బాబుకు భయం పట్టుకుంది



–కవులు, కళాకారులకు తెనాలి నిలయం
– తెనాలిని పచ్చ చొక్కాలు పీక్కు తింటున్నాయి
– రైతులకు నీళ్లు ఇవ్వరు..కోకో కోలా ఫ్యాక్టరీకి నీళ్లు ఇస్తున్నారు
–  బాబు రుణమాఫీ వడ్డీలకు సరిపోవడం లేదు
– ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు? ఏమైంది?
–టీడీపీ పాలనలో కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి
– నాలుగేళ్లుగా బాదుడే బాదుడు
– నిరుద్యోగ భృతి కింది ప్రతి ఇంటికి రూ.96 వేలు బాకీ
–  బాబు పాలనలో మందు షాపు లేని గ్రామం ఏదైనా ఉందా?
– హోదా కోసం పోరాడకుండా సైకిల్‌ తొక్కుతున్నారు.
– ఐదుగురు ఎంపీలు ప్రాణాలు ఫణంగా పెట్టి దీక్షకు కూర్చున్నారు
–  25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే దేశం మొత్తం చర్చ జరుగుతుంది
– బాబు డ్రామాలు ఆడటం మానుకోవాలి 
– ఆంధ్రులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
–  ఎంపీలను బాబు తన స్వార్థం కోసం వాడుకుంటున్నారు
– ఆసుపత్రి ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కిందనే పరిగణిస్తాం
– దేశంలో ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తాం
– దీర్ఘకాల రోగాలతో బాధపడే వారికి రూ.10 వేలు పింఛన్‌
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌

గుంటూరు: నాలుగేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై ఎక్కడా విచారణ చేపడుతారో అన్న భయం చంద్రబాబుకు పట్టుకుందని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం హోదాలో కేంద్రాన్ని అడిగి ఉంటే ఎప్పుడో వచ్చేదన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆయన ధ్వజమెత్తారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తెనాలి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

ఎండలు తీక్షణంగా ఉన్నాయి. ఎండకాలం వచ్చింది. మండుతున్న ఎండలను ఏ  ఒక్కరూ ఖాతరు చేయడం లేదు. దారి పొడవునా వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగు వేశారు. ఒకవైపు ఉన్న కష్టాలను బాధలను చెప్పుకుంటున్నారు. మరోవైపు అర్జీలు ఇస్తున్నారు. ఇంకోవైపు నా భుజాన్ని తడుతూ అన్నా..మేమంతా నీకు తోడుగా ఉన్నామని నాతో పాటు అడుగులు వేస్తున్నారు. ఏ ఒక్కరికి ఊడా నాతో పాటు ఎండలో నడవాల్సిన అవసరం లేదు. నాతోపాటు నడుచుకుంటూ వచ్చి ఇలా నిల్చుండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇవేవి లెక్క చేయకుండా చిక్కని చిరున వ్వులతో ఆప్యాయతలు చూపుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు.

