మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడన్న భరోసా కల్పిస్తా




– వైద్యం కోసం ఎవరికి ఇబ్బంది రాకుండా చూస్తాం
– ప్రతి పేదవాడికి కార్పోరేటు వైద్యం అందిస్తాం
– రూ.1000 బిల్లు దాటితే ఏ ఆపరేషన్‌కైనా ఆరోగ్యశ్రీ
– ఆపరేషన్‌ సమయంలో కుటుంబ యజమానికి డబ్బులిచ్చి ఆదుకుంటా
– ఎక్కడ ఆపరేషన్‌ చేయించుకున్నా ఇబ్బంది లేదు
– దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛన్‌
– ఎన్నికల సమయంలోనే బాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు
–సెజ్‌ల్లో ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు
– చంద్రబాబు విదేశీ పర్యటనలకు రూ.200 ప్రజాధనం వృథా
–టెంకాయలు కొట్టి వదిలేయడం బాబుకు అలవాటు
– అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదు
– బాబుదంతా షో 


నెల్లూరు: చంద్రబాబుకు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని, ఇలాంటి పరిస్థితిని మార్చుతానని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక మా అన్న ముఖ్యమంత్రి ఉన్నాడన్న భరోసా ప్రతి ఒక్కరికి కల్పిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 70వ రోజు నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో సాగింది. సాయంత్రం నాయుడుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

మీ అందరూ నా వెంట ఉండటం ఆనందంగా ఉంది
ఈ జిల్లాలో అడుగుపెట్టిన నాటి నుంచి వేల మంది తనతో పాటు అడుగులో అడుగులు వేశారు. మరోవైపు సమస్యలు, బాధలు ఉన్నా..నా బుజంపై చేతులు వేసి అన్నా..మేమంతా నీతోపాటు మేమున్నామని అడుగులో అడుగులు వేశారు. నడిరోడ్డు అన్న సంగతి కూడా ఖాతర్‌ చేయలేదు. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపించారు. ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

ప్రతి ఇంట్లో చిరునవ్వులు చూసేందుకు..
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంట్లో చిరునవ్వులు చూసేందుకు నవరత్నాలను ప్రకటించాం. ఈ నవరత్నాల గురించి ప్రతి సభలో వివరిస్తున్నాను. పేదవాడి ఆరోగ్యం గురించి ఇవాళ మీ అందరికి చెబుతున్నాను. మీ అందరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. నాడు వైయస్‌ఆర్‌ పాలనలో ఏ పేదవాడు కూడా ఆరోగ్యం కోసం అప్పులపాలు కాకూడదన్న బరోసా ఉండేది. నాన్నగారి హయాంలో పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే 108 నంబర్‌కు ఫోన్‌కొడితే చాలు కుయ్‌..కుయ్‌ అంటూ 20 నిమిషాల్లో ఆ పేదవాడి వద్దకు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి చిరునవ్వుతో ఇంటికి చేర్చేది. ఇవాళ 108కు ఫోన్‌కొడితే 20 నిమిషాల్లో మీ ఇంటికి అంబులెన్స్‌వస్తుందా? . ఇవాళ 108కు ఫోన్‌కొడితే మాకు జీతాలు ఇవ్వడం లేదని, డీజిల్‌ లేదన్న సమాధానం వస్తుంది. ఏ పేదవాడైనా అప్పులపాలు అయ్యే పరిస్థితి ఎందుకు వస్తుందని ఆరోగ్యం కోసమే. పేదవాడు మంచి ఆసుపత్రికి వెళ్లాంటే హైదరాబాద్‌కు వెళ్లాలి. కానీ ఇవాళ హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. పేదవాడు ఎక్కడికి వెళ్లాలి. పేదరికంలో ఉన్న వారి పిల్లలకు మూగ, చెవుడు వస్తే ఆపరేషన్‌ చేయించేందుకు రూ.6 లక్షలు అవసరం. నాన్నగారి హయాంలో అలాంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించేవారు. ఇవాళ కొత్త కొత్త నిబంధనలు పెట్టి కోత విధిస్తున్నారు. డయాలసిస్‌ చేయించాలంటే నెలకు రూ.20 వేలు ఖర్చు అవుతుంది. కిడ్నీలు బాగోలేని పేదవాడు ఆసుపత్రికి వెళ్తే ఇవాళ ఖాళీలు లేవు. ఏడాది తరువాత రాపో అంటున్నారు. క్యానర్‌ వస్తే కీమోథెరఫీ చేయాలి. ఇవాళ కేవలం రెండే రెండు సార్లు కీమో థెరఫీ చేస్తున్నారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన చూశారు. చంద్రబాబు పాలన కూడా చూశారు. వైయస్‌ఆర్‌ కొడుకుగా వైయస్‌ జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాడు. మనందరి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఏ పేదవాడు కూడా ఎక్కడ ఆపరేషన్‌ చేయించుకున్నా ఉచితంగా చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపిస్తాం. ఏ పేదవాడికైనా కూడా వెయ్యి రూపాయల బిల్లు దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకుంటాం. పేదవాడికి ఆపరేషన్‌ చేయించిన తరువాత డాక్టర్‌ రెస్ట్‌ తీసుకునేందుకు సిపార్సు చేస్తే ఎన్ని నెలలు అయినా ఫర్వాలేదు ..విశ్రాంతి తీసుకునే సమయంలో డబ్బులు ఇస్తామని మాట ఇస్తున్నాను. మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మాకు ఇబ్బంది లేదన్న భరోసా కల్పిస్తాను. పేదవాడు తలసీమియ, డయాలసిస్, వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే అలాంటి వారికి పింఛన్‌ రూ.10 వేలు ఇస్తామని హామీ ఇస్తున్నాను. నవరత్నాల్లో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నా వద్దకు వచ్చి అర్జీలు ఇవ్వవచ్చు. 

