమంయంలో మనమంతా ఉన్నాం. మన భూములను పొరుగుదేశం వాళ్లు వచ్చి కబ్జా చేస్తే మనమంతా యుద్ధం చేస్తాం. కాపాడుకునే కార్యక్రమం చేస్తాం. కానీ, మన  ప్రభుత్వంలో ఉన్న వాళ్లే దగ్గరుండి భూములు లాక్కునే కార్యక్రమం చేస్తుంటే మనమంతా ఏం చేయాలి..? వీళ్లను బంగాళాఖాతంలో కలుపుదాం. మీ అందరికీ ఓ భరోసా ఇస్తున్నాం. ఓ అంగుళం కూడ పేదవాడికి అన్యాయం జరగకుండా పోరాడతాం. పేదవాడికి వైయస్సార్సీపీ అండగా నిలుస్తుంది. పొరపాటున సక్సెస్ కాకపోతే ఎవరూ బాధపడొద్దు. మరో సంవత్సరమే వీళ్ల పాలన. ఆ తర్వాత వచ్చేది మనందరి పాలన. వీళ్లు తిన్నదంతా కక్కిస్తాం. పేదవాడి భూములను తిరిగి పంచుతాం. గట్టిగా హామీ ఇస్తున్నా.  మీకు అన్ని రకాలుగా, తోడుగా వైయస్సార్సీపీ నిలబడుతుందని చెబుతూ మీ పోరాటాలకు అండగా ఉంటుందని మాట ఇస్తున్నా. 

తాజా వీడియోలు

Back to Top