నిధులిచ్చి తుపాను బాధితులను ఆదుకోండి


న్యూఢిల్లీ, నవంబర్ 8:  హుద్ హుద్ తుపాన్ తో తీవ్రంగా నష్టపోయిన మూడు ఉత్తరాంద్ర జిల్లాలు, ప్రత్యేకించి విశాఖపట్టణం ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ఆర్దికశాఖ మంత్రి అరుణ్ జైట్లీకి వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఎపీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన నిదులు వీలైనంత త్వరగా మంజూరు చేసి బాధితులకు సాయం అందించాలని కోరారు. జైట్లీ అన్ని అంశాలను సావధానంగా విన్నారని సాయం అందిస్తామని హమీ ఇచ్చారని శ్రీ జగన్ తెలిపారు.

శ్రీ జగన్ శనివారం పార్టీ ఎంపీలతో కలసి డిల్లీకి చేరుకున్నారు.పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి,  పోంగులేటి శ్రీనివాసరెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుకతో కలిసి సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీని ఢిల్లీ కృష్ణ మీనన్ మార్గ్-2లోని ఆయన నివాసంలో కలిశారు. హుద్ హుద్ తుపాను బాదితులను ఆదుకోవాలని, తుపాన్లతో ఆంద్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఓ వినతిపత్రాన్ని అందజేశారు. దాదాపు అరగంటకు పైగా అన్ని అంశాలను జైట్లీకి వివరించారు.

అనంతరం శ్రీ వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. హుద్ హుద్ తుపానుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదికలు పంపామని చెబుతున్నదని, ఇంక మీరు రావాల్సిన అవసరమేముందని కొందరు విలేకరులు ఈ సందర్బంగా ప్రశ్నించారు. దీనికి శ్రీ జగన్ స్పందిస్తూ.. ప్రదాన ప్రతిపక్షంగా వచ్చి వినతి పత్రం ఇస్తే మీకేమైనా అభ్యంతరమా అని నవ్వుతూ అన్నారు. బాధితులకు సాయం అందిచడంలో ప్రభుత్వం విఫలమైందని వచ్చారా లేక రాజకీయాలకు అతీతంగా కేంద్ర మంత్రిని కలిశారా అని ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఇప్పుడు కాదు చెప్పింది. తుపాను దెబ్బ తిన్న ప్రాంతాల్లో ఊరూరూ తిరిగి ఆ గ్రామాల్లో ప్రభుత్వం ఏం చేసిందనేది అందరికి చూపించాం. ఏ సహయం అందడం లేదని అక్కడి ప్రజలే చెప్పారు  అని వివరించారు.

హుద్ హుద్  తుపానుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదికలు పంపామని చెబుతున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము నిర్వర్తిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా బాధితులకు న్యాయం జరగాలన్నదే మా కోరిక. బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైన విషయాన్ని కేంద్ర కేంద్ర ఆర్దిక మంత్రి దృష్టికి తీసుకువచ్చాం. తుపానుతో జరిగిన నష్టం, రాష్ట్రం ఎదురు చూస్తున్న సహాయం సత్వరమే అందించాల్సిందిగా అభ్యర్దించాం. ఆయన సావదానంగా విన్నారు. తప్పకుండా మంచి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభత్వం నుంచి ఇప్పటివరకు కేవలం రూ.450 కోట్లు మాత్రమే సాయం అందిందన్న అంశమూ మా చర్చలో వచ్చింది. దీనికి సంబంధిచి నివేదికలు ఇంకా రాలేదు వచ్చాక సాయం చేస్తాం అని జైట్లీ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పది రోజులపాటు ఊరూరా తిరిగి ప్రభుత్వం ఆ గ్రామాల్లో ఎం చేయలేదో అందరికీ చూపిస్తూ, చెప్పుకుంటూ వచ్చాం. హుద్ హుద్  తుపాను సహయక చర్యల్లో సర్కారు విఫలమైందని నాతోపాటు తిరిగిన మీడీయా వారి క్లిప్పింగులు చూస్తే తెలుస్తుంది. ఎలాంటి సహయం అందడంలేదని ప్రజలే చెప్పారు. చంద్రబాబుగారేమో తుపాను సహయంగా 25 కేజీలు ఉచితంగా ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. ఆ 25 కిలోల బియ్యం రేషన్ దుకాణాల్లో రూ.25కి ఇస్తారు. అంటే రూ.25 సాయం చేస్తున్నారు. అదికూడా అన్ని గ్రామాల్లో అందరికి ఇవ్వలేదు. అధికారులెవరూ రాని పరిస్దితి.