– తెనాలి ప్రాంతాన్ని ఆంధ్ర ప్యారీస్‌గా కూడా పిలుస్తారు.కవులకు, కళాకారులకు ఇది నిలయం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్ట దిగ్గజాల్లో ఒక్కరైనా తెనాలి రామకృష్ణుడు ఇక్కడి వారే. ఇంతటి చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని పచ్చ తొక్కాలు పీక్కుతింటున్నారు.  ఇవాళ ఇక్కడికి వచ్చే సమయంలో అడుగడుగునా నాకు చెబుతున్న ప్రధాన సమస్య ఏంటో తెలుసా? అన్నా..కృష్ణా నదిని ఇష్టం వచ్చినట్లు ఇసుకను దోచుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. ముళ్లంగి, వల్లభాపురం నుంచి నాలుగు, ఐదు వేల లారీలతో రోజు ఇసుకను తరలిస్తున్నారు.ఇదే తెనాలి సీఎం క్యాంపు ఆఫీస్‌కు 30 కిలోమీటర్ల దూరం కూడా లేదు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ చుట్టూ చూస్తే కిలోమీటర్‌ దూరంలోని ఉద్దండరాయపాలెం, వెంకటాయపాలెం వంటి గ్రామాల్లో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఇసుక మాఫియాతో లూటీ చేస్తున్నారు. సీఎం సమక్షంలో జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీలు, కలెక్టర్‌ వరకు లంచాలు, చిన్నబాబు, పెద్దబాబు జేబుల్లోకి లంచం సొమ్ము వెళ్తోంది. పెద్దబాబు పై నుంచి దగ్గరుండి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. ఇంత అన్యాయంగా ముఖ్యమంత్రి భాగస్వామి ఉండి ఇసుకను దోచుకుంటుంటే ఏ పేపర్‌ పట్టించుకోవడం లేదు. ఇవాళ ఇసుక ఎక్కువగా తవ్వి భూగర్భ జలాలు ఇంకిపోతున్నా పట్టించుకోవడం లేదు. 
–మట్టి నుంచి కూడా మాఫియా చేయవచ్చు అన్న ఆలోచన దేశంలో ఎవరికి వచ్చి ఉండదు. ఒక్క చంద్రబాబుకే అది సాధ్యం. చెరువులను ఎడాపెడా తవ్వేస్తున్నారు. మట్టి నుంచి ఇసుక దాకా, కాంట్రాక్టర్లు, మద్యం, బొగ్గు, గుడిభూములను కూడా వదలకుండా దోచేస్తున్నారు.

– చాలా మంది నా వద్దకు వచ్చి నాతో అన్న మాట ఏంటో తెలుసా?మా ఎమ్మెల్యే ఆలపాటి ..కబ్జాల్లో ఘనపాటి అని చెబుతున్నారు. విజయవాడలోని శాతవాహన భూముల నుంచి గుంటూరు మైనార్టి ఆస్తుల వరకు ఏదీ కూడా వదలిపెట్టడం లేదని ప్రజలు మాట్లాడుతున్నారు. సీఎం భాగస్వామిగా ఉండి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారు.
 
– రైతులు అవస్థలు పడుతుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. తెనాలికి నీరు ఇవ్వాలని ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి రూ.95 కోట్లతో ప్రకాశం బ్యారేజి నుంచి నీరు తెచ్చేందుకు పైప్‌లైన్‌ పనులు ప్రారంభించారు. ఇంకా ఆ పనులు పూర్తి కాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పనులు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోవడం లేదు. కానీ చంద్రబాబుకు లంచాలు ఇస్తే చాలు..కొక్కోకోలా ఫ్యాక్టరీకి నీరు సరఫరా చేస్తారు. ప్రజలకు మాత్రం తాగేందుకు నీరు ఇవ్వడం లేదు.
 
– చంద్రబాబు పాలనను ఒక్కసారి గమనించమని కోరుతున్నాను. 5 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదని రైతులు లబోదిబో అంటున్నారు. అన్నా..ఈ ప్రాంతానికి ఎత్తిపోతల ద్వారా నీరు ఇవ్వాలని వినతులు ఇస్తున్నా..ఎవరు పట్టించుకోవడం లేదని రైతులు కన్నీరు పెడుతున్నారు.
 
– రైతులు నా వద్దకు వచ్చి అన్నా..జోన్న వేశాం. క్వింటాల్‌ రూ.900లకు అడుగుతున్నారని చెబుతున్నారు. మొక్కజొన్న రూ.1000లకు అడిగే నాథుడు లేడని చెబుతున్నారు. కిలో ఉప్పు రూ.18 అమ్ముతున్నారు. కిలో జొన్న రూ.10లకు కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. రైతులు మిర్చి వేసుకొని అల్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా నేను వచ్చి ధర్నా చేస్తే తప్పా..ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. మినుము పరిస్థితి అంతే, పెసలు, పత్తి,  కంది, శనగ ఇలా అన్ని పంటలకు మద్దతు ధర కరువైంది.ఇవాళ ఏం జరగాలన్నా లంచాలు లేనిది పని జరగడం లేదు. పైన చంద్రబాబు లంచాలు తీసుకుంటున్నారు. కింద జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుంటున్నారు. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే. రేషన్‌కార్డు కోసం కార్యాలయం వద్దకు వెళ్తే మీరు ఏ పార్టీ అని అడుగుతున్నారు. ఇంత దారుణంగా పాలన సాగిస్తున్నారు.
 
