ఏం పాపం చేశారని ప్రజలను ఇలా పీడిస్తున్నావ్‌

బాబు పాలనలో అడుగడుగునా.. అవస్థలే
ఏం పాపం చేశారని ప్రజలను ఇలా పీడిస్తున్నావ్‌
చంద్రబాబుకు అబద్ధాలు, మోసం సులభంగా అలవాటయ్యాయి
వచ్చే ఎన్నికల్లో ఇంటికి కేజీ బంగారం, బెంజ్‌ కారు ఇస్తానంటాడు
చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి
విలువలు, విశ్వసనీయ అనే పదాలు రావాలి
మన ప్రభుత్వం రాగానే కష్టాలన్నీ తీరుస్తా
మీ పిల్లలను ఎంతవరకైనా నేను డబ్బులు కట్టి చదివిస్తా
ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఆ ఇంటి ఇళ్లాలిపై రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తా
2024లో మద్యనిషేదం చేసే ఓట్లు అడుగుతాం
రావులచెరువులో ప్రతిపక్షనేత  వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి



అనంతపురం: చంద్రబాబు పాలనలో అడుగడుగునా.. ప్రజలు అవస్థలే కనిపిస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ధర్మవరంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ బత్తులపల్లి మండలం రావులచెరువులో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జననేత మాట్లాడుతూ.. చంద్రబాబు ఇస్తామన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ అందడం లేదన్నా.. పిల్లలను చదివించే పరిస్థితిలో లేమన్నా.. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంక్‌లో బంగారం పెడితే వాటికి వేలం నిర్వహిస్తున్నారన్నా.. సున్నావడ్డీలు, పావలా వడ్డీలు పోయాయి. బ్యాంక్‌లు రూ. 2 వడ్డీలు వసూలు చేస్తున్నాయన్నా.. ఆరోగ్యశ్రీ పనిచేయడం లేదన్నా.. పెన్షన్‌ ఇవ్వడం లేదన్నా అని వృద్ధులు, వికలాంగులు... పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని, రుణమాఫీ కాలేదన్నా అని రైతులు ఇలా ఒకొక్కరు ఒక్కో సమస్య చెప్పుకుంటున్నారన్నారు. 

రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఏ విధంగా ఉందో ప్రజలే చెప్పే నిజాలే నిదర్శనమని వైయస్‌ జగన్‌ అన్నారు. గుండె, న్యూరో, నరాలకు సంబంధించిన ఆపరేషన్లు చేయించుకోవాలంటే ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఎక్కడికి పోవాలని చంద్రబాబును ప్రశ్నించారు. ఆంధ్రరాష్ట్రంలో ఆస్పత్రులు మంచిగా లేవు. హైదరాబాద్‌లో ఉన్న ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటూ ఆరోగ్యశ్రీ వర్తించదంటున్నావు మరీ పేద ప్రజలు వైద్యం ఎక్కడ చేయించుకోవాలని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. అదే విధంగా అర్హులైన వారికి పింఛన్లు అందించకుండా పది మందికి కట్‌ చేసి కేవలం ఒక్కరికి మాత్రమే.. అది కూడా తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే ఇస్తున్నారని వైయస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. 

పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు విలవిలలాడుతున్నారని వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశనగ పంట వేశాం.. 44 కేజీల బస్తా రూ. 13 వందలకు అడుగుతున్నారన్నా అని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు. రైతుల కన్నీరు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో పూర్తిగా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ చంద్రబాబు చేసిన మాఫీ రైతుల వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేశాడన్నారు. అదే విధంగా చంద్రబాబు రూ. 5 కోట్లు పెట్టి మండలానికి ఒక మోడల్‌ స్కూల్‌ కట్టించి అందులో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాడన్నారు. 

చంద్రబాబుకు అబద్దాలు ఆడడం, మోసం చేయడం సులభంగా అలవాటైపోయిందని వైయస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.. ప్రజలను వెన్నుపోటు పొడవడం గొప్ప విషయం కాదన్నారు. రాజకీయ వ్యవస్థ మారాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకపోతే ఆ రాజకీయ నేత రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి. ఇది జరగాలంటే ఒక్క జగన్‌తో కాదు.. జగన్‌కు మీ తోడు కావాలి. అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థకు నిజాయితీ, విశ్వసనీయత అనే పదాలు తెలుస్తాయి. 

