అభిమానం.. ప్రేమ.. ఆప్యాయతలు.. వినతులు



- ప్ర‌కాశం జిల్లాలో దిగ్విజ‌యంగా కొన‌సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- తాళ్లూరు శివారు నుంచి  ప్రారంభ‌మైన  వైయ‌స్ జ‌గ‌న్ 103వ రోజు పాదయాత్ర
 -  సాయంత్రం అద్దంకిలో బహిరంగ సభ 

 ప్రకాశం: వైయ‌స్‌ఆర్‌సీపీ అధినేత, జననేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  అభిమానం..ప్రేమ‌..ఆప్యాయ‌త‌లు..విన‌తుల‌తో దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. రాజన్న బిడ్డకు దారిపొడవునా ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఆదివారం ఉదయం వైయ‌స్‌ జగన్ ప్రజాసంకల్పయాత్ర 103వ రోజు తాళ్లురు శివారు నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి అనంతరం రాజానగరం గిరిజన కాలనీ మీదుగా కంకుపాడు చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి శ్రీరాంనగర్‌ కాలనీకు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కు ప్రారంభమౌతుంది. అక్క‌డి నుంచి పార్వతీపురం క్రాస్‌, తిమ్మయ్యపాలెం మీదుగా అద్దంకి చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. ఇప్పటి వరకు వైయ‌స్‌ జగన్‌ మొత్తం 1,383.1 కిలోమీటర్లు నడిచారు. ప్రజల సమస్యలు వింటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. 

అన్నా..నీవే దిక్కు 
 ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి దారిపొడవునా ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. చంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌లో మోస‌పోయామ‌ని అన్నా..నీవే దిక్కు అంటూ  రైతులు,మ‌హిళ‌లు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విక‌లాంగులు, వితంతువులు, వృద్ధులు, అన్ని సామాజిక వ‌ర్గాల ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. ప్ర‌ధానంగా ప్ర‌కాశం జిల్లాలో తీవ్ర నీటి ఎద్ద‌డి నెల‌కొంది. ఇక్క‌డ తాగేందుకు నీరు లేదు..సాగునీరు అస‌లే లేదు. ఫ్లోరైడ్ నీరు తాగి జిల్లావాసులు అనారోగ్యానికి గుర‌వుతున్నారు.  వివిధ వర్గాల ప్రజలు నిత్యం తమ కష్టాలను జననేతకు చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వల్ల తమకు ఒనగూరింది ఏమీ లేదని, నిండా మునిగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా అడ్డుకుంటున్న అభిమానం.. ప్రేమ, ఆప్యాయతలు, వినతుల వెల్లువ నడుమ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొన‌సాగుతోంది. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా వింటున్న వైయ‌స్ జ‌గ‌న్ ‘ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం రాగానే అందరికీ ఉపాధి చూపుతాం’ అని భ‌రోసా ఇస్తున్నారు.  ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలతో అందరినీ ఆదుకుంటామన్నారు. 
Back to Top