– నాలుగేళ్లుగా చంద్రబాబు పాలన చూశారు. ఒక్కసారి ఈ పాలన గుర్తుకు తెచ్చుకోండి. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టి ఆలోచన చేయమని కోరుతున్నాను. మీలో ఏ  ఒక్కరైనా కూడా సంతోషంగా ఉన్నారా? ఇదే పెద్ద మనిషి నాలుగేళ్ల క్రితం ముఖ్యమంత్రి అ య్యేందుకు రైతుల వ్యవసాయ రుణాలు రూ.87 వేల కోట్లు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత మీ అందరిని అడుగుతున్నాను..మీ బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల నుంచి మాత్రం వేలం నోటీసులు ఇంటికి వస్తున్నాయి. చంద్రబాబు చేస్తామన్న రుణమాఫి రైతులకు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు.
 
– నాలుగేళ్ల క్రితం చంద్రబాబు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకోండి. ఇంట్లో అక్కా చెల్లెమ్మలు కంట తడి పెడితే అరిష్టమని అబద్ధాలు మాట్లాడరు. కానీ చంద్రబాబు ఓట్ల కోసం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో ఒక్కరూపాయి అయినా మాఫీ అయ్యిందా? 

– చదువుకుంటున్న పిల్లలను మోసం చేయాలంటే నాలుగు సార్లు ఆలోచన చేస్తారు. ఉసురు తగుతుందని భయపడుతారు. కానీ ఆ రోజు చంద్రబాబు ఏమన్నారు..జాబు రావాలంటే బాబు రావాలన్నారు.ఇంటింటికి మనిషిని పంపించారు. అమ్మా చంద్రబాబు మీకు లెటర్‌ పంపించారు. ప్రతి  ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పమన్నాడని ఆ పార్టీ నాయకులు చెప్పారు. ఎప్పుడైనా చంద్రబాబు ఈ దారిలో కనిపిస్తే రూ.96 వేలు ఎప్పుడిస్తావని నిలదీయండి.
 
– పిల్లలు తాగి చెడిపోతున్నారని ఇదే పెద్ద మనిషి నాలుగేళ్ల క్రితం అన్నారు. అధికారంలోకి వస్తునే బెల్ట్‌షాపులు తీసేస్తాను అన్నారు. ఇవాళ ఏ గ్రామంలోనైనా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉందో లేదో తెలియదు కానీ, మందు షాపు లేని గ్రామం లేదు. ఫోన్‌ కొడితే మాత్రం మందు బాటిల్‌ ఇంటికి తెస్తారు.

– నాలుగేళ్ల క్రితం చంద్రబాబు ఏమన్నారు. కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తామన్నారు. బాబు సీఎం కాకముందు కరెంటు బిల్లు రూ.100, 200 వచ్చేది. ఇప్పుడు ప్రతి ఇంటికి రూ.500, 1000 చొప్పున బిల్లు వస్తోంది. ఏమీ లేకపోయినా కూడా రూ.10 వేలు జరిమానాలు విధిస్తున్నారు. 

– గతంలో రేషన్‌షాపుకు వెళ్తే బియ్యం, కందిపప్పు, కిరోసిన్, చక్కెర వంటి 9 రకాల సరుకులు ప్యాక్‌ చేసి ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యం తప్ప మరేమి దొరకడం లేదు. అందులో కూడా వేలిముద్రలు పడటం లేదని కోత విధిస్తున్నారు. 

– ఏ రాష్ట్రంలో లేని వి«ధంగా మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో మన కంటే రూ.7 తక్కువకు పెట్రోల్‌ పోస్తున్నారు. అడ్డగోలుగా చంద్రబాబు రూ.7 లీటర్‌పై బాదుతున్నారు. నాలుగేళ్లుగా బాదుడే బాదుడు.