చంద్రబాబు మాటలు నమ్మి రైతులు రుణాలు చెల్లించలేదు. దీంతో పంట బీమా రాక రైతులు భారీగా నష్టపోయారు. ఈవిషయాలన్నీ ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తెచ్చాం. ఈరోజు కేవలం  హుద్ హుద్  బాధితుల సాయం అంశాన్ని మాత్రమే కేంద్ర ఆర్దిక మంత్రి దృష్టికి తెచ్చాం. ప్రత్యేక హోదాకు సంబందించి ఎలాంటి చర్చ జరగలేదు.

అరుణ్ జైట్లీకి ఇచ్చిన వినతిపత్రంలోని ముఖ్యాంశాలు...

హుద్ హుద్  తుపాను వచ్చిన మూడో రోజే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఉదారంగా రూ.1000 కోట్లు సాయం ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాదితులకు ఒక్క రూపాయి సాయం కూడా అందించలేదు. నష్టపోయిన వారిలో 10% రైతులకు సైతం నేటికీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదు. నిర్వాసితులైన వారికి తిరిగి వసతులు కల్పించలేదు. బాధిత కుటుంబాలకు సాయం కింద అందించే బియ్యం పంపిణీలోనూ స్దానిక రాజకీయాలు పనిచేస్తున్నాయని మీడియాలో కధనాలు వచ్చాయి.

ప్రభత్వ అధికారిక లెక్కల ప్రకారం 65 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్దలు, రైల్వే, టెలికాం, ఎయిర్ పోర్టు, ఓడరేవు, ఫిప్ యార్డు, స్టీల్ ప్లాంట్, బీహెచ్ పీవీల నష్టాన్ని రూ.21,640.630 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదిక అందినట్లు తెలుస్తుంది.

చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి రైతులు రుణాలు బ్యాంకులకు చెల్లించలేదు. దీంతో వారికి పంట బీమా అందే పరిస్దితి లేదు. మీరు వీలైనంత త్వరగా రాష్ట్రానికి ఉదారంగా ఆర్దిక సాయం అందిస్తే బాదితులకు ఊరట లబిస్తుంది, లేదంటే వారి జీవితాలు మరింత దయనీయంగా మారుతాయి.

పంటలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న రైతులకు పంట రుణాలను, వడ్డీలను పూర్తిగా రద్దు చేయాలి. నష్టపోయిన రైతులకు వచ్చే సీజన్ కి సంబందించి అవసరమైన రుణాలు కొత్తగా మంజూరు చేయాలి. తుపాను బాధిత ప్రాంతాల్లోని స్వయంసహాయ గ్రూపులకు ఎలాంటి వడ్డీలు లేకుండా రుణాలు రీషెడ్యూల్ చేయాలి. వచ్చే రబీకి అవసరమైన విత్తనాలు ప్రభుత్వమే ఉచితంగా అందించాలి. రైతులందరికీ పంట బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలి, పాక్షికంగా దెబ్బతిన్న వరి, చెరుకు, ఉద్యానవన ఉత్పత్తులు సేకరించేందుకు హమీ ఇవ్వాలి.

హుద్ హుద్ తుపాను సందర్బంగా అక్టోబర్ 9,10,11,12,13,15 లలో ఇచ్చిన హమీలను నెరనేర్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలివ్వాలి. బూపిందర్ సింగ్ హుడా కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కౌలు రైతులను కలుపుకుని ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు తగ్గకుండా ప్రకృతి విపత్తు సహయ నిధి నుంచి సాయం అందించాలి.

చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ర్ట ప్రభుత్వ హమీ ఇచ్చిన ప్రకారం రూ.5లక్షల పరిహరం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి. ఇల్లు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.50 వేల ఆర్దిక సాయం అందించాలి. ఇల్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి శాశ్వత పరిష్కారం కింద పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి.

ఇప్పటి వరకు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కోన్న ప్రకారం పశువులు  చనిపోయిన వారికి, కోళ్ళు  చనిపోయిన కోళ్ళ ఫారాల వారికి నష్ట పరిహారం అందజేయాలి. తుపాను బాధిత ప్రాంతాల్లోని వారికి రేషన్ ద్వారా అతి తక్కువ సహాయం చేసినందున ప్రతి ఇంటికి కనీసే రూ.5 వేల ఆర్దిక సాయం ఇవ్వాలి. బోట్లు, వలలు నష్టపోయిన మత్స్యకారులకు పూర్తి నష్టపరిహారాన్ని చెల్లించాలి. వరద బాధిత ప్రాంతాల్లో భూమికోతను అరికట్టేందుకు, పూడికతీతకు నిధులు కేటాయించాలి.

Back to Top