తాగడానికి నీళ్లు కరువు..
సూళ్లూరు ని యోజకవర్గంలో రెండో రోజు పాదయాత్ర చేశాను. ఏ గ్రామానికి వెళ్లినా కూడా అన్నా..తాగడానికి కూడా నీళ్లు లేవన్నా అని చెబుతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే రాష్ట్రంలోనే అత్యధిక వరి పంట సాగు చేసే జిల్లా ఇది. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా..ఇదే జిల్లాలో ఇదే ఖరీఫ్‌లో లక్ష హెక్టార్లలో వరి పంట వేయాలి. కానీ ఈ ఏడాదిలో కేవలం 39 హెక్టార్లలో మాత్రమే వరి పంట వేశారు. మన ఖర్మ ఏంటో  చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. సోమశీలలో కాస్తోకూస్తో నీరు ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి నుంచి పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు చేపట్టారు. మహానేత బతికి ఉండి ఉంటే నీళ్లకు ఇబ్బంది ఉండేది కాదు. మిగిలి ఉన్న విస్తరణ పనులు పూర్తి చేయడానికి చంద్రబాబుకు నాలుగేళ్లు అయినా మనసు రావడం లేదు. సోమశీల కెనాల్‌ మహానేత హయాంలో రూ.400 కోట్లకు సంబంధించి దాదాపు రూ.140 కోట్ల పనులు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి అయిపోయి ఉంటే రైతులు సుబీక్షంగా ఉండేవారు. 300 చెరువులకు నీరు వచ్చేది. ఇవాళ పేదవాడు ఎలా బతుకుతున్నారన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు.