– చంద్రబాబు చేసిన అన్యాయం, ఘోరం ఏంటో తెలుసా? ఈయన చేతిలో ఉండి, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అడిగి ఉంటే మనకు వచ్చేది. గట్టిగా అడిగి ఉంటే ఈ పాటికి హోదా వచ్చి ఉండేది. ప్రధానిని గట్టిగా నిలదీసి ఉంటే మన పరిస్థితి మారేది. ఈ పెద్ద మనిషి చేస్తున్న మోసం ప్రజలను ప్రత్యేక హోదా విషయంలో మభ్యపెట్టడమే. ఇవాళ మన పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేపట్టారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశానికి చూపాలని ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఈ ఐదుగురు ఎంపీలకు తోడు 25 మంది ఎంపీలు ఒకతాటిపైకి వచ్చి రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేసి ఉంటే దేశం మొత్తం చర్చనీయాంశం అయ్యేది. ప్రధాని దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేవారు కాదా? అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చేస్తున్నది ఏంటో తెలుసా? అఖిలపక్షం అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయించడం లేదు. ఇదే పెద్ద మనిషి సిగ్గు లేకుండా ఏపీకి చెందిన ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఇవాళ ఏమి జరగనట్లుగా సైకిల్‌ తొక్కుతుంటే ఈయన ఒక మనిషేనా? నలబై ఏళ్ల అనుభవం అంటారు. నీ అనుభవం ఏమైంది? మోసం చేయడానికేనా? చంద్రబాబు నైజం ఎలాంటిదంటే అధికారం కోసం ఏదైనా చేస్తారు. సొంత కూతురును ఇచ్చిన మామ ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. ఎన్నికల సమయంలో ఆయన ఫోటోకు దండం పెడతారు. ప్రత్యేక హోదా విషయంలో వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ఏమీ జరగనట్లు సైకిల్‌ యాత్ర చేస్తున్నారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగివస్తుందని తెలుసు.. కారణం చంద్రబాబుకు వణుకు మొదలైంది. నాలుగేళ్లుగా విచ్చలవిడిగా తిన్నారు కదా? ఎక్కడైనా విచారణ జరుగుతుందనే భయం చంద్రబాబుకు ఉంది. ఈ ఎంపీలు ఉంటే పార్లమెంట్‌లో ధర్నా చేస్తారని దారుణంగా ఆలోచన చేస్తున్నారు.

– మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టి ఇలాంటి అన్యాయం చేసే వ్యక్తిని పొరపాటున క్షమిస్తే..రేపు పొద్దున ఏం చేస్తారో తెలుసా? చిన్న చిన్న అబద్ధాలు నమ్మరని ఆయనకు తెలుసు. రేపు పొద్దున మీ వద్దకు వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు. నమ్ముతారా? నమ్మరు అన్న సంగతి ఆయనకు తెలుసు..కాబట్టి ఏం చేస్తారో తెలుసా? కేజీ బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి బెంజికారు కొనిస్తా అంటారు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి ప్రతి ఇంటికి తన మనిషిని పంపించి రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బులు మాత్రం వద్దు అనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బు మనదే. కానీ ఓటు వేసే సమయంలో మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి. మోసం చేసేవాళ్లను, అబద్ధాలు చెప్పేవారిని బంగాళఖాతంలో కలిపేయండి. రాజకీయాల్లో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది.

– రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలని నవరత్నాలు అన్న పథకాలను ప్రకటించాం. ప్రతి మీటింగ్‌లో కొన్ని అంశాలను చెబుతున్నాను. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదవాడి ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తామన్నది చెబుతున్నాను.

