నిరవధిక నిరాహార దీక్షలో వైఎస్ జగన్...

జనం కోసం జననేత ఉద్యమం...!
జనసందోహమైన నల్లపాడు రోడ్డు..!
గుంటూరుః ప్రత్యేకహోదా సాధన కోసం  ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు నల్లపాడు రోడ్డుకు చేరుకున్నారు. అశేషజనవాహిని మధ్య వేదిక వద్దకు  చేరుకొని వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. తొలుత దీక్షా ప్రాంగణం వద్ద దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నేత డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేకహోదా కోసం ప్రాణాలర్పించిన అమరులకు పుష్పాంజలి ఘంటించారు. వైఎస్ జగన్ కు హర్షధ్వనాలు తెలుపుతూ ప్రజలంతా సాదర స్వాగతం పలికారు. ఎస్ జగన్ కు మద్దతుగా రాష్ట్ర ప్రజానీకమంతా దీక్షాస్థలి వద్దకు కదం తొక్కుతోంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల రాకతో నల్లపాడు రోడ్డు జనసందోహమైంది. 

జననేతకు ఘన స్వాగతం..!
ప్రత్యేక హోదా డిమాండ్ తో  దీక్ష చేపట్టేందుకు అంతకుముందు వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి ఈఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి వైఎస్ జగన్ నేరుగా కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లారు.  ప్రజలకు మేలు జరగాలని, పాలకుల కళ్లు తెరిపించి ప్రత్యేకహోదా సాధించేలా దీక్ష విజయవంతం చేయాలని అమ్మవారిని కోరుకున్నారు. ఆతర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన దీక్షాప్రాంగణానికి చేరుకొని నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్నారు. 

జననేతకు తోడుగా..!
సత్తెనపల్లి రోడ్డులోని మిర్చియార్డుకు సమీపంలో  వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రజలకు  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం పట్ల పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ జగన్ చేపడుతున్న దీక్షకు రాష్ట్రవాప్తంగా వివిధ వర్గాలు పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తం చేశాయి. విద్యార్థి, వర్తక, వాణిజ్య, ప్రజా సంఘాలు దీక్షకు మద్దతు ప్రకటించాయి.

అన్ని వర్గాల మద్దతు..!
విద్యార్థి సంఘాలు కళాశాలల్లో సమావేశాలు నిర్వహించి ప్రత్యేక హోదాపై విద్యార్థులకు అవగాహన కలిగించాయి. కరపత్రాలు పంపిణీ చేశాయి. ఇక పార్టీ శ్రేణులు గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించి దీక్ష వద్దకు తరలిరావడానికి ప్రణాళికను రూపొందించుకున్నాయి. ఈ స్పందనకు అనుగుణంగా దీక్షా శిబిరం వద్ద నాయకులు ఏర్పాట్లు చేశారు. గత నెల 26న చేపట్టాలనుకున్న దీక్షకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించినప్పటికీ, రెట్టించిన ఉత్సాహంతో పార్టీ నేతలు ఈసారి ఏర్పాట్లు చేశారు.

ప్రసంగ పాఠవాల ప్రదర్శన..!
దాదాపు 200 మంది నాయకులు ఆసీనులు కావడానికి అనువుగా వేదికను ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఇతర సీనియర్ నాయకులు ఈ వేదికపై ఆసీనులవుతారు. దూరం నుంచి కూడా దీక్షా కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేదికకు ఇరువైపులా ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిలు వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలను ప్రదర్శించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు

తాజా వీడియోలు

Back to Top