చంద్రబాబు ఒక్కసారైనా ఆలోచించారా?
ఉప్పునీటి సరస్సు పులికాట్‌పై 30 వేల మంది మత్స్యకారులు బతుకుతున్నారు. ఇవాⶠ ఇసుక మేటలతో మూతపడింది. దాంట్లో చేపలు పట్టేందుకు రైతులకు అవకాశం లేకుండా పోయింది. ఈ విషయంపై చంద్రబాబు ఒక్కసారైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకువస్తారు. ప్రజలను ఎలా మోసం చేయాలన్నదే ఆయన ఆలోచన. చంద్రబాబు తల్చుకుని ఉంటే ఈ పనులు పూర్తి అయ్యేవి. ఎన్నికల సమయంలో మాత్రం అక్కడికి వచ్చి టెంకాయలు కొడుతారు. ఆ తరువాత మరిచిపోతారు. కృష్ణపట్నం, దుగ్గిరాజుపోర్టు మన కళ్లముందే కనిపిస్తుంది. బాబు ఈ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. ఇదే జిల్లాలో వైయస్‌ఆర్‌ హయాంలో మూడు ఎస్‌ఈజెడ్‌లు ఏర్పాటు చేశారు. నాన్నగారు ఒక స్వప్నాన్ని చూశారు. ఈ ఎస్‌ఈజెడ్‌ల్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలని స్వప్నాన్ని చూశారు. ఇవాళ ఈ ఎస్‌ఈజెడ్‌ల్లో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. మన పిల్లలకు సెక్యూరిటీ, వాచ్‌మన్‌ పోస్టులు ఇస్తున్నారు. చంద్రబాబు నాలుగేళ్లుగా పట్టించుకోవడం లేదు. ఇదే పెద్ద మనిషి ఉద్యోగాల కోసమని దావోస్‌కు వెళ్లారు. నాలుగేళ్లలో 22 సార్లు విదేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనలకు కనీసం రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశం తరహాలో అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఇవాల్టికి మన రాష్ట్రం సింగపూర్, జపాన్‌ కావాల్సి ఉంది. కానీ ఇవాళకు రాజధానిలో ఒక్క ఇటుక కూడా పడలేదు. అన్ని కట్టినట్లుగా కంప్యూటర్‌లో డిజిటల్‌ ప్రదర్శన చూపిస్తారు. అంతా షోనే. ఆ షోకు రాజమౌలితో సినిమా సెట్టింగ్‌లు అంటున్నారు. అర్కిటెక్‌ చేయాల్సిన పని అర్కిటెక్‌ చేయాలి. సినిమా వాళ్లు చేయాల్సిన పని సినిమా వాళ్లు చేయాలి.

బాదుడే..బాదుడు
ఎన్నికలకు ముందు చంద్రబాబు కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక మూడుసార్లు కరెంటు బిల్లులు పెంచారు. మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోలు, డిజిల్‌ ధరలు ఏపీలో ఉన్నాయి. రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప మరేమి ఇ వ్వడం లేదు. అధికారంలోకి రాగానే బెల్టు షాపులు తొలగిస్తా అన్నారు. ఇపుడేమో ఏడాది 15 శాతం మద్యం అమ్మకాలు పెంచుతున్నారు. మద్యం కావాలంటే ఒక్క ఫోన్‌ కొడితే ఇంటికి వస్తుంది. బ్యాంకుల్లో పెట్టిన రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత బ్యాంకుల్లోని బంగారం ఇంటికి వచ్చిందా?. వేలం నోటీసులు మాత్రం ఇంటికి వస్తున్నాయి. ఆయన చేసిన వ్యవసాయ రుణాల మాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తామన్నారు. ఒక్క ఇల్లైనా కట్టించాడా? పెద్ద కొడుకును అన్నారు. మాట తప్పారు. ఆడవాళ్ల కంట కన్నీరు పెట్టిస్తే ఇంటికి అరిష్టం. ఆ నాడు పొదుపు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామన్నారు. చంద్రబాబు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? సున్నావడ్డీకి రుణాలు అందడం లేదు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. నాలుగేళ్లలో ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఆ నాడు ఊదరగొట్టారు. ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.90 వేలు బాకీ పడ్డాడు. 

నమ్ముతారా?
ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థ చెడిపోయింది. విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలు కనిపించడం లేదు. ఎవరైనా నాయకుడు హామీ ఇచ్చి నెరవేర్చకపోతే ఇంటికి వెళ్లాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. రేపొద్దున చంద్రబాబు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. ప్రతి ఇంటికి బెంజి కారు కొనిస్తా అంటారు. ఇన్ని రోజులు చంద్రబాబుకు ఫించన్లు ఇవ్వడం లేదన్న సంగతి తెలియడం లేదట. ఎందుకంటే ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. 

మీ అందరి తోడు కావాలి..
చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడాలంటే, విశ్వసనీయత అన్న అర్థం తీసుకురావాలంటే ఒక్క వైయస్‌ జగన్‌ వల్ల సాధ్యం కాదు..తనకు మీ అందరి తోడు, చల్లని ఆశీస్సులు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. మీ బిడ్డ ఈ రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరాడు. మీ బిడ్డను ఆశీర్వదించమని, తోడుగా నిలువమని పేరు పేరునా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

వైయస్‌ఆర్‌సీపీలో చేరిక
 సమైక్య ఉద్యమకారుడు చేవూరి చెన్నయ్య వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆయనకు వైయస్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 
 

తాజా వీడియోలు

Back to Top