చంద్రబాబు గత ఎన్నికల్లో చెప్పిన వాగ్ధనాలు నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడొక అడుగు ముందుకేసి బ్రహ్మాండమైన అబద్ధాలతో మీ ముందుకు వస్తాడని వైయస్‌ జగన్‌ చెప్పారు. అది ఎలా అంటే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. అంతటితో ఆగకుండా ఇంటింటికీ బెంజ్‌ కారు కొనిస్తానంటాడు. ఇలాంటి వ్యవస్థలో మార్పులు రావాలి. రాజకీయ నేతలు అబద్ధాలు చెప్పడం సరైంది కాదని తగిన గుణపాఠం ప్రజలే చెప్పాలి. 

చంద్రబాబు చర్మం మందం. ఆయన మనకు మేలు చేస్తాడనే నమ్మకం లేదు. నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలన చూసి మరో సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో ఇలాంటి నాయకుడు మనకు కావాలా.. అని ప్రజలను అడిగారు. వారంతా మాకొద్దీ చంద్రబాబు పాలన అంటూ చేతులెత్తి నినదించారు. 
ఒక సంవత్సరం తరువాత దేవుడి ఆశీర్వదం, ప్రజల దీవెనలతో మన ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ప్రజల కష్టాలన్నీ తీరుస్తానని వైయస్‌ జగన్‌ వారికి భరోసానిచ్చారు. 
 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏఏ కార్యక్రమాలు చేయబోతున్నామో నవరత్నాల ద్వారా ప్రకటించడం జరిగిందన్నారు. అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలను నవరత్నాలల్లో చేర్చడం జరిగిందన్నారు. మీ పిల్లలు ఇంజినీరింగ్‌ చదువుతారో.. డాక్టర్‌ చదువుతారో.. ఏం చదివిస్తారో చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చు అయిన పర్వాలేదు. అన్ని పూర్తిగా నేనే కడతానన్నారు. పెద్ద చదువులకు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇంటి నుంచి డబ్బులు పంపించకుండా మెస్‌చార్జీలకు రూ.20 ఏటా అందిస్తానని ప్రకటించారు. మన పిల్లలు చదివితేనే మన తలరాతలు మారుతాయి. ప్రతి తల్లి చేయాల్సిందల్లా మీ చిట్టి పిల్లలను బడికి పంపించండి. బడులకు పంపించిన ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. వారు చదువుకుంటేనే బతుకులు మారుతాయని ఈ పథకం చేపట్టామన్నారు. రాష్ట్రంలో చదువురాని వారు 32 శాతం మంది ఉన్నారని, అక్షరాస్యత పెంచేందుకు కృషి చేస్తానన్నారు. 

90 లక్షల మంది పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయారని వైయస్‌ జగన్‌ చెప్పారు. చంద్రబాబు హయాంలో సున్నావడ్డీ, పావలా వడ్డీ పథకాలు ఎగిరిపోయాయన్నారు. ప్రభుత్వం బ్యాంక్‌కు వడ్డీ కడితే బ్యాంక్‌లు మనకు సున్నావడ్డీకి డబ్బులు ఇస్తాయని, చంద్రబాబు కట్టకపోవడంతో బ్యాంక్‌ వారు కూడా రుణాలను అటకెక్కించారన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత అర్హులందరికీ సున్నావడ్డీ రుణాలు అందిస్తామన్నారు. అదే విధంగా పొదుపు సంఘాల అక్కచెలెల్లమ్మల రుణాలన్నీ నాలుగు దఫాల్లో పూర్తిగా వారికి చేతికే ఇస్తామన్నారు. అంతే కాకుండా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించడమే కాకుండా ఇంటి ఇళ్లాలు పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తామన్నారు. 

అధికారంలోకి వచ్చాక బెల్ట్‌షాపులన్నీ తీస్తేస్తామన్న చంద్రబాబు ఇవాళ ఫోన్‌ కొడితే ఇంటికే మద్యం బాటిల్‌ పంపిస్తున్నాడని వైయస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు దఫాల్లో మద్య నిషేదం చేపడతామన్నారు. అదే విధంగా మద్యం తాగడం వల్ల జరిగే నష్టాలపై ఎడ్యుకేట్‌ చేస్తామన్నారు. మద్యానికి అలవాటు పడిన వారికి డిఎడిక్షన్‌ క్యాంపులను సైతం ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తిగా మద్య నిషేదం చేసిన తరువాతే 2024 ఎన్నికల్లో వచ్చి ఓటు అడుగుతానని స్పష్టం చేశారు. 
Back to Top