–ఒక్కసారి నాన్నగారి పాలన గుర్తుకు తెచ్చుకోండి. నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు. పేదవారు అప్పుల పాలు అయ్యేది తన పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు, ఆ కుటుంబంలో ఎవరికైనా వ్యాధి వచ్చినప్పుడు వారిని బతికించేందుకు వడ్డీలకు అప్పులు చేయడంతో అప్పులపాలు అయ్యేవారు. అలాంటి పరిస్థితి ఏ పేదవారికి రాకుడదనే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే కుయ్‌..కుయ్‌ అంటూ 20 నిమిషాల్లో ఆ పేదవాడిని ఆసుపత్రికి తరలించేవారు. ఇవాళ నాన్నగారు చనిపోయిన తరువాత పరిస్థితి ఏంటి? 108కు ఫోన్‌ కొడితే అంబులెన్స్‌ వస్తుందా? ఇవాళ 108 ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. అంబులెన్స్‌కు పెట్రోల్‌ పోయడం లేదు. రెండు, మూడు మండలాలకు ఒక్క అంబులెన్స్‌ పెట్టారు. ఇవాళ పేదవాడికి ఏదైనా రోగం వస్తే చికిత్సల కోసం హైదరాబాద్‌ వంటి నగరానికి వెళ్తారు. అక్కడ మంచి ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టి అందరూ అక్కడికి వెళ్తారు. కానీ ఇవాళ చంద్రబాబు హయాంలో ఆపరేషన్‌ చేయించుకునేందుకు హైదరాబాద్‌ వెళ్తే ఆరోగ్యశ్రీ కట్‌ అంటున్నారు. నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు 8 నెలలుగా బకాయిలు చెల్లించడం లేదు. పేదవారికి నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వైద్యం అందడం లేదు. ఎవరికైనా క్యానర్‌ వంటి రోగాలు వస్తే పరిస్థితి ఏంటీ? Mî మో థెరఫి చేయడం లేదు. పేషేంట్‌ అటునుంచి అటే వెళ్లిపోయే పరిస్థితి ఉంది. మూగ, చెవుడు ఉన్న పిల్లలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. అటువంటి పిల్లలకు ఆపరేషన్‌ చేయించేందుకు మహానేత తోడుగా ఉండేవారు. ఇవాళ అలాంటి పిల్లలకు ఆపరేషన్లు చేయించడం లేదు. కిడ్నీ పేషేంట్లకు డయాలసిస్‌ చేయడం లేదు. వారానికి డయాలసిస్‌కు రూ.6 వేలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేయడం లేదు. ఈ పరిస్థితి నుంచి ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేస్తామంటే..నాన్నగారు పేదవారి కోసం  ఒక్క అడుగు ముందుకు వేస్తే..జగన్‌ నాన్నగారి కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేస్తాను. పేదవాడి వైద్యం ఖర్చు వెయ్యి దాటితే చాలు ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తాను. ఉచితంగా వైద్యం అందిస్తాను. ప్రతి పేదవాడికి ఆపరేషన్‌ చేయించడమే కాదు..డాక్టర్లు రెస్టు తీసుకోమని చెబుతారు. ఆ సమయంలో ఆ కుటుంబం పస్తులు ఉండకూడదని విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటాను. ఏ పేదవాడు కూడా పస్తు పడుకునే పరిస్థితి రానివ్వను. హైదరాబాద్, బెంగలూరు వెళ్తే ఆపరేషన్‌ చేయించను అని చంద్రబాబు అంటున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఎక్కడ ఆపరేషన్‌ చేయించుకున్నా ఉచితంగా చేయిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల రూ.10 వేలు పింఛన్‌ ఇస్తామని మాట ఇస్తున్నాను.  దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తామన్నది చెబుతున్నాను.

– అవ్వ తాతలకు పింఛన్‌ పెంచమంటే చంద్రబాబుకు మనసు రావడం లేదు. పింఛన్‌ పెంచితే జన్మభూమి కమిటీలకు మాత్రమే లంచాలు వస్తాయి. అదే కాంట్రాక్ట్‌లకు రేట్లు పెంచితే చంద్రబాబుకు కమీషన్లు వస్తాయి. అవ్వతాతలకు చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం వచ్చాక నాన్నగారు పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాను. పింఛన్‌ వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాను. ప్రతి నెల రూ.2 వేలు పింఛన్‌ ఇస్తానని చెబుతున్నాను. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెబుతున్నాను. వీరందరికి 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తానని, రూ.2 వేల చొప్పున  ఇస్తామని చెబుతున్నాను. ఇందులో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే మీ అందరికి తెలుసు..నేను ఎక్కడ ఉన్నానో, ఎక్కడ నడుచుకుంటు పోతున్నానో తెలుసు. ఎవరైనా సలహాలు ఇవ్వవచ్చు. చెడిపోయిన ఈ వ్యవస్థను బాగు చేసేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతూ..సెలవు తీసుకుంటున్నాను..
 
Back to Top